ఆ పోలీసుకు శౌర్యచక్ర: కత్తిపోట్లతో రక్తమోడుతున్నా ఉగ్రవాదిని వదల్లేదు
హైదరాబాద్: అత్యున్నత జాతీయ పురస్కారమైన శౌర్య చక్రను తెలంగాణ రాష్ట్ర కౌంటర్ ఇంటెలీజెన్స్ విభాగం పోలీసు కుక్కడపు శ్రీనివాసులు దక్కించుకున్నారు. కత్తిపోట్లకు గురై రక్తం కారుతున్నప్పటికీ రెండు గంటలపాటు పోరాడి పేరుమోసిన ఉగ్రవాదిని పట్టుకున్నారు శ్రీనివాసులు.
ఈ యేడాది జనవరి 23న బెంగళూరులో శ్రీనివాసులు ఉగ్రవాదిని పట్టుకున్నారు. ఆయన ధైర్య సాహసాలను గుర్తించిన కేంద్రప్రభుత్వం శౌర్య చక్రతో సత్కరించింది. ఈ అవార్డు అందుకున్న 12 మందిలో ఎక్కువమంది సైనికులే ఉండగా, ఇద్దరు మాత్రమే పోలీసులు ఉన్నారు. వారిలో ఒకరు శ్రీనివాసులు. మరొకరు నాగాలాండ్కు చెందిన పోలీసు అధికారి.
సోమవారం 70వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల సందర్భంగా వీరు ఈ పతకాలతో సత్కరించబడ్డారు. తెలంగాణ కౌంటర్ ఇంటెలీజెన్స్ విభాగంలో పని చేస్తున్న పోలీస్ కానిస్టేబుల్ కె శ్రీనివాసులు.. గుజరాత్కు చెందిన ఉగ్రవాది అలెం జేబ్ అఫ్రీదిని పట్టుకున్న బృందంలో కీలకంగా వ్యవహరించారు.
ఉగ్రవాదిని ఇలా పట్టుకున్నారు
అలెం జేబ్ అఫ్రీది.. జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్ఐఏ), కొన్ని రాష్ట్రాల సిబిఐ మోస్ట్ వాంటెడ్ జాబితాల్లో ఉన్న ఉగ్రవాది. తెలంగాణ ఇంటెలీజెన్స్ విభాగం ఆధ్వర్యంలో బెంగళూరులో దాడి చేసి శ్రీనివాసులు ఈ ఉగ్రవాదిని పట్టుకున్నారు. బెంగళూరు చర్చ్ పేలుళ్లు కేసుతోపాటు పలు పేలుళ్ల కేసుల్లో నిందితుడిగా ఉన్న అఫ్రిదీ అలియాస్ మొహ్మద్ రఫీక్ అలియాస్ జావీద్.. మస్కర్ అహ్మద్ కొడుకు.
పోలీసు కేసు ప్రకారం.. డిసెంబర్ 28, 2014 రాత్రి 8.30గంటల ప్రాంతంలో అఫ్రీది, తన సహాయకులతో బెంగళూరులోని చర్చ్ స్ట్రీట్లోని ది కోకనట్ గ్రోవ్ బార్ అండ్ రెస్టారెంట్ ముందు పేలుళ్లకు పాల్పడి ఒకరి ప్రాణాలు తీశారు. ఈ ఘటనలో మరో ముగ్గురు తీవ్ర గాయాలపాలయ్యారు. ఆ తర్వాత నుంచి అఫ్రిదీ తప్పించుకు తిరుగుతున్నాడు.
'తెలంగాణ కౌంటర్ ఇంటెలీజెన్స్ విభాగం అందించిన సమాచారం మేరకు కానిస్టేబుల్ శ్రీనివాసులు తోపాటు మరో ముగ్గురు పోలీసులు అఫ్రిదీ జాడ తెలుసుకున్నారు. అతన్ని పట్టుకునేందుకు ప్రయత్నించగా.. కత్తితో దాడి చేశాడు. కత్తి పోట్లకు గురైనప్పటికీ శ్రీనివాసులు ఉగ్రవాది అఫ్రీదిని పట్టుకునేందుకు ప్రయత్నించాడు' అని తెలంగాణ ఇంటెలీజెన్స్ అధికారి ఒకరు తెలిపారు.
నల్గొండకు చెందిన శ్రీనివాసులు ఆ ఘటనకు సంబంధించిన వివరాలను వివరించారిలా.. 'ఉగ్రవాది అఫ్రీది కత్తితో పొడిస్తే నా కడుపులోని ప్రేగులు బయటికొచ్చాయి. వెంటనే ఓ గుడ్డ తీసుకుని నా పొత్తికడుపును కట్టేసుకున్నా. అయినా ఒంటి చేత్తో అతడ్ని పట్టుకున్నా. అదనపు బలగాలు వచ్చేంత వరకు అతడ్ని వదిల్లేదు. అతడికి సంకెళ్లు పడ్డాకే.. నేను ఆస్పత్రిలో చేరా' అని శ్రీనివాసులు తెలిపారు.
కాగా, చికిత్స నిమిత్తం 20రోజులపాటు బెంగళూరులోనే ఉన్నారు శ్రీనివాసులు. ఆ తర్వాత మరికొన్ని రోజులపాటు తన ఇంట్లోనే విశ్రాంతి తీసుకున్నారు. తాను చిన్నతనం నుంచి పోలీసు కావాలనే కోరికతో పెరిగానని చెప్పారు.
'శౌర్య చక్ర రావడం పట్ల నేను ఎంతో గర్వపడుతున్నా. తెలంగాణ ప్రభుత్వం దేశ సేవ చేసేందుకు అవకాశం ఇచ్చింది. నేను మరింత అంకిత భావంతో పని చేసుకుంటూ ముందుకెళ్తా' అని శ్రీనివాసులు తెలిపారు. కాగా, ఉగ్రవాదిని పట్టుకున్న బృందంలో ఉన్న ముగ్గురు పోలీసులకు గ్యాలంట్రీ మెడల్స్ లభించాయి.