కర్మాన్ఘాట్ లో ఉద్రిక్తత; గోరక్షకులపై కత్తులతో దుండగుల దాడి; ఆందోళనకు దిగిన హిందూసంఘాల అరెస్ట్
హైదరాబాద్ లోని కర్మాన్ ఘాట్ పోలీస్ స్టేషన్ పరిధిలో బుధవారం తెల్లవారుజాము నుంచి ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. గోరక్షక్ సభ్యులపై దుండగులు కత్తులతో దాడి చేసిన ఘటన ఆందోళనలకు కారణంగా మారింది. హిందూ సంఘాలు, బీజేపీ నేతల ఆందోళనలతో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. ప్రస్తుతం కర్మాన్ ఘాట్ పోలీసుల నిఘా నీడన ఉంది.
కేసీఆర్ కు ఇంటిపోరు; ఆయన జాతీయ రాజకీయాల పాట వెనుక మతలబు చెప్పిన బండి సంజయ్
గోరక్షక్ సభ్యులపై కత్తులతో దాడులు చేసిన దుండగులు
అసలేం జరిగిందంటే కొందరు దుండగులు గోవులను అక్రమంగా బొలెరో వాహనంలో తరలించే ప్రయత్నం చేశారు. గోవులను అక్రమంగా తరలిస్తున్నారని తెలుసుకొని గో రక్షక్ సభ్యులు ఆ వాహనాన్ని కర్మాన్ ఘాట్ వద్ద అడ్డుకున్నారు. దీంతో ఆగ్రహించిన దుండగులు ఇన్నోవా వాహనాన్ని వెనుకనుండి ఢీకొట్టి, ఆపై వారిపై కత్తులతో దాడులకు దిగారు. దీంతో గోరక్షక్ సభ్యులు ప్రాణాలు కాపాడుకోవటానికి సమీపంలోని ఆంజనేయ స్వామి ఆలయంలోకి పరుగులు తీశారు. ఆలయంలోకి ప్రవేశించి మరీ కత్తులతో గోరక్షక్ సభ్యులపై దాడులు చేశారు దుండగులు. ఆపై అక్కడ నుండి దుండగులు పారిపోయారు. సమాచారం అందుకున్న గోరక్షక్ కార్యకర్తలు అక్కడికి చేరుకుని గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించి కర్మాన్ ఘాట్ పోలీస్ స్టేషన్ కు సమాచారం అందించారు.
దాడికి పాల్పడిన వారిని శిక్షించాలని హిందూసంఘాల ఆందోళన
ఈ ఘటనలో దాడి చేసిన దుండగులను అరెస్టు చేసి, శిక్షించాలని డిమాండ్ చేస్తూ హిందూ సంఘాలు, బీజేపీ నేతలు స్థానిక హనుమాన్ ఆలయం వద్ద నిరసనకు దిగాయి. హిందూ సంఘాల నిరసనను పోలీసులు అడ్డుకోవడంతో ఉద్రిక్త పరిస్థితి చోటు చేసుకుంది. గోరక్షక్ సభ్యులపై దాడి చేసిన వారిని అరెస్టు చేయకుండా తమను అడ్డుకోవడంపై ఆగ్రహం వ్యక్తం చేసిన హిందూ సంఘాలు, బీజేపీ నేతలు రోడ్డుపై బైఠాయించి నిరసన కు దిగారు. దీంతో రోడ్డుపై వాహనాలు భారీగా నిలిచిపోయాయి వాహనదారులు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొన్నారు.
పోలీసుల లాఠీ చార్జ్
పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో పరిస్థితిని అదుపులోకి తీసుకురావడానికి రంగంలోకి దిగిన పోలీసులు లాఠీఛార్జి చేశారు. పోలీసుల లాఠీచార్జిలో భజరంగ్ దళ్ కార్యకర్తలకు గాయాలయ్యాయి. దీంతో ఆగ్రహించిన కార్యకర్తలు పోలీసులపై రాళ్ల దాడి చేశారు. రాళ్ల దాడిలో పోలీసులు వాహనాల అద్దాలు ధ్వంసం కాగా, పలువురు పోలీసులకు గాయాలయ్యాయి. పరిస్థితిని అదుపులోకి తీసుకురావడానికి భారీగా భద్రతా సిబ్బందిని రంగంలోకి దింపిన పోలీసులు, బీజేపీ నేతలను బలవంతంగా అరెస్ట్ చేశారు. వారిని అక్కడి నుంచి తరలించే ప్రయత్నం చేశారు.
కర్మాన్ ఘాట్ పరిసరాల్లో భారీ బందోబస్తు.. ఘటనపై ఫిర్యాదు చేసిన గో రక్షక్ సభ్యులు
ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కర్మన్ ఘాట్ పరిసర ప్రాంతాలలో భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. గోవులను తరలించడానికి ప్రయత్నించిన దుండగులు గో రక్షక్ సభ్యులపై దాడి చేసిన ఘటనపై మీర్ పేట పోలీస్ స్టేషన్ లో గోరక్షక్ సభ్యులు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.