బాబుకు షాక్, ఏకాకి!: కేసీఆర్కు 'ఏపీ' మద్దతు, జగన్ పార్టీ ట్విస్ట్
హైదరాబాద్: ఉమ్మడి రాజధాని హైదరాబాదులో సెక్షన్ 8 అమలు చేయాలన్న తెలుగుదేశం పార్టీకి తెలంగాణ రాష్ట్రంలోనే ఇతర పార్టీల నుండి మద్దతు లభించడం లేదని చెప్పవచ్చు. ఓటుకు నోటు, ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం నేపథ్యంలో సెక్షన్ 8 తెరపైకి వచ్చింది.
ఏడాది క్రితమే చంద్రబాబు సెక్షన్ 8 గురించి కేంద్రాన్ని కోరారు. కానీ, ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ నేపథ్యంలో గట్టిగా డిమాండ్ చేస్తున్నారు. సెక్షన్ 8 విషయంలో తెలంగాణ రాష్ట్రంలో టీడీపీ ఏకాకిగా మిగిలింది. సెక్షన్ 8 పెడితే తప్పేమిటని తెలంగాణ టీడీపీ నేతలు ప్రశ్నిస్తున్నారు.
కానీ, హైదరాబాదులో సెక్షన్ 8 అవసరం లేదని చెబుతున్న టీఆర్ఎస్ ప్రభుత్వం వాదననే తెలంగాణ కాంగ్రెస్, తెలంగాణ బీజేపీ ఇతర పార్టీలు బలపరుస్తున్నాయి. ఇంకా చెప్పాలంటే సెక్షన్ 8 పైన ఏపీ రాజకీయ పార్టీలు కూడా తెలంగాణకు మద్దతు పలుకుతున్నాయనే చెప్పవచ్చు.
ఏపీ కాంగ్రెస్ నేతలు మాట్లాడుతూ.. సెక్షన్ 8 ఇప్పుడు గుర్తుకు వచ్చిందా అని చంద్రబాబును నిలదీస్తున్నారు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అయితే ఓ అడుగు ముందుకు వేసి సెక్షన్ 8 అవసరం లేదని చెబుతోంది. వైసీపీ ఎమ్మెల్యే రాజేందర్ రెడ్డి మాట్లాడుతూ.. హైదరాబాదులో సెక్షన్ 8 ఉందని ట్విస్ట్ ఇచ్చారు.
కేవలం ఏపీ టీడీపీ నేతలు, మంత్రులు సెక్షన్ 8 కోసం డిమాండ్ చేస్తున్నారు. ఏపీలో చంద్రబాబును ఇరకాటంలో పెట్టేందుకు వారు దీనిని రాజకీయంగా ఉపయోగించుకుంటున్నారని చెబుతున్నారు.
హైదరాబాదులో సెక్షన్ 8 పెట్టాల్సిందేనని చెబుతున్న ఏపీ మంత్రులు అందుకు పలు నిదర్శనాలు ఉన్నాయని అంటున్నారు. తాజాగా, జేఎన్టీయూలో ప్రొఫెసర్ పైన దాడి జరగడాన్ని కూడా ఉదహరిస్తున్నారు. సెక్షన్ 8 విషయంలో బీజేపీ, సీపీఐ, కాంగ్రెస్, సీపీఎం, వైయస్సార్ కాంగ్రెస్, మజ్లిస్ పార్టీలు టీఆర్ఎస్కు మద్దతుగా నిలిచాయి.