కేసీఆర్పై గవర్నర్కు ఫిర్యాదు, మండిపడ్డ ఎర్రబెల్లి
హైదరాబాద్: తెలంగాణ తెలుగుదేశం పార్టీ నేతలు ఎర్రబెల్లి దయాకర రావు, మోత్కుపల్లి నర్సింహులు తదితరులు శుక్రవారం తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు పైన తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. తెలంగాణ టీడీపీ నేతలు ఉదయం గవర్నర్ నరసింహన్ను కలిశారు. నల్గొండలో టీడీపీ కార్యాలయం పైన దాడి, రైతుల ఆత్మహత్యల పైన ఫిర్యాదు చేశారు. అనంతరం విలేకరులతో మాట్లాడారు.
మోత్కుపల్లి నర్సింహులు మాట్లాడుతూ.. ఏదో విధంగా చంద్రబాబును ఇబ్బంది పెట్టాలన్నదే కేసీఆర్ వ్యూహంగా కనిపిస్తోందన్నారు. ముఖ్యమంత్రిగా ఉండే అర్హత కేసీఆర్కు లేదన్నారు. విద్యుత్ సమస్యలను పరిష్కరించలేక, టీడీపీపై దుమ్మెత్తిపోయడం కేసీఆర్కే చెల్లిందన్నారు.
250 మంది రైతులు ఆత్మహత్య చేసుకుంటే, వారి కుటుంబాలను పరామర్శించేందుకు ముఖ్యమంత్రి సహా ఏ ఒక్క టీఆర్ఎస్ నేత కూడా వెళ్ళలేదన్నారు. రైతులను ఓదార్చేందుకు తమపై మాత్రం దాడులు చేస్తారన్నారు.

ఎల్ రమణ మాట్లాడుతూ.. దళారీల దోపిడీని సర్కారు అడ్డుకోవడం లేదని, సీసీఐని, మార్క్ ఫెడ్ వంటి సంస్థలను రంగంలోకి దింపి వరి, మొక్కజొన్న, పత్తి పంటలకు మద్దతు ధర ఇప్పించాలని డిమాండ్ చేశారు. రెండుమూడు గంటలే విద్యుత్ సరఫరా చేస్తున్నారని మండిపడ్డారు.
రైతుల ఆత్మహత్యలకు ప్రభుత్వమే కారణమని ఎర్రబెల్లి దయాకర రావు ఆరోపించారు. బలవన్మరణానికి పాల్పడ్డ రైతుల కుటుంబాలకు రూ.10 లక్షల చొప్పున నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. చంద్రబాబుపైనా, తెలుగుదేశం పార్టీపైనా కేసీఆర్ తప్పుడు ఆరోపణలు చేస్తున్నారన్నారు.
కేసీఆర్ను కూర్చోబెట్టి వాస్తవాలు వివరించాలని తాము గవర్నర్ను కోరామన్నరు. మెసేజ్లు పంపించిన జూపల్లి కృష్ణా రావును వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు.
ప్రభుత్వ అసమర్థత వల్ల గిట్టుబాటు ధర రావడం లేదన్నారు. నల్గొండ జిల్లాలో టీడీపీ కార్యాలయం పైన దాడికి ప్రభుత్వ పెద్దలే కారణమన్నారు. తమకు సెక్యూరిటీ తగ్గింపు పైన కూడా గవర్నర్కు ఫిర్యాదు చేశామన్నారు. కేసీఆర్ తన అసమర్థ పాలనను కప్పి పుచ్చుకునేందుకు చంద్రబాబు, నరేంద్ర మోడీలను విమర్శిస్తున్నారని ఎద్దేవా చేశారు.












Click it and Unblock the Notifications