హైదరాబాద్ సిగలో మరో మణిహారం
ప్రపంచవ్యాప్తంగా ఉన్న నగరాలతో పోటీపడుతూ అభివృద్ధిలో దూసుకువెళుతున్న భాగ్యనగరం సిగలో త్వరలో మరో మణిహారం చేరబోతోంది. ప్రజారవాణా వ్యవస్థలో భాగంగా డబుల్ డెక్కర్ బస్సులను పునఃప్రవేశపెట్టాలని తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ఎండీ సజ్జనార్ నిర్ణయించారు. త్వరలోనే 1016 డబుల్ డెక్కర్ బస్సులు హైదరాబాద్ నగర రోడ్లపై పరుగులు తీయనున్నాయి. వీటిల్లో ఎక్కువగా విద్యుత్తు బస్సులు ఉండేలా చూస్తున్నారు. ఈ బస్సులకు వెహికల్ ట్రాకింగ్ సిస్టమ్ కూడా ఏర్పాటు చేయబోతున్నారు. ఒక్కో డబుల్ డెక్కర్ బస్సు రూ.80 లక్షల నుంచి కోటిరూపాయల వరకు ఉంటుందని అంచనా వేస్తున్నారు.
భారీగా నష్టాల పాలైన ఆర్టీసీని తిరిగి పట్టాలెక్కించడానికి సంస్థ ఎండీ వీసీ సజ్జనార్ పలు ఆదాయ మార్గాలను అన్వేషిస్తున్నారు. కొవిడ్ ఆర్టీసీ కష్టాలను మరింతగా పెంచిందని, ఈ సంక్షోభాన్ని అధిగమించడానికి రూ.2వేల కోట్ల రూపాయలు కేటాయించాలని ప్రభుత్వాన్ని కోరామని, తాము అడిగినంత మేర ప్రభుత్వం ఇవ్వగలిగితే సాధ్యమైనంతవరకు ఆర్టీసీ కష్టాల నుంచి బయటపడినట్లేనని సజ్జనార్ తెలిపారు.
ఆర్టీసీకున్న ఆర్థిక సంక్షోభాన్ని అధిగమించడానికి రోజువారీ డీజిల్ వినియోగాన్ని తగ్గించగలిగామని సజ్జనార్ చెప్పారు. ప్రతిరోజు 6 లక్షల లీటర్ల డీజిల్ అవసరమవుతోందని, దీన్ని నియంత్రించడానికి ఇతర సేవలను తీసుకురాగలిగామన్నారు. అలాగే ఫ్రీక్వెన్సీ ద్వారా ఆదాయాన్ని పెంపొందిస్తున్నామన్నారు. అనుకున్న సమయానికి ప్రణాళిక అమలు చేయగలిగితే అతి త్వరలోనే డబుల్ డెక్కర్ బస్సులు రోడ్లపైకి రానున్నాయని వెల్లడించారు. రద్దీ సమయాల్లో ఫుట్బోర్డులపై వేలాడుతూ ప్రయాణం చేయడం ప్రమాదమని, దీనిపై ప్రయాణికులను హెచ్చరిస్తూ స్పెషల్ డ్రైవ్లు చేశామని, డబుల్ డెక్కర్ బస్సులు రావడంవల్ల ఇకనుంచి ఫుట్బోర్డుపై ప్రమాదకర ప్రయాణాలుండవన్నారు. బస్సుల నిర్మాణ సంస్థలతో చర్చలు జరుపుతున్నామని, సాధ్యమైనంత తక్కువ ధరకే బస్సులు కొనుగోలు చేయడానికి ప్రయత్నిస్తున్నామన్నారు.