కేసీఆర్ సర్కార్ను ఆకాశానికెత్తేసిన బాలకృష్ణ: చరిత్రలో చిరస్థాయిగా: అందుకే సుభిక్షంగా
యాదాద్రి భువనగిరి: నటసింహం నందమూరి బాలకృష్ణ తన తాజా చిత్రం అఖండ సూపర్ హిట్ను ఎంజాయ్ చేస్తోన్నారు. పేరుకు తగ్గట్టే.. కలెక్షన్లను రికార్డులను బద్దలు కొడుతోంది. అఖండ విజయాన్ని సొంతం చేసుకుంది. ఈ సంవత్సరాంతానికి ఓ బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్గా నిలించిందీ మూవీ. ఓవర్సీస్లో తిరుగులేదనిపించుకుంది. తాను నటించిన సినిమా హిట్ టాక్ తెచ్చుకున్న ప్రతీసారీ.. ఆలయాలను సందర్శించడాన్ని ఆనవాయితీగా పెట్టుకున్నారు. దాన్ని కొనసాగిస్తోన్నారు.
తెలంగాణ ఆలయాల్లో..
బాలకృష్ణ-బోయపాటి శ్రీను కాంబినేషన్లో హైఓల్టేజీ యాక్షన్ ప్యాక్డ్ మూవీ ఇది. బాక్సాఫీస్ను షేక్ చేసింది. విడుదలైన వారం రోజుల్లోపే 100 కోట్ల రూపాయల క్లబ్లో చేరింది. సినిమా గ్రాండ్ సక్సెస్ కావడంతో బాలకృష్ణ, బోయపాటి తెలంగాణ ఆలయాలను సందర్శిస్తోన్నారు. ఇదివరకు ఏపీలోని ఆలయాలను సందర్శించారు. విజయవాడ కనకదుర్గమ్మ సహా పలు ఆలయాలను దర్శించుకున్నారు. మొక్కులు చెల్లించుకున్నారు. ప్రత్యేక పూజలు నిర్వహించారు.
యాదాద్రి ఆలయంలో..
ఈ ఉదయం బాలకృష్ణ-బోయపాటి శ్రీను యాదాద్రి లక్ష్మీనరసింహ స్వామివారిని దర్శించారు. ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ తెల్లవారు జామున ఆలయానికి వచ్చిన వారిని అర్చకులు, అధికారులు సంప్రదాయబద్ధంగా స్వాగతం పలికారు. ప్రత్యేక పూజలను నిర్వహించారు. అనంతరం స్వామివారి తీర్థ, ప్రసాదాలను అందజేశారు. ఏపీలో దాదాపు అన్ని ప్రముఖ ఆలయాలను సందర్శించానని బాలకృష్ణ చెప్పారు. యాదాద్రి ఆలయ దర్శనంతో తెలంగాణలో అన్ని ప్రధాన దేవస్థానాలకు వెళ్తానని అన్నారు.
స్వామివారి అనుగ్రహం ఉందంటూ..
అఖండ సినిమా సక్సెస్లో భాగంగా తెలుగు రాష్ట్రాల్లో ప్రముఖ పుణ్యక్షేత్రాలను దర్శించుకుంటున్నామని బాలకృష్ణ అన్నారు. అందులో భాగంగానే యాదాద్రి లక్ష్మీ నరసింహ స్వామి దర్శనానికి వచ్చామని చెప్పారు. తన ఇష్ట దైవం లక్ష్మీనరసింహస్వామి అని పేర్కొన్నారు. తన చిన్నప్పటి నుంచీ యాదగిరి లక్ష్మీనరసింహస్వామిని దర్శిస్తున్నానని, స్వామివారి అనుగ్రహం తనపై ఉందని చెప్పారు. స్వామివారి పేరు మీద తీసిన సినిమాలన్నీ హిట్ అయ్యాయని గుర్తు చేశారు.
ఆలయ పునర్నిర్మాణం అద్భుతం..
ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రత్యేక చొరవతో యాదాద్రి ఆలయ పునర్నిర్మాణం అద్భుతంగా సాగుతోందని చెప్పారు. యాదాద్రి ఆలయ నిర్మాణం చరిత్రలో నిలిచిపోతుందని, కేసీఆర్ చొరవ తీసుకుని, కోట్ల రూపాయలతో పునర్నిర్మిస్తున్నారని వ్యాఖ్యానించారు. ఈ దఫా తాను మళ్లీ వచ్చినప్పుడు కొత్త ఆలయాన్ని చూస్తాననిపిస్తోందని బాలకృష్ణ అన్నారు. ధర్మం విలసిల్లినప్పుడే ఏ రాష్ట్రమైనా సుభిక్షంగా ఉంటుందని బాలకృష్ణ వ్యాఖ్యానించారు.
ఆన్లైన్ టికెట్లపై..
టికెట్ల ధరల విషయంపై మాట్లాడటానికి బాలకృష్ణ ఆసక్తి చూపలేదు. ఒకట్రెండు సార్లు విలేకరులు ప్రశ్నించినప్పటికీ.. సమాధానం ఇవ్వకుండా దాటవేశారు. తెలంగాణలో టికెట్ల రేట్లను పెంచుకోవడానికి కేసీఆర్ సర్కార్ అనుమతి ఇచ్చిన విషయం తెలిసిందే. దీనికి సంబంధించిన జీవోను ప్రభుత్వం విడుదల చేసింది కూడా. ఏపీలో దీనికి భిన్నమైన పరిస్థితులు ఉన్నాయి. ఏపీ హైకోర్టు ఆదేశాలకు అనుగుణంగా జిల్లా జాయింట్ కలెక్టర్ అనుమతిని తీసుకుని టికెట్ల రేట్లను పెంచుకోవాల్సి ఉంది.
వరుస సెలవులతో..
కాగా.. వరుసగా సెలవులు రావడంతో యాదాద్రి లక్ష్మీనరసింహస్వామిని దర్శించుకునే భక్తుల సంఖ్య భారీగా పెరిగింది. శని, ఆదివారాల్లో ఆలయం కిటకిటలాడింది. భక్తులు పెద్దసంఖ్యలో తరలివచ్చారు. సర్వ దర్శనానికి రెండు గంటలకు పైగా సమయం పట్టింది. భక్తుల రద్దీ తీవ్రం కావడం వల్ల కోవిడ్ ప్రొటోకాల్స్ పాటించడం కష్టతరమైంది. వచ్చీ పోయే వాహనాలు, భక్తులతో యాదాద్రి సందడిగా మారింది. స్వామివారికి తలనీలాలను సమర్పించడానికి భక్తులు పోటెత్తారు.