'తెలంగాణ మహిళా మేలుకో'.. మహిళా సాధికారత దిశగా.. సంచలన నిర్ణయం..
తెలంగాణలో మహిళాభివృద్ధే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం పలు సంచలన నిర్ణయాలు తీసుకుంటోంది. ఆరు గ్యారంటీల్లో భాగంగా తెలంగాణలోని మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం కల్పించారు. అలాగే పేదింటి మహిళలకు రూ. 500 లకే గ్యాస్ సిలిండర్ అందిస్తున్నారు. తెలంగాణలో కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయడమే లక్ష్యంగా పలు కీలక నిర్ణయాలు తీసుకుంది కాంగ్రెస్ ప్రభుత్వం. ఈ మేరకు మహిళలతో ఫుడ్ స్టాల్స్ ఓపెన్ చేయించడం.. మహిళా పెట్రోల్ బంకులను ఏర్పాటు చేయడం.. తదితర కార్యక్రమాలతో రేవంత్ సర్కార్ దూసుకెళ్తోంది. అలాగే కొద్దిసేపటి క్రితమే సీఎం రేవంత్ రెడ్డి.. ఇవాళ మాజీ ప్రధాని ఇందిరా గాంధీ జయంతి సందర్భంగా ఇందిరమ్మ చీరల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించారు. రాష్ట్రంలోని కోటి మంది మహిళలకు చీరలు పంపిణీ చేయనున్నారు. డిసెంబర్ 9 వరకూ అందరికీ చేరేలా అధికారులకు దిశానిర్దేశం చేశారు సీఎం రేవంత్ రెడ్డి.
మరోవైపు ఇవాళ ప్రజాభవన్ లో తెలంగాణ మహిళా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఉమెన్ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పంచాయతీ రాజ్, గ్రామీణ అభివృద్ధి, మహిళ శిశు సంక్షేమ శాఖ మంత్రి డా. దానసరి అనసూయ సీతక్క విచ్చేశారు. ఈ కాన్ఫరెన్స్ లో మహిళలకు ఉపాధి అవకాశాలు, వివక్ష నిర్మూలన, లింగ సమానత్వం, మహిళల భద్రత, ఆరోగ్యం, పోషకాహారం వంటి కీలక అంశాలపై విస్తృతంగా చర్చ జరిగింది. నిపుణుల అభిప్రాయాలు, సూచనలు, అనుభవాలను ప్రభుత్వం తెలుసుకుని భవిష్యత్ విధానాల్లో ప్రతిబింబింపజేయాలనే ఉద్దేశంతో రౌండ్ టేబుల్ నిర్వహించారు.
ఈ సందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ.. మహిళల అభివృద్ధి, ఆత్మవిశ్వాసం, హక్కుల బలోపేతం కోసం ఈ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ను ఏర్పాటు చేశామని తెలిపారు. మహిళలు ఎదుర్కొంటున్న వివక్షను పూర్తిగా తొలగించేందుకు నిపుణులు, మేధావులు, అధికారులు ఇచ్చే సూచనలు అత్యంత ఉపయోగకరమవుతాయని పేర్కొన్నారు. మహిళా సంక్షేమం, భద్రత కోసం చట్టాలు ఉన్నప్పటికీ, సమాజపు పోకడల కారణంగా అవి ప్రాక్టికల్ గా అమలు కావడంలో సమస్యలు వస్తున్నాయనీ, పని ప్రాంతాల్లో మహిళలు ఎదుర్కొనే సమస్యలను చెప్పుకునే అవకాశాలు కోల్పోతున్నారని వివరించారు. ఈ చర్చ రాజకీయ కార్యక్రమం కాదని, మహిళల భవిష్యత్తును నిర్ణయించే చారిత్రక ఘట్టం అని మంత్రి స్పష్టం చేశారు.
విద్య, ఉపాధి, ఉద్యోగాలు, భద్రత వంటి రంగాల్లో మహిళలకు ఏలాంటి సౌకర్యాలు అవసరమో తెలుసుకుని, సమగ్ర నివేదిక రూపొందించాల్సిన అవసరం ఉందన్నారు. రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్లో వచ్చిన సూచనలు, సలహాలు ఆధారంగా త్వరలో విస్తృత స్థాయి సదస్సును ఏర్పాటు చేసి, అంతర్జాతీయ మహిళా దినోత్సవం మార్చి 8 నాటికి ఒక కొత్త మహిళా విధానాన్ని రూపకల్పన చేస్తామని వెల్లడించారు.
ఆడపిల్లల ఆరోగ్యం, వంద శాతం విద్య సాధన, మహిళల ఆర్థిక స్వావలంబన, మాతృత్వ సెలవులు ప్రైవేట్ రంగంలో అమలయ్యేలా చూడటం, తండ్రులూ పిల్లల పెంపకంలో భాగస్వామ్యం కావడం వంటి అంశాలపై కూడా సమావేశంలో చర్చ జరిగింది. పాఠశాలల్లో అమ్మాయిలను గౌరవించే సంస్కారాన్ని పెంపొందించేందుకు అవగాహన కార్యక్రమాలు చేపట్టాల్సిన అవసరాన్ని మంత్రి వివరించారు. మహిళలు 'నా ఆరోగ్యం - నా బాధ్యత' అనే భావనతో ముందుకు రావాలని, వారికి తగిన ఆరోగ్య అవగాహన కల్పించే దిశలో చర్యలు తీసుకుంటామని అన్నారు.
నిపుణులతో సబ్ గ్రూప్ లు ఏర్పాటు చేసి, ప్రత్యేక సమస్యలు ఉన్న ప్రాంతాల్లో ప్రత్యేక సమావేశాలు నిర్వహించి, వాటి పరిష్కార మార్గాలను గుర్తించే ప్రయత్నం చేస్తామని తెలిపారు. ఈ రోజు జరిగిన సమావేశం తెలంగాణలో మహిళా సాధికారతకు పునాది వేసే తొలి మెట్టుగా నిలిచిపోతుందని మంత్రి సీతక్క విశ్వాసం వ్యక్తం చేశారు.

రేపటి తరం కోసం నేటి మేధోమదనం ఎంతో అవసరమని పేర్కొంటూ, తెలంగాణను మహిళా సాధికారతలో ఆదర్శ రాష్ట్రంగా తీర్చిదిద్దే దిశగా ఈ సమావేశం కీలక పాత్ర పోషిస్తుందని మంత్రి సీతక్క పేర్కొన్నారు.
-
తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు బంపరాఫర్.. భారీ డిస్కౌంట్ -
రేవంత్ రెడ్డిని ముఖ్యమంత్రిని చేసింది నేనే: మాజీ మంత్రి మల్లారెడ్డి -
రిటైర్ అయ్యాక ఏవీ రంగనాథ్ పొలిటికల్ ఎంట్రీ..క్లారిటీ ఇచ్చిన హైడ్రా కమీషనర్! -
హైదరాబాద్ మెట్రో విస్తరణపై సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రకటన! -
క్యూర్, ప్యూర్, రేర్ అనే అనే మూడు ప్రాంతాలుగా తెలంగాణ: మూసీపై రేవంత్ కీలక ప్రకటన -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు












Click it and Unblock the Notifications