Weather: హైదరాబాద్తోపాటు పలు జిల్లాల్లో భారీ వర్షాలు, కుప్పకూలిన రూ. 45 లక్షల హోర్డింగ్
హైదరాబాద్: తెలంగాణలోని పలు జిల్లాల్లో మంగళవారం భారీ వర్షం కురిసింది. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని పలు ప్రాంతాల్లో కుండపోత వర్షం పడింది. కరీంనగర్ పట్టణంలోని గీతాభవన్ చౌరస్తాలో ఉన్న ఓ పెద్ద హోర్డింగ్ .. జోరు గాలివానకు కుప్పకూలిపోయింది. రాముడి పట్టాభిషేకం ఆవిష్కరించేలా ఏర్పాటు చేసిన 70 అడుగుల ఎత్తైన భారీ కటౌట్ గాలివానకు పడిపోయింది.
ఈదురుగాలుతో కుప్పకూలిన భారీ కటౌట్
ఈదురు గాలుల ధాటికి విద్యుత్ దీపాల అలంకరణ లుమినార్ కూలిపోయింది. సమీపంలో ఎవరూ లేకపోవడంతో ప్రమాదం తప్పింది. ఫిబ్రవరిలో జరగబోయే బ్రహ్మోత్సవాల్లో రాముడి పట్టాభిషేకాన్ని ఆవిష్కరించేలా సుమారు రూ. 45 లక్షలు వెచ్చించి ఈ భారీ హోర్డింగ్ ఏర్పాటు చేశారు. ఇక కుండపోత వర్షంతో కరీంనగర్ పట్టణంలోని పలు ప్రాంతాలు నీటమునిగాయి. రహదారులపై వరదనీరు వచ్చి చేరడంతో వాహనదారులు ఇబ్బందులు పడ్డారు.
భారీ వర్షాలతో పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిపివేత
లోతట్టు ప్రాంతాల్లోని నివాసాల్లోకి వరద నీరు చేరడంతో ప్రజలకు ఇబ్బందులు తప్పలేదు. ఇక ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని చొప్పదండి, రామడుగు, మానకొండూరు, పెద్దపల్లి, శంకరపట్నం మండలాల్లోనూ భారీ వర్షం కురిసింది. రాజన్న సిరిసిల్ల జిల్లాలోనూ ఈదురుగాలులతో కూడిన జోరువాన కురిసింది. భారీ స్థాయిలో గాలులు వీయడంతో సిరిసిల్ల విద్యానగర్లో విద్యుత్ స్తంభాలు, చెట్లు విరిగిపోయాయి. భారీగా ఈదురుగాలులు వీయడంతో పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిపివేశారు.
ఉమ్మడి ఆదిలాబాద్, వరంగల్ జిల్లాల్లోనూ వర్షాలు
మరోవైపు, ఉమ్మడి ఆదిలాబాద్, వరంగల్ జిల్లాల వ్యాప్తంగా గత రెండురోజుల నుండి అకాల వర్షం కురుస్తోంది. మంగళవారం కూడా పలు ప్రాంతాల్లో కుండపోత వర్షం కురిసింది. బోథ్ నియోజకవర్గంలోని అన్ని మండలాల్లో ఉరుములు మెరువులతో కూడిన మోస్తరు నుంచి భారీ వర్షం కురిసింది. అకాల వర్షాలతో అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు. ఒక వైపు ఖరీఫ్ సీజన్లో పంట చేతికి వచ్చే సమయంలో అత్యధిక శాతం వర్షాలతో పంట దిగుబడి లేక నష్టపోయారు. కాగా, ఈ రబీ సీజన్లో సైతం ఈ అకాల వర్షాలు మొక్క జొన్న, వేరుశనగ పంటలు కోతకు, పూతకు రావడంతో వర్షాలతో పూత రాలిపోయే ప్రమాదముందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కూరగాయలు, ఆకుకూరలకు ఈ అకాల వర్షాలతో తెగుళ్లు వచ్చి పాడయ్యే అవకాశముందని వాపోతున్నారు. సంక్రాంతి పండగ కోసం తమ సొంత ఊళ్లకు వెళుతున్న ప్రజలు కూడా ఈ అకాల వర్షాలతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
Recommended Video
హైదరాబాద్లోనూ జోరువాన
హైదరాబాద్లో మంగళవారం రాత్రి పలు చోట్ల వర్షం కురిసింది. కూకట్ పల్లి, హైదర్నగర్, అల్విన్ కాలనీ, మియాపూర్, చందానగర్, కుత్బుల్లాపూర్ , గాజుల రామారం, జీడిమెట్ల, షాపూర్నగర్, సూరారం, సికింద్రాబాద్, తిరుమలగిరి, బోయినపల్లి, అల్వాల్, మారేడుపల్లి, బేగంపేట, ప్యారడైజ్ తదితర ప్రాంతాల్లో వర్షం కురిసింది. వర్షం కారణంగా పలు చోట్ల విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. కాగా, రాగల మూడు రోజుల్లో రాష్ట్రంలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణశాఖ తెలిపింది.