తెలంగాణలో టీడీపీ సీనియర్ నేత మృతి.. చంద్రబాబు ఎమోషనల్ పోస్ట్
తెలంగాణకు చెందిన తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత, సికింద్రాబాద్ పార్లమెంట్ మాజీ అధ్యక్షులు పిన్నమనేని సాయిబాబా కన్నుమూశారు. ఆయన మరణ వార్త పార్టీ వర్గాలతో పాటు రాజకీయ వర్గాల్లో తీవ్ర దిగ్భ్రాంతిని కలిగించింది. దశాబ్దాల పాటు పార్టీ కోసం అంకితభావంతో పనిచేసిన నాయకుడిని కోల్పోవడం తీరని లోటుగా టీడీపీ నేతలు భావిస్తున్నారు.
సీఎం చంద్రబాబు సంతాపం..
కాగా పిన్నమనేని సాయిబాబా మృతి పట్ల ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ఈ మేరకు తన అధికారిక ఎక్స్ (Twitter) ఖాతా ద్వారా స్పందించిన ఆయన, సాయిబాబా కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.

పార్టీకి, వ్యక్తిగతంగా తీరని లోటు..
ఈ మేరకు సీఎం చంద్రబాబు నాయుడు తన సందేశంలో.. తెలుగుదేశం పార్టీ సీనియర్ నేతగా, సికింద్రాబాద్ పార్లమెంట్ మాజీ అధ్యక్షుడిగా, దివ్యాంగుల సంస్థ మాజీ చైర్మన్గా, ఎన్టీఆర్ అభిమాన సంఘం అధ్యక్షుడిగా సాయిబాబా చేసిన సేవలు చిరస్మరణీయమని పేర్కొన్నారు. దశాబ్దాల తరబడి పార్టీకి అంకితభావంతో చేసిన సేవలు మరిచిపోలేనివి. ఆయన మృతి పార్టీకి మాత్రమే కాకుండా వ్యక్తిగతంగా నాకు కూడా తీరని లోటు అని పేర్కొన్నారు.
అలానే ప్రతి సారి పార్టీ కార్యాలయానికి వెళ్లినప్పుడు ముందుగా ఎదురొచ్చి ఆప్యాయంగా స్వాగతం పలికే సాయిబాబా ఇక లేరనే విషయం ఎంతో బాధ కలిగిస్తోందని సీఎం చంద్రబాబు భావోద్వేగంగా పేర్కొన్నారు. పార్టీ పట్ల ఆయన చూపిన నిబద్ధత, నాయకులతో కలుపుకుపోయే తత్వం ఎప్పటికీ గుర్తుండిపోతాయని తెలిపారు. సాయిబాబా ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తూ, ఆయన కుటుంబ సభ్యులకు ఈ కఠిన సమయంలో దేవుడు ధైర్యాన్ని ఇవ్వాలని సీఎం చంద్రబాబు నాయుడు ఆకాంక్షించారు. పార్టీ తరఫున పూర్తి సహాయ సహకారాలు అందిస్తామని కూడా తెలిపారు.
మరోవైపు పిన్నమనేని సాయిబాబా మృతితో తెలంగాణ టీడీపీ శ్రేణుల్లో తీవ్ర విషాదం నెలకొంది. పలువురు పార్టీ నాయకులు, కార్యకర్తలు ఆయన సేవలను గుర్తు చేసుకుంటూ నివాళులు అర్పిస్తున్నారు. సికింద్రాబాద్ పార్లమెంట్ పరిధిలో పార్టీ బలోపేతానికి ఆయన చేసిన కృషిని నేతలు ప్రశంసిస్తున్నారు.
తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత, సికింద్రాబాద్ పార్లమెంట్ మాజీ అధ్యక్షులు, దివ్యాంగుల సంస్థ మాజీ చైర్మన్, ఎన్టీఆర్ అభిమాన సంఘం అధ్యక్షుడు పిన్నమనేని సాయిబాబా మరణం విచారకరం. దశాబ్దాల తరబడి సాయిబాబా పార్టీకి అంకితభావంతో చేసిన సేవలు చిరస్మరణీయం. ఆయన మృతి పార్టీకి, వ్యక్తిగతంగా నాకు… pic.twitter.com/6m5zZheJFL
— N Chandrababu Naidu (@ncbn) December 28, 2025












Click it and Unblock the Notifications