బోర్డ్ అదికారులపై చర్యలు..!చనిపోయిన కుటుంబాల బాద్యత ప్రభుత్వానిదే అన్న కాంగ్రెస్ నేతలు..!!
హైదరాబాద్ : ఇంటర్ బోర్డ్ తప్పిదాలపై ఆగ్రహ జ్వాలలు రగులుతూనే ఉన్నాయి. రాజకీయ పార్టీలు కూడా జరిగిన సంఘటన పట్ల దిద్దుబాటు చర్యలు చేపట్టి విద్యార్థుల భవితను కాపాడలని డిమాండ్ చేస్తున్నాయి. ఇంటర్ ఫలితాల్లో తప్పిదాలు చేసినందుకుగాను బోర్డు అధికారులపై చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిండెంట్ రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు. తెలంగాణ ఇంటర్ బోర్డ్ కార్యాలయం ఎదుట ఆయన ధర్నా చేపట్టారు. విద్యార్థులందరికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ఇంటర్ ఫలితాల తప్పిదాలపై సీఎం చంద్రశేఖర్ రావు ఎందుకు స్పందించడం లేదో చెప్పాలన్నారు. రీ కౌంటింగ్, రీ వాల్యూవేషన్కు కూడా అనుమతి ఇవ్వకపోవడం దారుణమన్నారు. ఫలితాల తప్పిదాలనకు విద్యాశాఖ మంత్రి జగదీశ్వర్ రెడ్డి బాధ్యత వహించాలని రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు.
తెలంగాణ ఇంటర్ బోర్డు వైఫల్యాల పట్ల రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర నిరసనలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి ఈ వివాదంపై స్పందించారు. మంగళవారమిక్కడ ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. అధికారుల నిర్లక్ష్య సమాధానాలతో విద్యార్థులు, తల్లిదండ్రులు మరింత ఆందోళన చెందుతున్నారన్నారు. ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు జోక్యం చేసుకుని సాద్యమైనంత త్వరగా ఈ సమస్యకి పరిష్కారం చూపాలని జగ్గారెడ్డి డిమాండ్ చేశారు. వైఫల్యానికి బాధ్యులైన అధికారులపై వెంటనే తగిన చర్యలు తీసుకోవాలని కోరారు. చనిపోయిన ప్రతి విద్యార్థి కుంటుంబానికి 25 లక్షల రూపాయల ఆర్థిక సాయం చేయాలని జగ్గారెడ్డి డిమాండ్ చేశారు.