తెలంగాణాకు వర్ష హెచ్చరిక.. ఈ జిల్లాలలో అతి భారీ, భారీ వర్షాలు!
తెలంగాణ ప్రజలకు భారత వాతావరణ శాఖ ఐఎండీ ముఖ్యమైన హెచ్చరిక జారీ చేసింది. ఎల్ నినో ప్రభావంతో తెలంగాణా రాష్ట్రంలో వర్షాలు ముఖం చాటేశాయని భావిస్తున్న తరుణంలో ఈరోజు నుంచి మరో రెండు రోజుల పాటు రాష్ట్రంలో వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ తెలిపింది.
ఈ జిల్లాలలో అతి భారీ వర్షాలు
ముఖ్యంగా ఆగస్టు 23న కొన్ని జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశంతో ఆరెంజ్, ఎల్లో అలర్ట్లు విడుదల చేసింది.అతి భారీ వర్షాల అవకాశం ఉన్న కారణంగా కొమరం భీమ్ ఆసిఫాబాద్, మంచిర్యాల, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి జిల్లాలకు ఆరెంజ్ హెచ్చరిక జారీ చేసింది ఐఎండీ.

ఈ జిల్లాలలో భారీ వర్షాలు.. ఎల్లో అలెర్ట్
ఆదిలాబాద్, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, ములుగు, మెదక్, కామారెడ్డి జిల్లాలకు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండటంతో ఎల్లో అలర్ట్ వచ్చింది.
హైదరాబాద్ నగరంలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ అధికారులు తెలిపారు. మిగిలిన జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉంది.
రేపు ఉత్తర తెలంగాణాలో అక్కడక్కడ భారీ వర్షాలు
ఆగస్టు 24న కూడా ఉత్తర తెలంగాణ జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. లోతట్టు ప్రాంతాల్లో నివసించే ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. వరదలు, జలాంతర్గత ప్రవాహాలు, రోడ్లు మునిగిపోవడం వంటి పరిస్థితులు ఏర్పడే అవకాశం ఉండటంతో అవసరమైన జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు.
వర్షాలతో హెచ్చరిక
వ్యవసాయదారులు, పశువుల పెంపకందారులు కూడా తగిన జాగ్రత్తలు పాటించాలని ఐఎండీ హెచ్చరించింది. వర్షాలు కురుస్తున్న సమయంలో అనవసర ప్రయాణాలు నివారించడం మంచిదని సూచించింది. ఐఎండీ తాజా అంచనాలను అనుసరించి ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు. ముఖ్యంగా వర్ష సూచనలు ఉన్న జిల్లాల వారు జాగ్రత్తగా ఉండాలని సూచిస్తుంది.













Click it and Unblock the Notifications