coronavirus: వైరస్ కట్టడిలో దేశానికే ఆదర్శం తెలంగాణ: మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు
కరోనా వైరస్ కట్టడిలో దేశానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆదర్శంగా నిలిచిందని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు పేర్కొన్నారు. వైరస్ వ్యాపిస్తోండటంతో తొలుత లాక్ డౌన్ విధించిన విషయాన్ని గుర్తుచేశారు. తర్వాత పొరుగు రాష్ట్రాలు, కేంద్ర ప్రభుత్వం లాక్ డౌన్ విధించిందని చెప్పారు. ఆయన శనివారం జనగామ కలెక్టరేట్లో ఎమ్మెల్యేలు, అధికారులతో సమీక్ష నిర్వహించారు. కరోనా వైరస్ వ్యాపించకుండా తీసుకుంటున్న జాగ్రత్తతలు, పంట కొనుగోలు, బియ్యం పంపిణీ, వలస కూలీలకు చేయూత వంటి అంశాలపై అధికారులను అడిగి వివరాలు తెలుసుకున్నారు.
వైరస్ వ్యాపిస్తోన్న సమయంలో కేసీఆర్ ముందుచూపుతో నిర్ణయం తీసుకున్నారని మంత్రి ఎర్రబెల్లి తెలిపారు. కేసీఆర్ ముందుచూపుతో వైరస్ ప్రభావం అంతగా లేదన్నారు. ఢిల్లీ నుంచి వచ్చినవారితోనే పాజిటివ్ కేసులు పెరిగాయని.. అంతకుముందులా పరిస్థితి ఉంటే తగ్గేదని పేర్కొన్నారు. కరోనా వైరస్ నివారణకు లాక్ డౌన్ తప్ప మరోమార్గం లేదన్నారు.
ఉమ్మడి వరంగల్ జిల్లాలో 29 పాజిటివ్ కేసులు నమోదయ్యాయని ఎర్రబెల్లి పేర్కొన్నారు. వీరంతా ఢిల్లీ వెళ్లొచ్చిన వారేనని చెప్పారు. మర్కజ్ వెళ్లొచ్చిన వారిని గుర్తించి క్వారంటైన్లో పెట్టామని పేర్కొన్నారు. జనగామ జిల్లాలో ఢిల్లీ వెళ్లొచ్చిన ఏడుగురిలో ఇద్దరికీ పాజిటివ్ వచ్చిందని తెలిపారు. వీరు కలిసిన 116 మందికి నెగిటివ్ వచ్చిందన్నారు. కరోనా నివారించేందుకు ప్రతీ ఒక్కర్ మాస్క్ ధరించాలని, లేదంటే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు.
Recommended Video
రైతుల పంట కోసం వరంగల్ జిల్లావ్యాప్తంగా 835 ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేశామని మంత్రి వివరించారు. 265 మక్కల కొనుగోలు కేంద్రాలు కూడా ఉన్నాయని చెప్పారు. దేవాదుల, కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంతో సాగు పెరిగిందని.. దీంతో దిగుబడి కూడా అధికంగా వచ్చిందని తెలిపారు. రైతు పండించిన ప్రతి గింజను కొనుగోలు చేస్తామని ఎర్రబెల్లి తెలిపారు.