మట్టిలో కలుపుతున్నారు: తెలంగాణ టిడిపి నేతలపై చంద్రబాబు ఆగ్రహం
హైదరాబాద్: విభేదాలతో వీధికెక్కిన తెలంగాణ తెలుగుదేశం పార్టీ నాయకులపై ఆ పార్టీ అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. పార్టీ పరువును తీస్తున్నారని ఆయన మండిపడినట్లు చెబుతున్నారు. వరంగల్ ఉప ఎన్నికల ఇటువంటి గొడవలేమిటని ఆయన ఆదివారంనాడు టిడిపి నేతలను నిలదీసినట్లు తెలుస్తోంది.
శనివారం నాటి సమావేశం పూర్వాపరాలపై చంద్రబాబు ఫోన్ చేసినప్పుడు తెలగాణ టిడిపి నేతలంతా ప్రత్యేకించి ఎర్రబెల్లి దయాకర్ రావు, రేవంత్ రెడ్డి పరస్పరం ఫిర్యాదు చేసుకున్నట్లు చెబుతున్నారు. సోమవారం నాడు విజయవాడ రావాల్సిందిగా ఆయన ఆదేశించినట్లు చెబుతున్నారు.
శనివారం నాటి ఘటనను మీడియా కొంత అతి చేసిందని కొందరు నేతలు చంద్రబాబుతో చెప్పారని అంటున్నారు. పార్టీ తెలంగాణశాఖ అధ్యక్షుడు ఎల్ రమణ, సీనియర్ నేత మోత్కుపల్లి నర్సింహులు మాత్రం ఎదురు సమాధానం చెప్పి తప్పించుకున్నట్లు వినికిడి. పార్టీని గాడిలో పెట్టేందుకు కాస్తా కఠినంగా వ్యవహరించాలని రమణకు చంద్రబాబు చెప్పారని అంటున్నారు.

గొడవ పడకుండా రేవంత్రెడ్డికి సహకరిస్తూ పార్టీ కార్యక్రమాలను కలిసికట్టుగా ముందుకు తీసుకెళ్లాలని ఆగ్రహంగా చెప్పారని సమాచారం. వరంగల్ లోక్సభ ఉప ఎన్నికలో బీజేపీకి అవకాశమిద్దామని ఎర్రబెల్లి అన్నారని వచ్చిన వార్తలపై చంద్రబాబు ఆయనకు ఫోన్చేసి క్లాస్ తీసుకున్నారని తెలిసింది. అయితే రేవంతే బీజేపీకి ఇస్తే బాగుంటుందనే అర్థం వచ్చేలా మాట్లాడారని ఎర్రబెల్లి బదులిచ్చారని పుకార్లు షికార్లు చేస్తున్నాయి.
అంతకుముందు తెలంగాణ టిడిపి నేతల తీరుపై అధినేత చంద్రబాబుకు టీటీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్రెడ్డి ఫిర్యాదు చేశారని సమాచారం. నాయకులంతా తనను అవమానిస్తున్నా, దూషిస్తున్నా పార్టీ అధ్యక్షుడు ఎల్ రమణ అడ్డు చెప్పలేదని ఆయన ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది. తనపట్ల అనుచితంగా ప్రవర్తించిన వారిపై చర్యలు తీసుకోవాలని ఆయన చంద్రబాబును కోరారని తెలుస్కోంగి.
వరంగల్ తన గుత్తసొత్తు అన్నట్లు ఎర్రబెల్లి మాట్లాడారని, ఒక వర్కింగ్ ప్రెసిడెంట్కు ఇచ్చే గౌరవం ఇవ్వకుండా ఇష్టం వచ్చినట్లు దూషించారని చంద్రబాబుకు ఫోన్ ద్వారా ఫిర్యాదు చేశారని అంటున్నారు.

వరంగల్ లోక్సభ ఉప ఎన్నికల బరిలో టీడీపీ ఉంటుందని, ఈమేరకు మిత్రపక్ష బీజేపీ నేతలతో పార్టీ చర్చిస్తుందని టీడీఎల్పీ నేత ఎర్రబెల్లి దయాకర్రావు అన్నారు. ఆదివారం టీడీఎల్పీలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. వరంగల్ జిల్లాలో టీడీపీకి కిందిస్థాయిలో బలమైన క్యాడర్ ఉందన్నారు. లోక్సభకు ఉప ఎన్నిక జరిగే ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలలో తాము బలంగా ఉన్నామని అన్నారు.
గెలిచే అవకాశాలున్న టీడీపీకి మిత్రపక్షమైన బీజేపీ మద్దతు తెలుపుతుందని, సహకరిస్తుందని ఆశిస్తున్నామని తెలిపారు. వరంగల్ లోక్సభ స్థానాన్ని బీజేపీకి వదిలివేస్తున్నట్లుగా శనివారం తాను పార్టీ సమావేశంలో అన్నట్లు వచ్చిన కథనాలను ఎర్రబెల్లి ఖండించారు. ఇపుడున్న వరంగల్ లోక్సభ స్థానం పరిధిలో గతంలో టీడీపీ అధిక మెజార్టీతో గెలిచిందని గుర్తు చేశారు.












Click it and Unblock the Notifications