ఖాకీ కరుణ హృదయం: తల్లి పరీక్ష రాస్తుంటే బిడ్డ ఆలనాపాలనా చూసిన కానిస్టేబుల్
ఆదివారం తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా పోలీస్ కానిస్టేబుల్ పరీక్ష జరిగిన విషయం తెలిసిందే. అయితే మహబూబ్నగర్లో ఓ అరుదైన దృశ్యం అందరినీ కట్టిపడేసింది. ఓ చంటి పిల్లాడిని పరీక్షా కేంద్రం బయట ఓ కానిస్టేబుల్ ఆడిస్తున్న దృశ్యం చాలామంది హృదయాలను తాకింది. చంటిపిల్లాడు తల్లికోసం ఏడుస్తుంటే... కానిస్టేబుల్ బాబును లాలించిన దృశ్యం ప్రతిఒక్కరి మనస్సును హత్తుకుంది.
ఇక అసలు విషయానికొస్తే... తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా జరిగిన పోలీస్ కానిస్టేబుల్ పరీక్ష రాసేందుకు మహబూబ్ నగర్లోని బాయ్స్ జూనియర్ కాలేజీకి హాజరైంది ఓ తల్లి. తల్లి నాలుగు నెలల చంటిపిల్లాడితో సహా సెంటర్కు పరీక్ష రాసేందుకు చేరుకుంది. అయితే పరీక్ష హాలులోకి ఇతరులు ప్రవేశం లేదన్న నిబంధన ఉండటంతో చంటిపిల్లాడి పరిస్థితి ప్రశ్నార్థకంగా మారింది. ఓ వైపు జీవితం నిలబెట్టే పరీక్ష మరోవైపు పాలకోసం చూసే చిన్నారి. రెండిటి మధ్య తల్లి సతమతమవుతున్న నేపథ్యంలో ఆ భగవంతుడే ఈ కానిస్టేబుల్ రూపంలో వచ్చినట్లయ్యింది. చంటిపిల్లాడి ఆలనా పాలనా తను చూసుకుంటానని చెబుతూ తల్లికి పరీక్ష రాయమని భరోసా ఇచ్చాడు కానిస్టేబుల్ ముజిబుర్ రెహ్మాన్. తల్లి ఆలస్యం చేయకుండా వెంటనే బాబును ముజిబుర్ రెహ్మాన్ చేతిలో పెట్టి పరీక్ష రాసేందుకు హాలులోకి వెళ్లింది.
ఇక చెట్టుకింద బాబును చేతిలో పెట్టుకుని బాగా ఆడించాడు ముజిబుర్ రెహ్మాన్. పరీక్ష అయ్యే వరకు చిన్నారి కంట నీరు రాకుండా... తల్లి స్థానంలో ఉండి అన్నీ చూసుకున్నాడు. ముజిబుర్ రెహ్మాన్ బాబును ఆడిస్తున్న ఫోటోను మహబూబ్ నగర్ ఎస్పీ రమా రాజేశ్వరి సోషల్ మీడియాలో పోస్టు చేశారు. దీంతో ఫోటో వైరల్ అయ్యింది. హెడ్ కానిస్టేబుల్ రెహ్మాన్ నెటిజెన్ల మనసును గెలుచుకున్నాడు. రెహ్మాన్పై ప్రశంసల వర్షం కురింపించారు నెటిజన్లు. ఖాకీల కఠినంగానే కాదు వారి వెనక కరుణ హృదయం కూడా దాగి ఉందనేందుకు ముజిబుర్ రెహ్మానే నిదర్శనం అంటూ నెటిజెన్లు ప్రశంసించారు.
Head Constable Officer Mujeeb-ur-Rehman (of Moosapet PS) who was on duty for conducting SCTPC exam in Boys Junior College, Mahbubnagar
— Rema Rajeshwari IPS (@rama_rajeswari) September 30, 2018
trying to console a crying baby, whose mother was writing exam inside the hall. #HumanFaceOfCops#Empathy pic.twitter.com/QudRZbAADu
బుడ్డోడి తల్లి వెనకబడిన వర్గానికి చెందిన మహిళని తనకు ఈ ఉద్యోగం ఎంతో అవసరం అని రెహ్మాన్ చెప్పారు. ఆ తల్లి బాగా చదువుకుందని కానీ ఉద్యోగం మాత్రం రాలేదని చెప్పారు. అందుకే చంటోడిని పరీక్ష అయిపోయే వరకు జాగ్రత్తగా ఆడించినట్లు పేర్కొన్నాడు. తనకు ఇద్దరు పిల్లలని కొడుకు చైనాలో మెడిసిన్ చదువుతుండగా... మరో అమ్మాయి 10వ తరగతి చదువుతోందన్నాడు. అంతేకాదు మూసాపేటలో హెడ్ కానిస్టేబుల్గా పనిచేస్తున్న ముజిబుర్ రెహ్మాన్.. తాను ప్రజలకు సేవచేసేందుకే ఉన్నట్లు తెలిపాడు. ప్రజలకు సేవ చేయడంకంటే ఏదీ ముఖ్యం కాదని చెప్పి అందరికీ ఆదర్శంగా నిలిచాడు.