ఎమ్మెల్సీ ఎన్నికల్లో కారు జోరు: ఆరు స్థానాల్లో క్లీన్స్వీప్: గెలిచిన అభ్యర్థులు వీరే..
హైదరాబాద్: తెలంగాణలో నిర్వహించిన స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో అధికార పార్టీ హవా కొనసాగింది. ఏకపక్ష విజయాన్ని సాధించింది. ఎమ్మెల్సీ పోలింగ్ ఓట్ల లెక్కింపు కొద్దిసేపటి కిందటే పూర్తయింది. ఆరు స్థానాల్లోనూ తెలంగాణ రాష్ట్ర సమితి అభ్యర్థులు గెలుపొందారు. టీఆర్ఎస్ క్లీన్స్వీప్ చేసింది. స్థానిక సంస్థల్లో మెజారిటీ స్థానాలు టీఆర్ఎస్ ఆధీనంలోనే ఉన్నాయి. ఎక్కడా క్రాస్ ఓటింగ్ చోటు చేసుకోలేదు. స్థానిక సంస్థల ప్రతినిధులు తమ పార్టీ అభ్యర్థులను గెలిపించుకున్నారు. ఫలితంగా ఈ ఎన్నికలు ఏకపక్షం అయ్యాయి.

వార్ వన్సైడ్
ఈ నెల 10వ తేదీన నిర్వహించిన ఈ ఎన్నికల ఓట్ల లెక్కింపు ఈ ఉదయం 8 గంటలకు ఆరంభమైంది. ఉమ్మడి ఖమ్మం, నల్లగొండ, కరీంనగర్, మెదక్ జిల్లాల్లో ఈ ఎన్నికల్లో స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ ఇదివరకే ముగిసింది. ఓట్లను లెక్కించడానికి అయిదు చోట్ల కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఓట్ల లెక్కింపు మొదలు పెట్టిన మూడు గంటల్లో పూర్తి ఫలితాలు వెలువడ్డాయి. అన్ని చోట్లా టీఆర్ఎస్ హవా కొనసాగింది.

ఖమ్మంలో తాతా మధు..
కరీంనగర్లో టీఆర్ఎస్ తరఫున పోటీ చేసిన ఎల్ రమణ, భాను ప్రసాదరావు విజయం సాధించారు. ఖమ్మంలో తాతా మధుసూదన్, నల్లగొండలో ఎంసీ కోటిరెడ్డి గెలుపొందారు. మెదక్లో యాదవ రెడ్డి, ఆదిలాబాద్లో దండే విఠల్ తమ ప్రత్యర్థులపై పైచేయి సాధించారు. తాతా మధుసూదన్ 247 ఓట్ల అధిక్యంతో గెలుపొందారు. మొత్తం 738 ఓట్లు పోల్ కాగా.. టీఆర్ఎస్ అభ్యర్థికి 486 ఓట్లు పడ్డాయి. కాంగ్రెస్ అభ్యర్థి రాయల నాగేశ్వరరావుకు 239 ఓట్లు వచ్చాయి. తొలి ప్రాధాన్యత ఓట్ల ఆధారంగా తాతా మధుసూదన్ విజయం సాధించినట్లు రాష్ట్ర ఎన్నికల కమిషన్ అధికారులు ప్రకటించారు.

ఆదిలాబాద్లో దండే విఠల్..
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో కారు జోరు కొనసాగింది. టీఆర్ఎస్ తరఫున పోటీ చేసిన దండే విఠల్ ఘన విజయం సాధించారు. తన సమీప ప్రత్యర్థి, ఇండిపెండెంట్ గా పోటీ చేసిన పుష్కరంపై 666 ఓట్ల మెజారిటీని నమోదు చేశారు. మొత్తం 862 మంది స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. టీఆర్ఎస్కు 740 ఓట్లు పడ్డాయి. స్వతంత్ర అభ్యర్థి 74 ఓట్లు పోల్ అయ్యాయి. 48 ఓట్లు చెల్లలేదు.

మెదక్లో యాదవ రెడ్డి..
రాజకీయంగా ప్రాధాన్యత ఉన్న ఉమ్మడి మెదక్ జిల్లాలోనూ టీఆర్ఎస్ తన గులాబీ జెండాను ఎగురవేసింది. జైత్రయాత్రను కొనసాగించింది. టీఆర్ఎస్ అభ్యర్థి యాదవరెడ్డి భారీ ఆధిక్యంతో విజయ ఢంకా మోగించారు. ఈ జిల్లాలో మొత్తం పోల్ అయిన ఓట్లు 1,018. ఇందులో యాదవరెడ్డికి 762 ఓట్లు పోల్ అయ్యాయి. తన సమీప ప్రత్యర్థి, కాంగ్రెస్కు చెందిన నిర్మల జగ్గారెడ్డిని భారీ తేడాతో ఓడించారు. కాంగ్రెస్ అభ్యర్థికి 238 ఓట్లు పడ్డాయి. ఇక్కడ మొత్తం 12 ఓట్లు చెల్లనివిగా గుర్తించారు అధికారులు.

కరీంనగర్లో ఆ రెండూ..
ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో టీఆర్ఎస్ జైత్రయాత్ర కొనసాగింది. ఈ జిల్లాలో టీఆర్ఎస్ నుంచి ఇద్దరు అభ్యర్థులు ఎల్ రమణ, భానుప్రసాద్ గెలుపొందారు. మొత్తం ఓట్లు 1,320. ఇందులో ఎల్ రమణ-479, భానుప్రసాద్-584 ఓట్లు పోల్ అయ్యాయి. 17 ఓట్లు చెల్లనివిగా గర్తించారు ఎన్నికల సిబ్బంది. ఎల్ రమణ.. ఇదివరకు తెలుగుదేశం పార్టీ తెలంగాణ రాష్ట్ర శాఖ అధ్యక్షుడిగా పనిచేశారు. పార్టీ పుంజుకొనే అవకాశాలు ఏ మాత్రం కనిపించకపోవడంతో ఆయన టీఆర్ఎస్లో చేరారు. టీఆర్ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్.. ఆయనను స్థానిక సంస్థల ఎన్నికల కోటాలో ఎమ్మెల్సీ అభ్యర్థిగా నిలబెట్టారు. ఈ ఎన్నికల్లో ఆయన విజయం సాధించారు.












Click it and Unblock the Notifications