కేంద్ర వైఖరి మారలేదు.!నిరాశే మిగిలింది.!గంపెడు దుఃఖంతో వెనుదిరిగిన మంత్రులు.!
ఢిల్లీ/హైదరాబాద్: ఢిల్లీ పెద్దలను ఎన్ని సార్లు కలిసినా, ఎన్ని శాలువాలు కప్పినా, ఎంత మొత్తుకున్నా తగ్గేది లే, ఒక్క గింజ కూడా ముట్టం, కొనం అనే ధోరణిలో ఉన్నారని తెలంగాణ మంత్రులు బాదా తప్త హృదంతో వివరిస్తున్నారు. కేంద్ర మంత్రి పియూష్ గోయల్ తో చర్చలు విఫలం చెందడంతో గెండెలు ముక్కలు చేసుకున్న మంత్రులు గంపెడు దుఃఖంతో తిరుగు ప్రయాణమయ్యరు. పెద్ద సారుతో జరిగిందంతా చెప్పి తదుపరి కార్యచరణ ప్రకటిస్తామని తెలంగాణ మంత్రులు స్పష్టం చేస్తున్నారు.
కొలిక్కి రాని చర్చలు.. విషన్న వదనాలతో వెనుదిరిగిన మంత్రులు
కేంద్రం తీరు బాధాకరమని, యాసంగి ధాన్యం కొనుగోళ్లపై స్పష్టత ఇవ్వక పోవడం శోచనీయమని, కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ తో గంటకు మించి జరిపిన చర్చల్లో ఎలాంటి పురోగతి లేదని తెలంగాణ మంత్రలు వివరిస్తున్నారు. ధాన్యం కొనుగోళ్లపై పీయూష్ గోయల్తో జరిపిన చర్చలు మంత్రుల బృందం జరిపిన చర్చలు విఫలమయ్యాయని ఢిల్లీ వెళ్లిన మంత్రులు చెప్పుకొస్తున్నారు. యాసంగి వడ్లు కొనేందుకు సిద్ధంగా లేమని, ఏడాదికి ఎంత సేకరిస్తారో చెప్పడం అసాధ్యమని కేంద్ర మంత్రి కుండ బద్దలు కొట్టినట్టు చెప్పారని రాష్ట్ర మంత్రుల బృందం పేర్కొంటోంది. దీంతో తాము నిరాశతో వెనుదిరుగుతున్నట్టు పేర్కొన్నారు.
కేంద్రం మొండి వైఖరి.. ఒక్క గింజకూడా కొనేదిలేదంటున్న కేంద్రం
ఇదిలా ఉండగా యాసంగిలో వరి వేయొద్దని కేంద్రం చెబుతోందని, ఇక్కడ మాత్రం రాష్ట్ర బీజేపి నేతలు వరి వేయాలంటున్నారని కేంద్ర మంత్రికి రాష్ట్ర మంత్రులు వివరించారు. తెలంగాణ బీజేపి నేతలకు సైతం నిబంధనల గురించి ఇప్పుడు వివరిస్తున్నామని పీయూష్ గోయల్ స్పష్టం చేసినట్టుగా మంత్రుల బృందం చెప్పుకొస్తోంది. వానాకాలంలో 62 లక్షల ఎకరాలలో వరి వేశామంటే ఒప్పుకోని కేంద్రం, శాటిలైట్ సర్వే చేసి 58 లక్షల ఎకరాలలో వరి వేసినట్లు ఒప్పుకుందిని వివరించారు. కేంద్రం తీరు నిరాశపరిచిందని, ఢిల్లీలో కేంద్రమంత్రితో భేటీ అనంతరం రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి, ఎర్రబెల్లి, మల్లారెడ్డిలతో పాటు ఎంపీలు తదితర అదికారులు వివరాలను తెలిపారు.
రాష్ట్ర బీజేపి గందరగోళం సృష్టిస్తోందన్న మంత్రుల బృందం.. వారికి నిబంధనలు వివరిస్తామన్న కేంద్రం
వరి ధాన్యంపై కేంద్రం, తెలంగాణ ప్రభుత్వం మధ్య చోటు చేసుకుంటున్న పరిణామాలు సస్పెన్స్ థ్రిల్లర్ సీరియల్ ను మరిపిస్తున్నాయి. యాసంగి సీజన్లో పండిన పంట కొంటారా లేదా అని కేంద్రాన్ని నిలదీస్తోంది తెలంగాణ ప్రభుత్వం. ఈ మేరకు మంత్రుల బృందం కేంద్రమంత్రి మంత్రి పియూష్ గోయల్తో సమావేశమైంది. ఎన్ని వడ్లు కొంటారో చెప్పాలని స్పష్టత కోరినట్టు తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్రెడ్డి ఓ ప్రకటనలో తెలిపారు. నిరంజన్ రెడ్డి విడుదల చేసిన ప్రకటన ప్రకారం వరి ధాన్యం కొనుగోలు విషయంలో కేంద్రం స్పష్టత ఇవ్వలేదన్నారు. దీనిపై కేంద్రం చేతులెత్తేసిందని ఆగ్రహం వ్యక్తం చేసారు. ఈ సీజన్లో ఎంత మొత్తం ధాన్యం సేకరిస్తారో అడిగితే స్పష్టమైన సమాధానం కేంద్రమంత్రి నుంచి రాలేదన్నారు నిరంజన్ రెడ్డి.
ఇప్పుడేంటి కర్తవ్యం.. సీఎంతో చర్చల తర్వాత కార్యచరణ ఉంటుందన్న మంత్రులు
రెండునెలల క్రితమే ధాన్యం కొనుగోలుపై ముఖ్యమంత్రి చర్చలు జరిపి, అన్ని అంశాలు కొలిక్కి తీసుకొచ్చారని, కేంద్రమంత్రి సుముఖత వ్యక్తం చేస్తే కొనుగోలు సజావుగా సాగేదని, ఇప్పుడు కేంద్ర మొండి వైఖరి కారణంగా రైతులకు తీరని నష్టం కలుగుతుందన్నారు నిరంజన్రెడ్డి. కేంద్రం తీరు ఇలా ఉంటే తెలంగాణలో బీజేపీ తీరు మాత్రం వేరుగా ఉందని మండిపడింది మంత్రుల బృందం. ప్రజల్లో గందరగోళం సృష్టించేందుకు ఇష్టం వచ్చినట్టు ప్రకటనలు చేస్తున్నారని విమర్శలు చేసింది. దీనిపై కేంద్రం నుంచి కూడా బీజేపీ నేతలకు సూచనలు వచ్చాయని నిరంజన్రెడ్డి వెల్లడించారు. తెలంగాణ రాష్ట్ర ధాన్యం సేకరణపై కేంద్ర పౌర సరఫరాల శాఖ మంత్రి పీయూష్ గోయల్ తో న్యూ ఢిల్లీ లో సమావేశమైన రాష్ట్ర మంత్రులు సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి, మల్లారెడ్డి, ఎర్రబెల్లి దయాకర్ రావు ,ఇతర ఉన్నతాధికారులతో జరిపిన చర్చలు విఫలం కావడంతో గంపెడు దుఃఖంతో వెనుదిరిగారు.