1నుంచి9 విద్యార్థులు పై తరగతులకు ప్రమోట్ -ఉత్తర్వులు జారీ -సెలవుల్లో క్లాసులు పెడితే కఠిన చర్యలు
తెలంగాణలో కరోనా మహమ్మారి రెండో దశ వ్యాప్తి ప్రమాదకరంగా మారిన నేపథ్యంలో ఇప్పటికే స్కూళ్లు, జూనియర్ కాలేజీలకు సెలవులు ప్రకటించిన ప్రభుత్వం తాజాగా విద్యార్థుల ప్రమోషన్లకు సంబంధించిన ఉత్తర్వులనూ సోమవారం జారీ చేసింది. అదే సమయంలో ఇంటర్ బోర్డు సైతం కాలేజీలకు హెచ్చరికలు చేసింది. వివరాలివి..
Recommended Video
రాష్ట్రంలో ఒకటో తరగతి నుంచి తొమ్మిదో తరగతి వరకు విద్యార్థులను పై తరగతులకు ప్రమోట్ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు వెలువరించింది. కొవిడ్ దృష్ట్యా పరీక్షలు లేకుండానే ప్రభుత్వం విద్యార్థులను ప్రమోట్ చేసింది. అన్ని ప్రభుత్వ, ఎయిడెడ్, ప్రైవేటు అన్ఎయిడెడ్ స్కూళ్లకు ఈ నిబంధనలు వర్తిస్తాయని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
కొవిడ్ అనిశ్చితి కారణంగా ఏప్రిల్ 27 నుండి మే 31వ తేదీ వరకు అన్ని స్కూళ్లు, కాలేజీలకు ప్రభుత్వం వేసవి సెలవులు ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే, ఇప్పుడు తొమ్మిది నుంచి ప్రమోట్ అయి పదవ తరగతిలోకి ప్రవేశించిన విద్యార్థులకు ఆన్ లైన్ ద్వారానైనా బోధన ప్రారంభించే అవకాశాలను పరిశీలిస్తామని, సెలవుల్లో మాత్రం క్లాసులు కూడదని, దీనిపై త్వరలోనే తదుపరి క్లారిటీ ఇస్తామని విద్యాశాఖ పేర్కొంది. ఇదిలా ఉంటే,
జగన్.. ఒళ్లు జాగ్రత్త, జస్టిస్ రమణ వచ్చారు -బెయిల్ రద్దు భయంతో రాయబారాలు ఎంపీ రఘురామ తాజా బాంబు
వేసవి సెలవుల్లో కాలేజీలు పరీక్షలు, క్లాసులు నిర్వహిస్తే కఠిన చర్యలు తప్పవని ఇంటర్ బోర్డు హెచ్చరించింది. వేసవి సెలవుల్లో ఆన్లైన్, ఆఫ్లైన్ క్లాసులు తీసుకోవద్దని, సెలవులు కేవలం విద్యార్థుల మానసిక ఉల్లాసం కోసమేనని బోర్డు గుర్తుచేసింది. ఎథిక్స్, హ్యుమన్ వ్యాల్యూస్, ఎన్విరాన్మెంట్ ఎడ్యూకేషన్ అసైన్మెంట్స్ మార్కులను ఫీజులతో ముడి పెట్టవద్దని, విద్యార్థులు ఆన్లైన్లోనూ అసైన్మెంట్ సమర్పించవచ్చని తెలిపింది. మే 6 లోపు కాలేజీలు విద్యార్థుల మార్కులు పంపకుంటే చర్యలు తీసుకుంటామంది. ప్రాక్టికల్స్ సాధ్యం కాకుంటే రికార్డ్ ఆధారంగానే మార్కులు అని ఇంటర్ బోర్డు పేర్కొంది.