నా కళ్లల్లో నీళ్లు తెప్పించావు: అమ్మవారిపై ఒట్టేసి చెబుతున్నా
హైదరాబాద్: తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి చెప్పినట్టే చేశారు. హైదరాబాద్ పాతబస్తీలోని భాగ్యలక్ష్మి అమ్మవారి ఆలయంలో ప్రమాణం చేశారు. భారతీయ జనతా పార్టీకి చెందిన హుజూరాబాద్ శాసన సభ్యుడు ఈటల రాజేందర్ చేసిన ఆరోపణల్లో నిజం లేదని నిరూపించుకున్నారు. భారత్ రాష్ట్ర సమితి నుంచి తనకు ఎలాంటి నిధులు అందలేదంటూ రేవంత్ రెడ్డి అమ్మవారి ఆలయంలో ప్రమాణం చేశారు.
బీఆర్ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్తో తనకు ఎలాంటి లాలూచీ లేదని, ఆయన నుంచి ఎలాంటి ముడుపులు తనకు అందలేదంటూ భాగ్యలక్ష్మి అమ్మవారి మీద ఒట్టేశారు రేవంత్ రెడ్డి. గర్భగుడిలో నిల్చుని, అమ్మవారి కండువాను భుజాన కప్పుకొని ప్రమాణం చేశారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. భయం తన ఒంట్లో లేదని, అమ్మవారి సాక్షిగా ప్రమాణం చేస్తున్నాని అన్నారు.

తాను ఇదివరకే కేసీఆర్తో రాజకీయపరమైన యుద్ధాన్ని కొనసాగించేటప్పుడు ఈటల రాజేందర్ ఎక్కడ ఉన్నారని రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. ఇదే ఈటల రాజేందర్ అప్పుడు కేసీఆర్ పంచన ఉండేవాడని గుర్తు చేశారు. కేసీఆర్కు అమ్ముడుపోయే వాడినే అయితే- ఈటల తరహాలో తాను కూడా ఆయన కేబినెట్లో మంత్రిని అయ్యే వాడినని చెప్పారు. తన చివరి రక్తపు బొట్టు ఉన్నంత వరకు, ఆఖరి శ్వాస విడిచే వరకు కేసీఆర్తో కొట్లాడుతూనే ఉంటానని స్పష్టం చేశారు.
కేసీఆర్తో రాజీ పడే ప్రసక్తే లేదని, రాజీ పడటం తన రక్తంలో లేదని రేవంత్ రెడ్డి అన్నారు. భాగ్యలక్ష్మి అమ్మవారి ముందు నిల్చుని ఆత్మసాక్షిగా ప్రమాణం చేశానని, తాను నిఖార్సయిన హిందువునని, దేవుడు ఉన్నాడని బలంగా నమ్ముతానని, అందుకే ఈటల చేసిన ఆరోపణలను నిరూపించుకోవడానికి భాగ్యలక్ష్మి అమ్మవారి ఆలయానికి వచ్చానని చెప్పారు.

మునుగోడు ఉప ఎన్నికలో కాంగ్రెస్ అమ్ముడుపోయిందంటూ ఆరోపణలు చేసిన ఈటల ఇప్పుడు ఎందుకు ముఖం చాటేశారని నిలదీశారు. కేసీఆర్ నుంచి 25 కోట్లు రూపాయలను తీసుకున్నానంటూ ఆరోపణలు చేయడంలో అర్థం లేదని, తనపై అకారణంగా ఈటల, బీజేపీ నాయకులు నిందలు ఎందుకు వేస్తున్నారంటూ రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. సర్వం ధారపోసినా గానీ కేసీఆర్ తనను కొనలేడని, ఆయనను నిలదీసే గొంతుపై నిందలు వేస్తే కేసీఆర్కు మద్దతు ఇచ్చినట్లేంటూ ఎదురుదాడి చేశారు.
కేసీఆర్కు వ్యతిరేకంగా కొట్లాడటం అంటే ఇదేనా అంటూ ఈటల రాజేందర్ను ప్రశ్నించారు. కేసీఆర్, కేటీఆర్ సాగిస్తోన్న అవినీతి, కుటుంబ పాలనపై తాను నిరంతరాయంగా పోరాటం చేస్తోన్నానని, తప్పుడు ఆరోపణతో తన కళ్లలో నీళ్లు తెప్పించావంటూ రేవంత్ రెడ్డి చెప్పారు. ఎన్ని కేసులు పెట్టినా, చర్లపల్లి జైలుకు పంపించినా తాను భయపడేది లేదని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.












Click it and Unblock the Notifications