కాంగ్రెస్ రచ్చబండను అడ్డుకున్న టీఆర్ఎస్... కరీంనగర్ జిల్లాలో రచ్చబండలో ఉద్రిక్తత
కాంగ్రెస్ పార్టీ అత్యంత ప్రతిష్టాత్మకంగా రైతు రచ్చబండ కార్యక్రమాన్ని ఈరోజు నుంచి మొత్తం నెల రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించాలని నిర్ణయించింది. రైతు రచ్చబండ కార్యక్రమం ద్వారా ప్రజల్లోకి కాంగ్రెస్ పార్టీ బలంగా వెళ్లాలని, వరంగల్ లో రాహుల్ గాంధీ సభలో చేసిన రైతు డిక్లరేషన్ ను ప్రజలకు తెలియజేయాలని నిర్ణయం తీసుకున్న కాంగ్రెస్ పార్టీ ఈ మేరకు 1200 గ్రామాలలో రైతు రచ్చబండ కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. మొత్తం 400మంది కాంగ్రెస్ పార్టీ ముఖ్య నేతలు ఈ కార్యక్రమాలలో పాల్గొననున్నారు. అయితే తొలిరోజే రచ్చబండకు ఆటంకాలు ఎదురయ్యాయి.
నేటి నుండి రాష్ట్రవ్యాప్తంగా కాంగ్రెస్ రైతు రచ్చబండ.. జయశంకర్ జిల్లాలో రచ్చబండలో రేవంత్ రెడ్డి!!
తొలిరోజైన నేడు నిర్వహిస్తున్న రైతు రచ్చబండ కార్యక్రమం కరీంనగర్ జిల్లాలో ఉద్రిక్తతలకు కారణమైంది. కరీంనగర్ జిల్లాలోని తిమ్మాపూర్ మండలం మొగిలి పాలెం గ్రామంలో రైతు రచ్చబండ కార్యక్రమంలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. కాంగ్రెస్ పార్టీ నిర్వహిస్తున్న రచ్చబండ కార్యక్రమాన్ని టిఆర్ఎస్ పార్టీ నాయకులు అడ్డుకున్నారు. రచ్చబండ నిర్వహించటానికి వీల్లేదని మండిపడ్డారు. రైతుల కోసం కాంగ్రెస్ పార్టీ చేసిందేమీ లేదని, తెలంగాణ రైతులను మభ్య పెట్టడం కోసమే రైతు డిక్లరేషన్ ప్రకటించారంటూ రైతు రచ్చబండను అడ్డుకునే ప్రయత్నం చేశారు టిఆర్ఎస్ పార్టీ నేతలు.
దీంతో టిఆర్ఎస్ కార్యకర్తలకు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు మధ్య తోపులాట చోటు చేసుకుంది. అది కాస్త ఉద్రిక్తతకు దారి తీసింది. వెంటనే పోలీసులు రంగంలోకి దిగి ఇరువర్గాలను శాంతింప చేసే ప్రయత్నం చేస్తున్నారు. బాహాబాహీకి దిగిన కాంగ్రెస్, టిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉండడం కోసం ముందస్తుగా మొగిలి పాలెంలో పోలీసులు భారీగా మోహరించారు. ఇక టీఆర్ఎస్ నేతల తీరుపై స్థానిక కాంగ్రెస్ నాయకులు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ అంటే భయంతోనే తమ కార్యక్రమాన్ని అడ్డుకుంటున్నారని ఆరోపిస్తున్నారు. ఎవరెన్ని అడ్డంకులు సృష్టించినా రచ్చబండ కార్యక్రమం కొనసాగించి తీరుతామని స్పష్టం చేస్తున్నారు కాంగ్రెస్ పార్టీ నాయకులు.