చత్తీస్గఢ్-తెలంగాణ ఒప్పందం: మరో వెయ్యి అడిగిన కెసిఆర్, రమణ్ ఓకే
హైదరాబాద్: ఛత్తీస్గఢ్ రాష్ట్రం నుంచి 1,000 మెగావాట్ల విద్యుత్ కొనుగోలుకు తెలంగాణ ప్రభుత్వం మంగళవారం నాడు ఒప్పందం కుదుర్చుకుంది. తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు సమక్షంలో ఇరు రాష్ట్రాల అధికారులు పరస్పరం ఒప్పంద పత్రాలు మార్పిడి చేసుకున్నారు.
ఈ ఒప్పందం పన్నెండేళ్ల పాటు అమల్లో ఉంటుంది. దీంతో పాటు మరో 1,000 మెగావాట్ల విద్యుత్ కూడా ఇవ్వాలని ముఖ్యమంత్రి కెసిఆర్ విజ్ఞప్తి చేశారు. దీనికి కూడా ఛత్తీస్గఢ్ ప్రభుత్వం, ముఖ్యమంత్రి రమణ్ సింగ్ సానుకూలంగా స్పందించారు.
చత్తీస్గఢ్ నుంచి విద్యుత్ సరఫరాకు వార్దా నుంచి డిచ్పల్లి వరకు లైన్ వేయనున్నారు. సీఎం కెసిఆర్ క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి కేసీఆర్ సమక్షంలో పీపీఏ పత్రాలను ఛత్తీస్గఢ్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ ఎండీ అంకిత్ ఆనంద్, టీఎస్ సెంట్రల్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ సీఎండీ రఘుమా రెడ్డి మార్చుకున్నారు.
విద్యుత్ కొనుగోలు ఒప్పందానికి గతేడాది నవంబర్ 3న ఇరు రాష్ర్టాల మధ్య ఒప్పందం జరిగిన విషయం తెలిసిందే. ఆ సమయంలో ఇద్దరు సీఎంలు కేసీఆర్, రమణ్ సింగ్ సమక్షంలో ఎంవోయూపై ఇరు రాష్ర్టాల విద్యుత్ శాఖ కార్యదర్శులు సంతకాలు చేశారు.
జైలుకైనా వెళ్తా: షబ్బీర్ అలీ
టీఆర్ఎస్ ప్రభుత్వంపై కాంగ్రెస్ సీనియర్ నేత, ఎమ్మెల్సీ షబ్బీర్ అలీ మంగళవారం మండిపడ్డారు. రాష్ట్రంలో నెలకొన్న రైతు సమస్యలను పరిష్కరించడంలో ప్రభుత్వం విఫలమయిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. రైతుల ఆత్మహత్యలు, వ్యవసాయరంగ సమస్యలపై శాసనమండలిలో ప్రభుత్వాన్ని నిలదీస్తామన్నారు.
ఆత్మహత్యలకు పాల్పడిన రైతులందరికీ పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. రైతుల పక్షాన పోరాడతామని, వారి కోసం జైలుకు వెళ్లేందుకు కూడా సిద్ధమన్నారు. రాష్ట్రంలో 1500 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారన్నారు. అయినా ప్రభుత్వం మొద్దునిద్ర వీడడం లేదన్నారు.