అన్నీ చూసి, మెట్రోలో ప్రయాణించిన టి మంత్రులు: కాంగ్రెస్కు మరో దెబ్బ, ప్రతాప్ రిజైన్
హైదరాబాద్: తెలంగాణ మంత్రులు కల్వకుంట్ల తారక రామారావు, తలసాని శ్రీనివాస్ యాదవ్, పద్మారావు, ఉప ముఖ్యమంత్రి మహమూద్ అలీలు శుక్రవారం నాడు మెట్రో రైలులో ప్రయాణించారు. మెట్టుగూడ నుంచి నాగోల్ మార్గంలో ట్రయల్ రన్ జరుపుతున్న మెట్రోలో వారు కలిసి ప్రయాణించారు.
మంత్రులకు మెట్రో రైలు అధికారులు, ఎల్ అండ్ టి ప్రతినిధులు స్వాగతం పలికారు. రైల్వే స్టేషన్లో అత్యాధునిక వ్యవస్థను పరిశీలించిన అనంతరం మంత్రులు మెట్రో రైలు ఎక్కారు. మెట్రో రైలు పని తీరుతో పాటు సౌకర్యాలను వారు అడిగి తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా మంత్రి తలసాని మాట్లాడుతూ... మెట్రో రైలుతో ప్రయాణ సమయం చాలా వరకు తగ్గిపోతుందన్నారు. మెట్రో సైవోలను వీలైనంత త్వరగా ప్రజలకు అందించాలని ముఖ్యమంత్రి కెసిఆర్ కృషి చేస్తున్నారన్నారు. మెట్రో రైలుతో హైదరాబాద్ రూపురేఖలే మారిపోతాయన్నారు.
మంత్రి కెటిఆర్ మాట్లాడుతూ... మెట్రో రైలులో ప్రయాణం తనకు అద్భుత అనుభూతినిచ్చిందన్నారు. అంతర్జాతీయ ప్రమాణాలతో మెట్రో రైలు రూపుదిద్దుకుందని, ప్రజలను సురక్షితంగా, వేగంగా గమ్యానికి చేర్చడమే మెట్రో వ్యవస్థ లక్ష్యమన్నారు. మెట్రో కోసం తెలంగాణ ప్రభుత్వం తరపున రూ.3వేల కోట్లు ఖర్చు పెడుతున్నట్టు చెప్పారు.
కాంగ్రెస్కు మరో దెబ్బ: కెఎం ప్రతాప్ రాజీనామా
తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి మరో షాక్ తగిలింది. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, రంగారెడ్డి జిల్లా డీసీసీ మాజీ అధ్యక్షుడు కెఎం ప్రతాప్ రాజీనామా చేస్తున్నట్టు చెప్పారు. కుత్బుల్లాపూర్లోని తన నివాసంలో ఆయన మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీ పైన మండిపడ్డారు.
కాంగ్రెస్ ప్రస్తుతం ప్రయివేట్ లిమిటెడ్ పార్టీగా మారిందన్నారు. త్వరలోనే తన భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తానని చెప్పారు. రంగారెడ్డి జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడిగా పనిచేసిన ప్రతాప్.. గతేడాది సార్వత్రిక ఎన్నికల సమయంలో పార్టీకి వ్యతిరేకంగా పని చేశారని ఆరోపణలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఆయనకు పీసీసీ షోకాజ్ నోటీసులు కూడా జారీ చేసింది. అనంతరం నుంచి పార్టీ కార్యకలాపాలకు ఆయన దూరంగా ఉంటున్నారు.