అచ్చం దిష్టిబొమ్మల్లా మంత్రులు: కేసుల లెక్కల్లో తేడా: కేసీఆర్ సర్కార్పై బండి సంజయ్ గుస్సా..
తెలంగాణ మంత్రులపై బీజేపీ చీఫ్ బండి సంజయ్ ఫైరయ్యారు. వారు దిష్టిబొమ్మల్లా తయారయ్యారని మండిపడ్డారు. రహదారులు మంజూరు చేయని ఆర్ అండ్ బీ మంత్రి, హోంగార్డును బదిలీ చేయని హోంమంత్రి, కొత్త బస్ శాంక్షన్ చేయని ట్రాన్స్ పోర్ట్ మినిస్టర్, పనుల కోసం నిధులు మంజూరు చేయని ఫైనాస్స్ మినిస్టర్.. అచ్చం బొమ్మల్లాగే ఉన్నారని ధ్వజమెత్తారు.
రాష్ట్రంలో పనులు జరగడం లేదు అని అడిగితే.. తమపై విమర్శలు చేస్తున్నారని దుయ్యబట్టారు. బండి సంజయ్ గురువారం వేములవాడ పట్టణంలో 16, 26 వార్డులో పర్యటించారు. సీసీ రోడ్, డ్రైనేజీ కోసం భూమి పూజ చేసి.. తర్వాత హరితహారంలో భాగంగా మొక్కలు నాటారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. మంత్రుల తీరు తనదైనశైలిలో విరుచుకుపడ్డారు.
ఎందుకు తేడా...?
కరోనా వైరస్ పాజిటివ్ కేసులకు సంబంధించి హెల్త్ బులెటిన్, అధికారులు చెబుతున్న లెక్కలకు పొంతన లేదని చెప్పారు. పాజిటివ్ కేసుల సంఖ్యలో తేడాలు స్పష్టంగా కనిపిస్తున్నాయని చెప్పారు. కరోనా పరీక్షలు చేయని కేసీఆర్ ప్రభుత్వం తమపై విమర్శలు చేయడం సరికాదన్నారు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో జరుగుతున్న టెస్టుల వివరాల డేటాను చదివారు. ఉత్తరప్రదేశ్లో 5 లక్షలు, గుజరాత్, మధ్యప్రదేశ్ 3 లక్షల చొప్పున మందికి కరోనా పరీక్షలు చేశామని పేర్కొన్నారు.
పక్కదారి పట్టకుండా ఉంటే...
కరోనా వైరస్ వల్ల ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టేందుకు ఆత్మనిర్భర్ నిధులు కేటాయిస్తే.. సీఎం కేసీఆర్ తప్పుపట్టడం సరికాదని బండి సంజయ్ అన్నారు. కేంద్ర ప్రభుత్వం కేటాయిస్తున్న నిధులు పక్కదారి పట్టకుండా నేరుగా వినియోగదారులకే చేరుతున్నాయని చెప్పారు. దీనిని సీఎం కేసీఆర్ జీర్ణించుకోలేకపోతున్నారని ఆరోపించారు. అందుకే విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు.
చేతులెత్తేశారు...?
తెలంగాణ రాష్ట్రంలో కరోనా వైరస్ పాజిటివ్ కేసులు వేగంగా వ్యాపిస్తుంటే.. కేసీఆర్ ఏం చేస్తున్నారని బండి సంజయ్ ప్రశ్నించారు. రాష్ట్రాన్ని కాపాడే స్థాయిలో ఆయన లేరు అని.. చేతులు ఎత్తేశారని అర్థం అవుతోందన్నారు. కరోనా వైరస్ చికిత్సను ఆరోగ్య శ్రీ పరిధి నుంచి ఎందుకు తీసివేవారని ప్రశ్నించారు. వైరస్ సోకిన నిరుపేదలు ఏం చేయాలని ఆయన ప్రశ్నించారు. కొత్తపల్లి-మనోహరాబాద్ రైల్వే లైన్ అలైన్ మెంట్ సర్వే నంబర్లలో కాక ఇతర సర్వే నంబర్లలో అధికారులు ఎందుకు సర్వే చేస్తున్నారని బండి సంజయ్ ప్రశ్నించారు.