Weather Update: తెలంగాణలోని పలు జిల్లాలకు భారీ వర్ష సూచన..!
ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా మారింది. దీని ప్రభావంతో తెలంగాణలో పలు చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది. బుధవారం సిద్దిపేట, సంగారెడ్డి, మెదక్, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాల్లో భారీ వర్షాలకు ఛాన్స్ ఉందని వివరించింది. రాష్ట్ర రాజధాని హైదరాబాద్ లో కూడా భారీ వర్షం కురిసే అవకాశం ఉందని పేర్కొంది. హైదరాబాద్ లో గత మూడు రోజుల నుంచి వర్షాలు కురుస్తున్నాయి. సోమవారం, మంగళవారం, బుధవారం హైదరాబాద్ లోని పలు ప్రాంతాల్లో వర్షం కురిసింది.
మంగళవారం ఉదయం మాదాపూర్, హైటెక్ సిటీ, బోరబండ, మోతినగర్, ఎర్రగడ్డ, ఎస్సార్ నగర్, అమీర్ పేట, పంజాగుట్ట, ఖైరతాబాద్ పాటు పలు ప్రాంతాల్లో వర్షం కురిసింది. భారీ వర్షంతో పలు ప్రాంతాల్లో రోడ్డుపై నీరు నిలిచింది. జీహెచ్ఎంసీ సిబ్బంది రోడ్డుపై నీటిని ఎప్పటికప్పుడు క్లియర్ చేస్తున్నారు. బుధవారం హైదరాబాద్ లో వాతావరణం మారింది. తెల్లవారుజాము నుంచి ఆకాశం మేఘావృతమై ఉంది. పలు ప్రాంతాల్లో జల్లులు కురిశాయి. కార్యాలయాలు, పాఠశాలలు, కళాశాలలకు వెళ్లే సమయం కావడంతో వాహనదారులు కాస్త ఇబ్బంది పడ్డారు.

తెలంగాణలోని పలు ప్రాంతాల్లో వర్షాలు కురుస్తుండడంతో ప్రాజెక్టుల్లో నీటి మట్టం పెరుగుతోంది. నల్గొండ జిల్లా నాగార్జున సాగర్ కు పై నుంచి వరద తాకిడి పెరిగింది. దీంతో అధికారులు ప్రాజెక్టు 4 క్రస్ట్ గేట్లు ఎత్తి నీటిని కిందికి వదులుతున్నారు. నాగార్జునసాగర్ పూర్తి స్థాయి నీటి మట్టం 312 టీఎంసీలు కాగా.. ప్రస్తుతం 312 టీఎంసీలుగా ఉంది. వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు చెప్పడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. వరి కోతకు వచ్చిందని.. ఈ సమయంలో వర్షం కురిస్తే నష్టం వాటిల్లుతుందని భయపడుతున్నారు.
ఈ వాయుగుండం ప్రభావంతో ఏపీలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. అంబేద్కర్ కోనసీమ, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, అల్లూరి సీతారామరాజు, పార్వతీపురం మన్యం, ఏలూరు, కృష్ణా జిల్లాల్లో వర్షం కురిసింది. భారీ వర్షాల నేపథ్యంలో చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో రెండ్రోజులు విద్యాసంస్థలకు సెలవు ఇచ్చారు. భారీ వర్షాల నేపథ్యంలో అధికారులు అప్రమత్తమయ్యారు. అటు చెన్నై, బెంగళూరులో కూడా భారీ వర్షాలు కురుస్తున్నాయి. కాగా ఈసారి తెలంగాణలో సాధారణం కంటే అధిక వర్షపాతం నమోదు అయినట్లు అధికారులు అంచనా వేస్తున్నారు.












Click it and Unblock the Notifications