Mutton ప్రియులకు గుడ్న్యూస్: 12న తెలంగాణ మటన్ క్యాంటీన్ ప్రారంభం
హైదరాబాద్: మటన్ ప్రియులకు శుభవార్త. రాష్ట్ర ప్రభుత్వం గొర్రెలు, మేకల అభివృద్ధి సమాఖ్య ఆధ్వర్యంలో హైదరాబాద్ మాసాబ్ట్యాంక్ సమీపంలోని శాంతినగర్లో తెలంగాణ మటన్ క్యాంటీన్ను సెప్టెంబర్ 12న ప్రారంభించనుంది. తక్కువ ధరకు నాణ్యమైన మటన్ బిర్యానీ, ఇతర మాంసాహార వంటకాలను దీని ద్వారా విక్రయిస్తారు.
ఇప్పటికే శాంతినగర్లో ప్రారంభమైన చేపల క్యాంటీన్కు మంచి ఆదరణ లభించడంతో మటన్ క్యాంటీన్పై గొర్రెలు, మేకల అభివృద్ధి సమాఖ్య దృష్టి సారించింది. దీనికి ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్లు అనుమతించడంతో పనులు మొదలయ్యాయి. సమాఖ్య కేంద్ర కార్యాలయం సమీపంలో క్యాంటీన్ నిర్మించారు.

కాగా, మటన్ బిర్యానీ , పాయా, గుర్దా ఫ్రై, పత్తర్ కా గోష్ట్, ఖీమా వంటి మటన్ వంటకాలను అందించనున్నారు. ఈ మటన్ క్యాంటీన్లలో మొదటిది శాంతినగర్ కాలనీలోని ఫెడరేషన్ కార్యాలయంలో ఏర్పాటు చేయబడుతోంది. వీటిని త్వరలోనే ప్రారంభించే అవకాశం ఉంది. మెనూ, ధరలు ఇంకా ఖరారు కానప్పటికీ.. సరసమైన ధరలకు పరిమితమైన వంటకాలతో వీటిని రూపొందించనున్నారు.
శాంతినగర్లో ఇప్పటికే చేపల క్యాంటీన్ నడుస్తోంది. ఫిష్ భవన్ సమీపంలో ఈ క్యాంటీన్ ఉంది. ఇందులో ఫిష్ కర్రీతోపాటు ఫిష్ బిర్యానీ అందిస్తున్నారు. ఫిష్ క్యాంటీన్లో ఫిష్ బిర్యానీ, అన్నంతో ఫిష్ కర్రీ, ఫిష్ ఫ్రై మొదలైనవి ఉన్నాయి. వీరు అందించే వంటకాలకు మంచి పేరు కూడా వచ్చింది. వీటికి మంచి ఆదరణ లభించడంతో మటన్ క్యాంటీన్పై గొర్రెలు, మేకల అభివృద్ధి సమాఖ్య సిద్ధమైంది.
కాగా, ముందుగా హైదరాబాద్ నగరంలో మటన్ క్యాంటీన్ ప్రారంభించి అన్ని జిల్లా కేంద్రాలకు విస్తరిస్తామని సమాఖ్య ఛైర్మన్ దూదిమెట్ల బాలరాజు యాదవ్ తెలిపారు. రాష్ట్రంలో గొర్రెల పంపిణీ పథకం ద్వారా గొర్రెల సంఖ్య పెద్ద ఎత్తున పెరిగిందన్నారు. అయినా మటన్ ధరలు తగ్గకపోవడంతో ప్రభుత్వ ఆధ్వర్యంలో క్యాంటీన్లను ప్రారంభిస్తున్నట్లు తెలిపారు. అంతేగాక, మొబైల్ క్యాంటీన్లను కూడా నిర్వహించాలనే యోచనలో ఉన్నట్లు తెలిపారు.












Click it and Unblock the Notifications