తెలంగాణ కల ఇంకా సాకారం కాలేదు.!కేసీఆర్ పాలన పట్ల ప్రజల్లో అసంతృప్తి ఉందన్న యల్ రమణ.!
హైదరాబాద్ : ఎందరో అమరవీరుల బలిదానాలు, త్యాగలతో, పోరాడి సాధించుకున్న తెలంగాణా కల పూర్తిగా సాకారం కాలేదని తెలంగాణ తెలుగుదేశం పార్టీ అద్యక్షుడు యల్ రమణ తెలిపారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినొత్సవాన్ని పురస్కరించుకొని తెలుగుదేశం పార్టీ తెలంగాణ రాష్ట్ర పార్టీ కార్యాలయంలో ఎల్.రమణ జాతీయ జెండాను, తెలంగాణ రాష్ట్ర జెండాను ఎగురవేశారు. తెలంగాణ రాష్ట్రం సిద్దించిన తర్వాత కూడా నేడు దొరల పాలన పునరావృతం అవుతోందని ఆవేదన వ్యక్తం చేసారు. తెలంగాణ ఆవిర్బావ దినోత్సవం సందర్బంగా తెలంగాణ ప్రజలకు యల్ రమణ శుభాకాంక్షలు తెలియజేశారు.
తెలంగాణ లక్షం ఇంకా నెరవేరలేదు..
ఆనాడు నిధులు, నీళ్ళు, నియామకాల కోసమే కాకుండా తెలంగాణలోని అట్డడుగు వర్గాలకు న్యాయం జరిగుతుందని పోరాడి సాధించుకున్న తెలంగాణాలో అంతటా అసంతృప్తి నెలకొందని యల్ రమణ స్పష్టం చేసారు. ఇప్పుడు నిరుద్యోగ సమస్య, కేజీ టు పిజి ఉచిత విద్య, వైద్యం అందించడంలో ఈ టీఆర్ఎస్ ప్రభుత్వం విఫలమైందని అన్నారు.
తెలంగాణ రాష్ట్రంవస్తే దళితులను ముఖ్యమంత్రిని చేస్తానని, ఇంటికొక ఉద్యోగం,దళితులకు మూడు ఎకరాల భూమి, అల్లుడు వస్తే పడుకోవటానికి డబుల్ బెడ్ రూమ్ ఇల్లు, ప్రతి ఇంటికి మంచినీనేటి నల్ల ఇస్తామని నమ్మబలికి అందరిని ముఖ్యమంత్రి చంద్రవేఖర్ రావుమోసం చేశారని ధ్వజమెత్తారు.
విభజన హామీలు ఇంకా దక్కలేదు..
అంతే కాకుండా తెలుగు రాష్ట్రాల ఏర్పాటు సమయంలో పొందుపరిచిన విభజన చట్టంలోని పలు అంశాలను కేంద్ర ప్రభుత్వం వెంటనే అమలు చేయాలని యల్ రమణ డిమాండ్ చేశారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా అవతరించి నేటికి ఏడు సంవత్సరాలు పూర్తి అవుతున్న ఇంకా విభజన చట్టంలోని పలు అంశాలు అమలు కాకపోవడం బాధాకరమని అన్నారు.
తెలంగాణ రాష్ట్రంలో బయ్యారం స్టీల్ ఫ్యాక్టరీ, కాజీపేట కొజ్ ఫ్యాక్టరీ, ట్రైబల్ యూనివర్సిటీ, వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధికి ఫ్యాక్టరీల ఏర్పాటు చేయడం కోసం ఇన్సెంటివ్ లు ఇవ్వలేదన్నారు.
మహిళలపై చిన్న చూపు..
ప్రత్యేక తెలంగాణ రాష్ట్రంలో మహిళా సాధికారత, మహిళాభ్యుదయం అనే పదాలు మర్చిపోవాల్సిన సమయం ఆసన్నమైందని తెలంగాణ తెలుగు మహిళా అద్యక్షురాలు తురునగరి జ్యోత్ప్న ఆందోళన వ్యక్తం చేసారు. తెలంగాణ ఉద్యమంలో మహిళల పాత్ర ఎంతో కీలకం అయినప్పటికి మహిళలకు సముచిత స్థానం కల్పించడంలో మాత్రం ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు వివక్ష చూపుతూనే ఉన్నారని ఆవేదన వ్యక్తం చేసారు.
మహిళల మీద అత్యచారాలు తగ్గుముఖం పట్టాయని చెప్పుకొస్తున్న తెలంగాణ ప్రభుత్వం మొన్న మహబూబాబాద్ లో గిరిజన మహిళపై జరిగిని ఘోరానికి ఏం సమాధానం చెబుతారని జ్యోత్స్న నిలదీసారు.
ఉద్యమంలో మహిళలది కీలక పాత్ర..
అంతే కాకుండా నీళ్లు, నిధులు, నియామకాలు, అనేమూడు అంశాలతో కొట్లాడి, పోరాడి తెచ్చుకున్న తెలంగాణ ఏడేళ్ల సుధీర్ఘ సమయంలో ఆశించిన స్థాయిలో అబివృద్ధి జరగలేదని, కొన్ని వర్గాల వాళ్లకు మాత్రమే ముఖ్యంగా చంద్రశేఖర్ రావు కుటుంబానికి మాత్రమే బంగారు తెలంగాణ వచ్చిందని ఎద్దేవా చేసారు. బంగారు తెలంగాణ వల్ల చంద్రవేఖర్ రావు కుటుంబ సభ్యులు లాభ పడ్డారు తప్ప, తెలంగాణలో ఏ ఒక్క కుటుంబం సంతోషంగా లేదని జ్యోత్స్న స్పష్టం చేసారు. ఎందరో ప్రాణత్యాగాలతో తెలంగాణ రాష్ట్రం ఏర్పడి ఏడేళ్లు పూర్తి చేసుకున్న సందర్బంలో స్వరాష్ట్ర ఉత్సామాన్ని ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు అన్ని విధాలా నీరుగార్చారని జ్యోత్స్న మండిపడ్డారు.