ఎల్ఐసీతో తెలంగాణ ఒప్పందం: గొప్పపనంటూ కేసీఆర్, ‘కౌలు రైతులకు పెట్టుబడి కుదరదు’
హైదరాబాద్: రైతుకు జీవిత బీమా కోసం ఎల్ఐసీతో ఒప్పందం చేసుకోవడం తన జీవితంలో చేసిన గొప్ప పని అని తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు అన్నారు. రైతుబీమా పథకానికి ఎల్ఐసీతో ఒప్పందం కుదుర్చుకున్న అనంతరం ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రసంగించారు.
రైతుబంధు, రైతుబీమా పథకాల అమలుపై సర్వత్రా సంతోషం వ్యక్తం అవుతుందని సీఎం చెప్పారు. రైతుబీమా పథకానికి ఎంత డబ్బు అవసరమైనా ప్రభుత్వం చెల్లిస్తుందని సీఎం స్పష్టం చేశారు. ఆగస్టు 15 నుంచి ఈ పథకం అమలవుతుందని కేసీఆర్ చెప్పారు.
18 నుంచి 60 ఏళ్ల వయసున్న రైతులందరికీ రైతుబీమా వర్తిస్తుందన్నారు. రైతు మరణించిన పది రోజుల్లోనే బాధిత కుటుంబానికి బీమా సాయం అందేలా చూస్తామన్నారు. ఇప్పటికే రైతుబంధు పథకం ద్వారా రూ. 5 వేల కోట్లు రైతులకు అందాయని సీఎం కేసీఆర్ తెలిపారు.
రైతుబంధు పథకంలో అధిక ఆదాయం ఉన్నవాళ్లను డబ్బులు తీసుకోవద్దని కోరాను అని సీఎం తెలిపారు. రైతుబంధు పథకంలో నాతో పాటు చాలా మంది డబ్బులు తీసుకోలేదు. కానీ రైతుబీమా నేను తీసుకుంటా.. కచ్చితంగా అందరూ తీసుకోవాలని సీఎం సూచించారు. రైతుల కోసం బడ్జెట్లో పెట్టిన నిధులు రైతులకే ఖర్చు చేస్తామన్నారు సీఎం.
కౌలు రైతులకు పెట్టుబడి సాయం ఇవ్వడం కుదరదు
రైతుబంధు పథకం కింద కౌలు రైతులకు పెట్టుబడి సాయం అందిచడం కుదరదని కేసీఆర్ స్పష్టం చేశారు. కౌలు రైతులకు పెట్టుబడి సాయం అమల్లో కొన్ని సమస్యలున్నాయని.. అందువల్లే భూమి యజమానికి మాత్రమే పెట్టుబడి సాయం అందిస్తున్నట్లు వెల్లడించారు.
రైతుబంధు పథకంతో 89శాతం మంది రైతులు సంతోషంగా ఉన్నట్లు జాతీయ పత్రిక ప్రచురించిన విషయాన్ని కేసీఆర్ ఈ సందర్భంగా ప్రస్తావించారు. తెలంగాణలో రైతుల అభివృద్ధికి ఎన్నో కార్యక్రమాలు చేపడుతున్నామని.. నేను తెలంగాణ రైతుని అని సగర్వంగా చెప్పుకునే స్థితికి అన్నదాతలు చేరాలని కేసీఆర్ ఆకాంక్షించారు.
ఎల్ఐసీ ఛైర్మన్ ప్రశంసలు
ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్రావు నిజమైన రైతుబంధు అని ఎల్ఐసీ చైర్మన్ వీకే శర్మ ప్రశంసించారు. ఇవాళ ఎల్ఐసీకి చాలా మంచి రోజు, రైతుల కోసం ఒప్పందం కుదుర్చుకోవడం గర్వకారణంగా ఉందన్నారు. రైతుకు జీవిత బీమా చాలా గొప్ప కార్యక్రమం అని ప్రశంసించారు. రైతుల కోసం సీఎం కేసీఆర్ ఎంతో కష్టపడుతున్నారు. తాను కూడా రైతు కుటుంబం నుంచే వచ్చాను, దేశంలోని వివిధ ప్రాంతాల్లో పని చేశానని.. ఎక్కడా రైతు జీబిత బీమా లాంటి పథకాలను చూడలేదన్నారు. రాష్ట్రంలో అభివృద్ధి కార్యక్రమాల కోసం ఎల్ఐసీ రూ. 40 వేల కోట్లు పెట్టుబడులు పెట్టిందన్నారు. రైతు జీవిత బీమా పరిహారం ఇచ్చేందుకు పది రోజులకు మించి సమయం తీసుకోబోమని హామీ ఇస్తున్నామని వీకే శర్మ స్పష్టం చేశారు.