పట్టుబడ్డ రూ.20.23 కోట్లు : పారామిలిటరీ బలగాలతో తెలంగాణలో భద్రత
హైదరాబాద్ : తొలివిడత సార్వత్రిక సమరానికి ప్రచారం ముగియడంతో మైకులు మూగబోయాయి. ఇక ప్రలోభాల పర్వానికి తెరలేచింది. ఎల్లుండి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ సహా 22 రాష్ట్రాల్లో ఫస్ట్ ఫేజ్ ఎన్నికలు జరగనున్నాయి. ఇందుకోసం ఇప్పటికే ఈసీ ఏర్పాట్లు చేసింది. సమస్యాత్మక ప్రాంతాలను గుర్తించి, పటిష్ట బందోబస్త్ ఏర్పాటుచేసింది.
7 గంటల నుంచి ఓటింగ్
ఈ నెల 11న పోలింగ్ జరుగనుంది. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ జరుగుతోంది. ప్రత్యేక కారణలతో నిజామాబాద్లో మాత్రం సాయంత్రం 6 గంటల వరకు ఓటేసేందుకు అవకాశం ఇస్తారు. దేశవ్యాప్తంగా మరో 6 విడతల్లో పోలింగ్ ముగిసాక .. మే 23న ఫలితాలను ప్రకటిస్తామని ఎన్నికల సంఘం ఇప్పటికే తెలిపింది.
విధుల్లో 16 వేల మంది పోలీసులు
తెలంగాణలోని 17 లోక్సభ నియోజకవర్గాల కోసం భారీ భద్రత ఏర్పాటుచేసింది ఈసీ. పోలింగ్ ఏర్పాట్ల కోసం 16 వేల మంది పోలీసులతో బందోబస్త్ ఏర్పాటుచేశారు. వీరితోపాటు 12 పారామిలిటరీ బృందాలు ఆయా పోలింగ్ కేంద్రాలు చేరుకొన్నాయి. రాష్ట్రంలో 475 సమస్మాత్మక పోలింగ్ కేంద్రాలను గుర్తించినట్టు ఎన్నికల సంఘం పేర్కొంది.
రూ.20.23 కోట్లు స్వాధీనం
ఇప్పటివరకు 20.23 కోట్ల నగదును స్వాధీనం చేసుకున్నట్టు హైదరాబాద్ పోలీసు కమిషనర్ అంజనీకుమార్ పేర్కొన్నారు. 1734 లీటర్ల మద్యం పట్టుకున్నామని పేర్కొన్నారు. 40 కేజీల గంజాయి, లక్షా 60 వేల గుట్కా ప్యాకెట్లను స్వాధీనం చేసుకున్నట్టు తెలిపారు. అలాగే శాంతిభద్రతల దృష్ట్యా 1800 మంది పైచిలుకు మందిని బైండోవర్ చేసినట్టు వెల్లడించారు.
ఇందూరులో గంట ఆలస్యం
నిజామాబాద్ లోక్సభ బరిలో 185 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. దీంతో ఆ స్థానంలో పోలింగ్ గంట ఆలస్యంగా ప్రారంభమవుతోంది. ఎల్లుండి 8 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ జరుగుతోంది. క్యూలైన్లో ఉన్నవారికి ఓటేసే అవకాశం కల్పిస్తారు. అలాగే మిగతాచోట్ల మంగళవారం సాయంత్రం 5 గంటల వరకే ప్రచారానికి సమయం కేటాయించగా .. నిజామాబాద్లో మాత్రం 6 గంటల వరకు అవకాశం కల్పించారు.