రైతు భరోసా నిధులు సిద్దం - ఖాతాల్లో జమ..!!
రేవంత్ ప్రభుత్వం రైతు భరోసా అమలు దిశగా కీలక నిర్ణయం తీసుకుంది. ఆర్దికంగా ఇబ్బందులు ఉండటంతో రైతు భరోసా చెల్లింపు కోసం రూ 10 వేల కోట్ల రుణ సమీకరణకు సిద్దమైంది. భూమి తనఖా పెట్టి రుణం పొందాలని నిర్ణయించింది. ఇప్పటికే బ్యాంకులతో సంప్రదింపుల ప్రక్రియ ఒక కొలిక్కి వచ్చింది. ఈ నెలాఖరులో రుణం ప్రభుత్వానికి అందే అవకాశం ఉంది. దీంతో, సంక్రాంతి తరువాత రైతుల ఖాతాల్లో రైతు భరోసా నిధులు జమ చేసేలా కార్యాచరణ సిద్ధం అవుతోంది.
రైతు భరోసా అమలు
రైతు భరోసా నిధులు సంక్రాంతి తరువాత జమ చేస్తామని ఇప్పటికే సీఎం రేవంత్ ప్రకటించారు. ఈ దిశగా ఈ నెల 16 తరువాత అసెంబ్లీ వేదికగా రైతుభరోసా అమలు మార్గదర్శకాల పైన చర్చ చేసి తుది నిర్ణయం తీసుకోనున్నారు. డిప్యూటీ సీఎం భట్టి ఆధ్వర్యాన ఏర్పాటైన మంత్రివర్గ ఉప సంఘం రైతు భరోసా అమలు పైన నివేదిక ఇవ్వనుంది. దీని పైన అసెంబ్లీలో అన్ని పార్టీల అభిప్రాయాలు సేకరించిన తరువాత పథకం అమలు పైన ప్రభుత్వం అసెంబ్లీలోనే ప్రకటన చేయనుంది. అర్హత ఉన్న ప్రతీ రైతుకు అమలు చేస్తామని సీఎం రేవంత్ ప్రకటించారు. ఇదే సమయంలో రైతుభరోసా అమలుకు కావాల్సిన ఆర్దిక వనరులను ప్రభుత్వం సమీకరిస్తోంది.

రూ 10 వేల కోట్ల రుణం
రైతుభరోసా కోసం ప్రభుత్వం రుణం ద్వారా నిధుల సమీకరిస్తోంది. ఈ పథకం అమలుకు ప్రభు త్వానికి దాదాపు రూ 10 వేల కోట్ల అవసరం అవుతుందని అంచనా. ఇందు కోసం తెలంగాణ పారిశ్రామిక మౌలిక సదుపాయాల సంస్థ(టీజీఐఐసీ) అధీనంలోని భూమిని తనఖా పెట్టి రూ.10 వేల కోట్ల రుణం తీసుకోవాలని సర్కారు నిర్ణయించింది. ప్రభుత్వ ప్రతిపాదన మేరకు 9.6 శాతం వార్షిక వడ్డీతో రూ.10 వేల కోట్ల అప్పు ఇవ్వడానికి ఐసీఐసీఐ బ్యాంకు ముందుకొచ్చిందని సమా చారం. ఈ నెలాఖరులోగా రుణం అందే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తు న్నారు. ఈ దిశగా ప్రస్తుతం బ్యాంకు - ప్రభుత్వ ఆర్దిక శాఖ మధ్య సంప్రదింపులు కొనసాగుతున్నాయి.
అమలు పై కసరత్తు
హైదరాబాద్ నగరంలోని టీజీఐఐసీ ఆధీనంలో కోకాపేట, రాయదర్గంలో ఉన్న 400 ఎకరాల భూముల్ని తనఖా పెట్టి అప్పు తీసుకోవాలని ప్రభుత్వం డిసైడ్ అయింది. ఈ దిశగా ఆర్బీఐ కు ప్రభుత్వం ప్రతిపాదనలు పంపింది. కానీ, వాటిని ఆర్బీఐ వెనక్కి పంపింది. ఆడిటింగ్ పైన ఆర్బీఐ కొన్ని సందేహాలు లేవనెత్తింది. ఇటు ఆడిటింగ్ను కొలిక్కి తెచ్చేలా వ్యవహరిస్తూనే.. మరో వైపు బ్యాంకుల కన్సార్షియంతో సంప్రదింపులు చేసింది. ఈ నేపథ్యంలో ఐసీఐసీఐ బ్యాంకు రుణం ఇవ్వడానికి సంసిద్దత వ్యక్తం చేసింది. ఈ నెలాఖరు నాటికి ఏడు వేల మంది ఉద్యోగులు పదవీ విరమణ చేయనున్నారు. వారికి రూ 2 వేల కోట్ల విలువైన ప్రయోజనాలు అందించాల్సి ఉంది. దీంతో, ఈ నిధుల తో పాటుగా రైతు భరోసాకు ఉపయోగపడేలా రూ 10 వేల కోట్ల రుణం ప్రభుత్వం సమీకరిస్తోంది. దీంతో, సంక్రాంతి వేళ రైతుల ఖాతాల్లో రైతు భరోసా నిధుల జమకు వీలుగా ప్రభుత్వం కార్యాచరణ అమలు చేస్తోంది.












Click it and Unblock the Notifications