'అలా చేసే సింగరేణిలో గట్టెక్కాడు.. కేసీఆర్ను బతుకమ్మ చీరలతో ఉరితీయాలి'
బతుకమ్మ చీరల కమీషన్ డబ్బులతో ప్రలోభాలకు దిగినందుకు.. అవే చీరలతో కేసీఆర్కు ఉరేయాలని సంచలన వ్యాఖ్యలు చేశారు.
జనగాం: సింగరేణి ఎన్నికల్లో టీబీజీకేఎస్(తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం) విజయం అధికార పార్టీకి కొత్త ఊపిరులూదిందనే చెప్పాలి. ఎన్నికలకు ముందు వరకు ఆ పార్టీకి ఓటమి భయం పట్టుకున్న మాట కొట్టిపారేయలేనిది.
అందుకే ఆగమేఘాల మీద ఎన్నికలకు మరో మూడు రోజుల గడవుందనగా.. సీఎం కేసీఆర్ ప్రెస్ మీట్ పెట్టారు. ఆ ప్రెస్ మీట్ లో కేసీఆర్ ఇచ్చిన వరాల వల్లే కార్మికులు మళ్లీ టీబీజీకేఎస్ వైపు నిలబడ్డారన్న వాదనలు వినిపిస్తున్నాయి.
టీఆర్ఎస్ పరువు గంగ పాలు: బతుకమ్మ చీరలకు నిప్పు..
సరే ఈ సంగతెలా ఉన్నా.. ప్రతిపక్షాలు మాత్రం అధికార పార్టీని చీల్చి చెండాడుతున్నాయి. ప్రలోభాలతోనే కార్మిక సంఘం ఎన్నికల్లో నెగ్గారని కాంగ్రెస్, టీడీపీ ఆరోపిస్తున్నాయి. తాజాగా టీడీపీ అధ్యక్షుడు ఎల్.రమణ టీఆర్ఎస్ పై తీవ్ర స్థాయిలో ఫైర్ అయ్యారు.
బతుకమ్మ చీరలపై వచ్చిన కమీషన్ డబ్బులతో టీఆర్ఎస్ సింగరేణి ఎన్నికల్లో విజయం సాధించిందని ఆయన విమర్శించారు. బతుకమ్మ చీరల కమీషన్ డబ్బులను సింగరేణిలో ఇష్టారీతిన వెదజల్లారని, అందువల్లే కేసీఆర్ ఎన్నికల్లో గట్టెక్కారని ఆరోపించారు. బతుకమ్మ చీరల కమీషన్ డబ్బులతో ప్రలోభాలకు దిగినందుకు.. అవే చీరలతో కేసీఆర్కు ఉరేయాలని సంచలన వ్యాఖ్యలు చేశారు.
శుక్రవారం జనగామలోని టీడీపీ పార్టీ కార్యాయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో రమణ ఈ వ్యాఖ్యలు చేశారు. జనగామ ఎమ్మెల్యే ప్రభుత్వ కుంటను ఆక్రమించారని స్వయంగా కలెక్టర్ చెబుతున్నా.. ప్రభుత్వానికి పట్టడం లేదన్నారు. సీఎం వెంటనే దీనిపై స్పందించి తగిన చర్యలు తీసుకోవాలన్నారు.