తెలంగాణలో మండిపోతున్న ఎండలు: ఈ జిల్లాల్లో 40 డిగ్రీలపైనే, ప్రజలకు అలర్ట్
హైదరాబాద్: తెలంగాణ జిల్లాల్లో ఎండలు మండిపోతున్నాయి. నిన్నమొన్నటి వరకు కురిసిన వర్షాలతో కొంత చల్లని వాతావరణం ఉండగా.. ఇప్పుడు వానలు లేకపోవడంతో ఉష్ణోగ్రతలు భారీగా పెరిగిపోయాయి. దీంతో ప్రజలు బయటికి రావాలంటేనే భయపడిపోతున్నారు. అయతే, రానున్న రోజుల్లో మరింత తీవ్రంగా ఎండలు ఉండనున్నాయని.. ప్రజలు బయటికి వెళ్లేటప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని వాతావరణ శాఖ అధికారులు సూచిస్తున్నారు.
రాష్ట్రంలోని 15 జిల్లాల్లో పగటిపూట ఉష్ణోగ్రతలు 41 డిగ్రీల సెల్సియస్గా ఉండటం గమనార్హం. గరిష్టంగా నిర్మల్ జిల్లా దస్తూరాబాద్లో 42.8 డిగ్రీలు నమోదైంది. నాగర్కర్నూల్ జిల్లా కొల్లాపూర్లో 42.7, ఖమ్మం జిల్లా నేలకొండపల్లిలో 42.5, సూర్యపేట జిల్లా హుజూర్నగర్, జోగులాంబ గద్వాల జిల్లా అలంపూర్లో 42.4, జగిత్యాల జిల్లా మల్లాపూర్, మహబూబ్ నగర్ జిల్లా చిన్నచింతకుంట, జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్లో 42.2, పెద్దపల్లి జిల్లా పాలకుర్తి మండలం తక్కళ్లపల్లతి, నిజామాబాద్ జిల్లా మక్లూర్ మండలం లక్మాపూర్, వనపర్తి జిల్లా పాన్గల్ మండలం కేతేపల్లిలో 42.1, రాజన్న సిరిసిల్ల జిల్లా కోనారావుపేట మండలం వెల్గటూరులో 41.9 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్(జీహెచ్ఎంసీ) పరిధిలో గరిష్టంగా సైదాబాద్ మండలం అస్లాంగఢ్లో 37.7 డిగ్రీల సెల్సియస్ నమోదైంది.

తెలంగాణలో పెరుగుతున్న ఉష్ణోగ్రతలపై ప్రభుత్వం ప్రజలను అప్రమత్తం చేసింది. ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం గురించి తెలియజేశారు. తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి, ప్రణాళిక సంస్థ అప్రమత్తత ప్రకటించింది. సోమవారం విడుదల చేసిన ఉష్ణోగ్రతల బులెటిన్లో ఆరెంజ్ అలర్ట్ను విడుదల చేసింది. మంగళ, బుధవారాల్లో సాధారణం కన్నా 2 నుంచి 4 డిగ్రీలు అధికంగా ఉష్ణోగ్రతలు నమోదవుతాయని వాతావరణ శాఖ పేర్కొంది.
ఎండ తీవ్రత నేపథ్యంలో ప్రజలు తీసుకోవాల్సిన జాగ్రత్తలు
ఎండలో ఎక్కువగా సంచరించవద్దు. వడదెబ్బ తగలకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. ఇందుకు నీరు, పళ్ల రసాలు, కొబ్బరినీళ్లు, మజ్జిగ లాంటి ద్రవ పదార్థాలు ఎక్కువగా తీసుకోవాలి. నలుపు, మందంగా ఉండే దుస్తులకు బదులు లేత రంగుల్లో లభించే తేలికైన కాటన్ దుస్తులు ధరించాలి.
రోజుకు కనీసం 15 గ్లాసుల నీళ్లు తాగాలి. ఆహారం తక్కువ మోతాదులో ఎక్కువసార్లు తీసుకోవాలి. అవసరమైతే తప్ప.. ఎండవేళ ఇంటిపట్టునే ఉండాలి. బయటికి వెళ్లాల్సివస్తే గొడుగు, టోపీ వంటివి తీసుకెళ్లడం మంచిది. ఇంట్లో కిటికీలు తెరిచి ఉండాలి.
వడదెబ్బ తగిలిన వ్యక్తిని త్వరగా నీడ ఉండే ప్రదేశానికి చేర్చాలి. చల్లటి నీటిలో ముంచిన తడిగుడ్డతో శరీరం అంతా తుడవాలి. శరీర ఉష్ణోగ్రత సాధారణ స్థాయికి వచ్చే వరకు ఇలాగే చేస్తుండాలి. ఫ్యాన్ గాలి లేదా చల్లని గాలి తగిలేలా చూడాలి.
ఉప్పు కలిపిన మజ్జిగ లేదా చిటికెడు ఉప్పు కలిగిన గ్లూకోజు ద్రావణం లేదా ఓరల్ రీ హైడ్రేషన్ ద్రావణం(ఓఆర్ఎస్) తాగించాలి.పిల్లలు, గర్భిణీలు, వృద్ధులు వేసవికాలంలో ఎక్కువ జాగ్రత్తలు తీసుకోవాలి.వడదెబ్బ తగిలి అపస్మారక పరిస్థితిలో ఉన్న రోగికి వెంటనే నీరు తాగించకూడదు. వీలయినంత త్వరగా దగ్గరలోని ఆస్పత్రికి తరలించాలి.












Click it and Unblock the Notifications