కరోనా సెకండ్ వేవ్ నుంచి తెలంగాణ బయటపడింది, కానీ అప్రమత్తంగానే: డీహెచ్ శ్రీనివాసరావు
హైదరాబాద్: కరోనావైరస్ రెండో దశ వ్యాప్తి నుంచి రాష్ట్రం బయటపడిందని తెలంగాణ వైద్యారోగ్యశాఖ సంచాలకులు(డీహెచ్) శ్రీనివాసరావు అన్నారు. కరీంనగర్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో వైద్య సౌకర్యాల కొరత లేదని తెలిపారు. ఆక్సిజన్ పడకల కొరత లేకుండా చర్యలు తీసుకుంటున్నామన్నారు.
రాష్ట్రంలో వేగంగా వ్యాక్సినేషన్ జరుగుతోందని, ఇప్పటి వరకు 1.25 కోట్ల డోసులు పంపిణీ చేశామని శ్రీనివాసరావు తెలిపారు. కరోనా తగ్గుముఖం పట్టినప్పటికీ ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని, కరోనా నిబంధనలను ఖచ్చితంగా పాటించాలని కోరారు. మాస్కులను తప్పనిసరిగా ధరించాలని, భౌతిక దూరం పాటించాలన్నారు.
వీలైనంత వరకు జనసమూహాలతో కూడిన కార్యక్రమాలకు దూరంగా ఉండాలని డీహెచ్ సూచించారు. మూడో దశ ముప్పు పొంచివుందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్న నేపథ్యంలో అన్ని రకాలుగా సిద్ధంగా ఉన్నట్లు ఆయన తెలిపారు. హైదరాబాద్ తోపాటు ఇతర జిల్లాల్లు ఉన్న ఆస్పత్రుల్లో పిల్లల ఐసీయూ ఏర్పాట్లు చేస్తున్నట్లు చెప్పారు.
ప్రభుత్వం ఎన్ని చర్యలు తీసుకున్నా.. ప్రజల సహకారం లేనిదే మహమ్మారి కట్టడి చేయడం సాధ్యం కాదని డీహెచ్ శ్రీనివాసరావు వ్యాఖ్యానించారు. వైరస్ వ్యాప్తి ప్రజల ప్రవర్తనపై ఆధారపడి ఉంటుందన్నారు. రాష్ట్రంలో ఇప్పటి వరకు 1.25 కోట్ల డోసులు పంపిణీ చేసినట్లు ఆయన తెలిపారు.
Recommended Video
రాష్ట్రంలో ఫీవర్ సర్వే కొనసాగుతోందని, దీని ద్వారా పాజిటివిటీ రేటు తగ్గించుకోవచ్చని శ్రీనివాసరావు తెలిపారు. వర్షాకాలంలో సీజనల్ వ్యాధులు ప్రబలకుండా చర్యలు చేపడుతున్నామని, అన్ని జిల్లాల్లోనూ కొత్తగా మలేరియా కేసులు నమోదు కాలేదని డీహెచ్ వెల్లడించారు. సీఎం కేసీఆర్ నేతృత్వంలో ప్రభుత్వం కరోనా మహమ్మారి కట్టడికి అన్ని చర్యలు తీసుకుంటోందని, ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అన్నారు. కాగా, గత కొన్ని వారాలుగా తెలంగాణలో కరోనా కేసులు తక్కువగా నమోదవుతున్న విషయం తెలిసిందే.