యాదగిరిగుట్టలో టెన్షన్.. ఈవో తీరుపై ఆందోళనల పర్వం, జర్నలిస్టుల అరెస్ట్లతో ఉద్రిక్తత
యాదగిరిగుట్ట బంద్ కు ఈరోజు వ్యాపారులు, స్థానికులు పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. ఆలయ ఈవో గీత వ్యవహార తీరును నిరసిస్తూ చేపడుతున్న బంద్ ను కవర్ చేయడం కోసం వెళ్ళిన జర్నలిస్టులపై ఆలయ ఈవో గీత ఆంక్షలు విధించడంతో జర్నలిస్టులు ఆందోళన బాట పట్టారు. అధికార దర్పాన్ని ప్రయోగించిన గీత ఆందోళన చేస్తున్న జర్నలిస్టులను అరెస్ట్ చేయించారు. ఇక జర్నలిస్టుల అరెస్టుకు నిరసనగా యాదగిరిగుట్ట పోలీస్ స్టేషన్ వద్ద జర్నలిస్టులు మరోమారు ఆందోళనకు దిగారు. దీంతో ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది.
యాదాద్రి ఆలయ ఈవో గీతపై స్థానికుల, వ్యాపారుల ఆగ్రహం .. యాదాద్రి బంద్
యాదాద్రి ఆలయ పునః ప్రారంభం తర్వాత దర్శనం కోసం వచ్చిన భక్తులు ఆలయ ఈవో గీత పెట్టిన కొత్త రూల్స్ తో ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా భక్తుల వాహనాలను కొండపైకి అనుమతించేది లేదని ఈవో గీత తేల్చిచెప్పారు. ఇక ఈవో గీత ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారని ఆమెపై స్థానిక ప్రజల నుండి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతుంది. దీంతో నేడు బంద్ కు పిలుపునిచ్చారు.
గవర్నర్ తమిళి సై ఆలయానికి దర్శనానికి వచ్చిన సమయంలోనూ ఈవో తీరు వివాదాస్పదం
గత కొద్ది రోజులుగా ఈవో గీత వ్యవహారశైలిపై ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఇటీవల యాదాద్రి ఆలయానికి దర్శనానికి వచ్చిన గవర్నర్ తమిళిసై ని ప్రోటోకాల్ ప్రకారం స్వాగతించే కార్యక్రమంలో కూడా ఈవో గీత పాల్గొనలేదు. గవర్నర్ విషయంలో కూడా ఈవో గీత ప్రోటోకాల్ పాటించలేదని ఆమెపై ఆగ్రహం వ్యక్తం అయ్యింది. ఇక ఇదే సమయంలో ఏకపక్షంగా నిర్ణయం తీసుకొని సామాన్య ప్రజలకు ఇబ్బందులు కలిగిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
బంద్ కవర్ చేస్తున్న మీడియా ప్రతినిధులపై ఈవో ఆంక్షలు.. జర్నలిస్ట్ ల అరెస్ట్
ఈ నేపథ్యంలోనే ఈ రోజు బంద్ కొనసాగుతున్న క్రమంలో జర్నలిస్టుల అరెస్టులతో ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుందికొండపైకి స్థానికులు, వ్యాపారులు వాహనాలను అనుమతించాలని డిమాండ్ చేస్తూ యాదాద్రి బంద్ కు పిలుపునిచ్చారు. ఈ బంద్ ను కవర్ చేయడానికి వెళ్లిన మీడియా ప్రతినిధులపై ఆంక్షలు విధించడంతో వారు ఘాట్ రోడ్డు దగ్గర శాంతియుతంగా ఆందోళన చేశారు. అయినప్పటికీ యాదగిరిగుట్టలో ధర్నా చేసిన మీడియా ప్రతినిధులను పోలీసులు బలవంతంగా అరెస్ట్ చేశారు.
యాదగిరి గుట్ట పీఎస్ ఎదుట జర్నలిస్ట్ ల నిరసన.. అన్ని పార్టీల మద్దతు
దీంతో జర్నలిస్టులు ఈవో గీత వ్యవహారశైలిపై మండిపడుతూ అరెస్టులకు నిరసనగా యాదగిరిగుట్ట పీఎస్ ఎదుట నిరసన చేపట్టారు. ఇక మీడియా ప్రతినిధులు చేపట్టిన నిరసనకు టిఆర్ఎస్, కాంగ్రెస్, బిజెపి, సిపిఐ, సిపిఎం సహా అన్ని పార్టీల నాయకులు తమ మద్దతు ప్రకటించారు. యాదగిరిగుట్ట ఆలయ ఈవో గీత తీరుకు నిరసనగా వారు జర్నలిస్టులతో కలిసి ధర్నా నిర్వహించారు.