బతుకమ్మకు రండి: మహేష్తో కవిత, రామాయణ సర్క్యూట్ కోసం విజ్ఞప్తి
న్యూఢిల్లీ/సిద్దిపేట: దేశ రాజధాని న్యూఢిల్లీలో కేంద్రమంత్రి మహేష్ శర్మను తెలంగాణ రాష్ట్ర సమితి పార్లమెంటు సభ్యురాలు కల్వకుంట్ల కవిత మంగళవారం నాడు కలిశారు. రాష్ట్రంలో త్వరలో జరగనున్న బతుకమ్మ ఉత్సవాలకు ఆయనను ఆహ్వానించారు. రాష్ట్రంలో పర్యాటక రంగ అభివృద్ధికి సహాయం చేయాలని కోరారు.
కవిత విలేకరులతో మాట్లాడుతూ... బౌద్ధిజం, జైనిజం అభివృద్ధికి సహకరించాలని కేంద్రమంత్రిని కోరినట్లు తెలిపారు. తెలంగాణలో టూరిజం అవకాశాల పైన చర్చించామన్నారు. భద్రాచలంను రామాయణ సర్క్యూట్గా అభివృద్ధి చేయాలని కోరినట్లు చెప్పారు.
బతుకమ్మ పండుగకు అంతర్జాతీయ గుర్తింపును తీసుకు వస్తామని కవిత చెప్పారు. ఢిల్లీలోని అన్ని దేశాల రాయబారులను బతుకమ్మ పండుగకు ఆహ్వానించి, విశిష్టతను తెలియజేస్తామని చెప్పారు.
తెలంగాణను టూరిజం హబ్గా అభివృద్ధి చేస్తామని, సోమశిలను టూరిజం హబ్గా మార్చేందుకు రూ.100 కోట్లు కేటాయిస్తున్నట్లు మంత్రి మహేశ్ శర్మ వెల్లడించారు.
కాగా, టిఆర్ఎస్ ప్రభుత్వం తెలంగాణను టూరిజం హబ్గా మార్చే దిశలో ముందుకు సాగుతోంది. ఖమ్మం జిల్లాలోని భద్రాచలం, రేఖపల్లిలు, వరంగల్ జిల్లాలోని జీడికల్, పాలమూరు జిల్లాలోని జటప్రోలు, కరీంనగర్ జిల్లాలోని రామగిరి హిల్స్లను కలిపి రామాయణ సర్క్యూట్గా చేయాలని భావిస్తోంది.
శ్రీరాముడు మధ్యప్రదేశ్లోని చిత్రకూటలో పద్నాలుగేళ్లు వనవాసం చేశారు. ఆ తర్వాత గుహుడిని అదిలాబాద్ జిల్లాకు ఆరు వందల కిలోమీటర్ల దూరంలో కలిశారు. రామాయణంలో వెల్లడించిన వాటి ప్రకారం శ్రీరాముడు వరంగల్, కరీంనగర్ జిల్లా అడవుల్లోను ఆయన కాలు మోపారు. ముఖ్యంగా పర్ణశాల, జటప్రోలులను రామాయణంలో ప్రస్తావించారు. సీతాదేవిని రావణాసురుడు ఖమ్మంలోని పర్ణశాల నుంచి ఎత్తుకెళ్లాడు.