వేల కోట్లలో ఐఆర్ఎస్ స్కాం: తెలుగు వ్యాపారిని అరెస్ట్ చేసిన ఎఫ్బీఐ
హైదరాబాద్: అంతర్గత ఆదాయ సేవల్లో మోసానికి పాల్పడి బాధితుల నుంచి సేకరించిన డబ్బును అక్రమంగా భారతదేశానికి తరలించాడనే అభియోగాలపై వ్యాపారవేత్త నరసింహ బోగవల్లి(50)ని ఇర్వింగ్లో ఎఫ్బీఐ ప్రత్యేక ఏజెంట్లు బుధవారం అరెస్ట్ చేశారు. ఐఆర్ఎస్ ఏజెంట్ పేరుతో అమెరికా వ్యాప్తంగా నరసింహ బాధితుల నుంచి డబ్బులు సేకరించినట్లు సమాచారం.
అక్రమంగా డబ్బులు కూడబెట్టారంటూ పలువురిని బెదిరింపులకు గురిచేసి వారి వద్ద నుంచి భారీగా డబ్బులు రాబట్టారు. డబ్బులు చెల్లించకుంటే జైలు వెళ్లాల్సి వస్తుందని వారిని బెదిరింపులకు గురిచేసినట్లు తెలిసింది. బొగవల్లితోపాటు మరికొందరు ఈ కుంభకోణంలో పాల్పంచుకున్నట్లు సమాచారం.
నవంబర్ 5, 2014, ఫిబ్రవరి 2, 2015 మధ్య కాలంలో నగదు, మనీ ఆర్డర్ల ద్వారా మొత్తం 242 డిపాజిట్లను సేకరించారు. ఇది మొత్తం 1,666,247 డాలర్లుగా కాగా, ఇందులో బ్యాంక్ ఆఫ్ అమెరికా ఖాతాల్లో 2,250 సెపరేట్ మనీ ఆర్డర్స్ ద్వారా సేకరించిన సుమారు 1,493,848 డాలర్లు జమ చేయించుకోవడం జరిగింది.
జనవరి 16, 2015, జనవరి 30, 2015 మధ్య కాలం కేవలం రెండు వారాల్లోనే 60 మనీ ఆర్డర్స్ ద్వారా 37,957 డాలర్లు సేకరించడం జరిగింది. ఇవి కూడా బ్యాంక్ ఆఫ్ అమెరికాలో డిపాజిట్ చేశారు. నవంబర్ 4, 2014, ఫిబ్రవరి 5, 2015 మధ్య కాలంలో 128 మనీ ఆర్డర్ల ద్వారా 96,716 డాలర్లను డిపాజిట్లను సిటీబ్యాంకు ఖాతాల్లో జమ చేశారు.
ఈ అన్ని ఖాతాలు భోగవల్లి నియంత్రించేవారని ఎఫ్బీఐ అధికారులు తెలిపారు. ఈ మొత్తం డబ్బును భారత్, ఇతర దేశాలకు తరలించారని చెప్పారు. ఇలా 10వేల డాలర్లకు పైగా సొమ్మును తరలించేశారని తెలిపారు. ఈ నేరానికి శిక్షగా 10ఏళ్ల జైలు, 2,50,000 డాలర్ల జరిమానా విధించే అవకాశం ఉందని చెప్పారు.
కాగా, గురువారం భోగవల్లి నరసింహ.. యూఎస్ మేజిస్ట్రేట్ జడ్జి పాల్ డి స్టిక్నే ముందు హాజరయ్యారు. శుక్రవారం మధ్యాహ్నం మరోసారి నరసింహ కోర్టులో హాజరుకానున్నారు.