ఎలా జరిగింది?: అమెరికాలో ఇద్దరు తెలుగు యువకులు మృతి
హైదరాబాద్: అమెరికాలో జరిగిన వేర్వేరు ప్రమాదాల్లో ఇద్దరు తెలుగు యవకులు మృత్యువాతపడ్డారు. వీకెండ్ కావడంతో ఆదివారం స్నేహితులతో కలిసి విహారయాత్రలకు వెళ్లిన యువకులు దుర్మరణం పాలయ్యారు. వివరాల్లోకి వెళితే... నగరంలోని వనస్థలిపురం, కమలానగర్కు చెందిన నంబూరి శ్రీదత్త (25) నాలుగేళ్ల క్రితం ఉన్నత చదవుల నిమిత్తం అమెరికా వెళ్లాడు.
అనంతరం చదువు పూర్తయిన తర్వాత టెక్సాస్ రాష్ట్రం హోరిజాన్ సిటీలో ఉద్యోగంలో చేరాడు. అయితే ఆదివారం స్నేహితులతో కలసి ఓ జలపాతం వద్దకు వెళ్లిన శ్రీదత్త ప్రమాదవశాత్తు అందులో పడి మృతిచెందినట్టు సోమవారం ఉదయం కుటుంబసభ్యులకు అమెరికా అధికారులు సమాచారం అందించారు.
కాగా, శ్రీదత్త తండ్రి ఎన్వీఎమ్ స్వామి ప్రైవేటు ఉద్యోగి కాగా.. తల్లి అటవీశాఖలో పనిచేస్తున్నారు. వీరి ఇద్దరి కుమారుల్లో శ్రీదత్త పెద్దవాడు. వీరి స్వస్థలం అనంతపురం జిల్లా తాడిపత్రి. శ్రీదత్త మృతదేహం మూడు నాలుగు రోజుల్లో హైదరాబాదుకు చేరుకోనున్నట్లు కుటుంబసభ్యులు తెలిపారు.
కృష్ణా జిల్లాకు చెందిన నరేష్ అనే విద్యార్థి మృతి
మరోవైపు అమెరికాలో కృష్ణా జిల్లా జగ్గయ్యపేట పరిధిలోని బండిపాలెం గ్రామానికి చెందిన పుట్టా నరేశ్(24) రెండు రోజుల క్రితం విహారయాత్రకు వెళ్లి రిజర్వాయర్లో పడి ప్రాణాలు కోల్పోయాడు. వివరాల్లోకి వెళితే... నరేశ్ అమెరికాలోని కాలిఫోర్నియాలో ఎంఎస్ చదువుతున్నాడు.
ఆదివారం సమీపంలోని లివర్మోర్ నదిలో బోటు షికారుకు వెళ్లి గల్లంతయ్యాడు. స్థానిక అధికారులు గాలింపుచర్యలు చేపట్టారు. దీంతో సోమవారం రాత్రి నరేశ్ మృతదేహం లభ్యమైనట్లు మృతుడి బంధువులు తెలిపారు. ఉన్నత చదువుల కోసం అమెరికా వెళ్లిన తమ కుమారుడు మృత్యవాతపడటంతో కుటుంబసభ్యులు విషాదంలో మునిగిపోయారు.
మృతదేహాన్ని అమెరికా నుంచి తీసుకొచ్చేందుకు స్థానిక ఎమ్మెల్యే శ్రీరామ్ తాతయ్య, విజయవాడ ఎంపీ కేశినేని నాని అధికారులతో సంప్రదింపులు కొనసాగిస్తున్నారు. నరేశ్ మృతదేహం మూడు రోజుల్లో స్వదేశానికి చేరుకోవచ్చని కుటుంబ సభ్యులు తెలిపారు.