ఈసీ నిబంధనలు ఉల్లంఘించిన తెలుగు న్యూస్ ఛానెల్
హైదరాబాద్ : ఎగ్జిట్ పోల్స్కు సంబంధించి ఓ తెలుగు ఛానెల్ అత్యుత్సాహం చూపింది. సాయంత్రం ఆరున్నర వరకు ఎగ్జిట్ పోల్స్ వెల్లడించవద్దని ఎన్నికల సంఘం స్పష్టమైన ఆదేశాలిచ్చినా వాటిని తుంగలో తొక్కింది. లగడపాటి ఆర్జీస్ ఫ్లాష్ న్యూస్ సర్వేకి సంబంధించిన వివరాలను బహిర్గతం చేసింది.
సాయంత్రం ఆరింటికే లైవ్ ప్రోగ్రాం నిర్వహించిన ఆ ఛానల్ ఆంధ్రప్రదేశ్కు సంబంధించి ఆంధ్రా ఆక్టోపస్ లగడపాటి చేసిన సర్వే రిపోర్టును బయటపెట్టింది. అసెంబ్లీ ఎన్నికలతో పాటు లోక్సభ ఎన్నికల్లో ఏయే పార్టీలు ఎన్ని సీట్లు గెలుస్తాయన్న వివరాలను ప్రకటించింది. సర్వే వివరాలు టీడీపీకి అనుకూలంగా ఉన్నాయన్న విషయాన్ని ప్రేక్షకులకు తెలియజేసింది. ఆంధ్రప్రదేశ్లో మరోసారి టీడీపీకే ప్రజలు పట్టం కడతారన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది. అయితే కాసేపటికే సర్వే వివరాల ప్రత్యక్షప్రసారాన్ని నిలిపేసిన సదరు ఛానెల్ ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పింది. ఆరున్నరకు మళ్లీ సర్వే వివరాలతో ముందుకొస్తామని చెప్పింది.