కు.ని ఆపరేషన్ చేయించుకున్న మరో మహిళ మృతి, వైరల్ ఫీవరేనంటూ అధికారులు
హైదరాబాద్: తెలంగాణలో కుటుంబ నియంత్రణ(కు.ని) ఆపరేషన్ చేయించుకున్న మరో మహిళ ప్రాణాలు కోల్పోయింది. హైదరాబాద్ నగరంలోని పేట్లబురుజు ఆస్పత్రిలో రెండ్రోజుల క్రితం ఓ మహిళకు వైద్యులు ఆపరేషన్ చేశారు. అనంతరం మహిళకు వాంతులు, విరోచనాలు కావడంతో మెరుగైన వైద్యం కోసం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. ఉస్మానియాలో చికిత్స పొందుతూ ఆమె మృతి చెందారు.
అయితే, ఆ మహిళ మృతి ఘటనపై డీఎంఈ రమేష్ రెడ్డి స్పందించారు. ఆస్పత్రి సూపరింటెండెంట్, ఆపరేషన్ చేసిన వైద్య సిబ్బందితో చర్చించిన తర్వాత ఆయన మీడియాతో మాట్లాడారు. పేట్లబురుజు ఆస్పత్రిలో కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేయించుకున్న మహిళ వైరల్ ఫీవర్ వల్లే మృతి చెందారని తెలిపారు.

ఆ మహిళకు ఆపరేషన్ జరిగిన రోజే ఆస్పత్రిలో మరో 9 మందికి శస్త్రచికిత్స చేశారని, వీరిలో మరో ఇద్దరు మహిళలకు కూడా వైరల్ ఫీవర్ వచ్చిందని చెప్పారు. జ్వరం వచ్చిన ఇద్దరి ఆరోగ్య పరిస్థితి బాగానే ఉందని డీఎంఈ రమేష్ రెడ్డి వెల్లడించారు.
కాగా, ఇటీవల రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం ఆస్పత్రిలో కుటుంబ నియంత్రణ చికిత్సలు చేయించుకున్న నలుగురు మహిళలు మృతి ఘటన రాష్ట్రం వ్యాప్తంగా సంచలనంగా మారిన విషయం తెలిసిందే. దీంతో పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. కాగా, బాధ్యులైన వారిపై చర్యలు తీసుకుంది ప్రభుత్వం.












Click it and Unblock the Notifications