అద్యక్షుడు ఎక్కడైనా పర్యటించొచ్చు.!కోమటిరెడ్డికి ఆమాత్రం తెలియదా.?టీ కాంగ్రెస్ లో ఆసక్తికర చర్చ.!
హైదరాబాద్ : తెలంగాణలో రాహుల్ గాంధీ పర్యటన కాంగ్రెస్ నేతల మధ్య ఐక్యతను తీసుకొస్తుందో, విభేదాలు మరింత ముదిరేలా చేస్తుందో అర్ధం కాని పరిస్థితులు నెలకొన్నాయి. రాహుల్ గాంధీ పర్యటనను విజయవంతం చేసి తెలంగాణ కాంగ్రెస్ శ్రేణుల్లో నూతన ఉత్సాహం నింపేందుకు పార్టీ అద్యక్షుడు రేవంత్ రెడ్డి శక్తి వంచన లేకుండా శ్రమిస్తున్నారు. రాహుల్ గాంధీ సభ నిర్వహించబోయే వరంగల్ జిల్లాకు సమీపంలోని మండలాలను, పక్క జిల్లాలను కలుపుకుని జన సమీకరణకు వ్యూహ రచన చేస్తున్నారు రేవంత్ రెడ్డి.
రేవంత్ నల్లగొండలో పర్యటించాల్సిన అవసరం లేదు..
ఈ క్రమంలో ఉమ్మడి వరంగల్ జిల్లా నేతలతో పలు దఫాలుగా సమావేశాలు నిర్వహించి సభ విజయవంతంపైన దిశానిర్దేశం చేసారు రేవంత్ రెడ్డి. అంతే కాకదుండా కరీంనగర్, ఖమ్మం జిల్లాల్లో కూడా రేవంత్ రెడ్డి పార్టీ ముఖ్య నేతలతో సమీక్షలు నిర్వహించారు. వరంగల్ కు యాభై కిలో మీటర్లు, వంద కిలోమీటర్ల దూరం ఉన్న ప్రాంతాల నుండి జనాలను ఎలా తరలించాలనే అంశంపై పార్టీ నేతలతో చర్చించేందుకు రేవంత్ ప్రణాళిక రచించారు. ఈ నేపథ్యంలో నల్లగొండ జిల్లాలో కూడా పర్యటించాలని భావించారు. కానీ అసలు కథ ఇక్కడే మొదలయ్యింది.
కోమటిరెడ్డి విధానం తప్పు..
రాహుల్ గాంధీ సభ సందర్బంగా రేవంత్ రెడ్డి నల్లగొండ జిల్లా పర్యటన చర్చనీయాంశంగా మారింది. రేవంత్ రెడ్డి పర్యటన నల్లగొండ జిల్లాలో అవసరం లేదని స్టార్ క్యాంపెయినర్, భువనగిరి ఎంపి కోమటిరెడ్డి వెంకట రెడ్డి తేల్చి అసలు వివాదం రాజుకుంది. నల్లగొండ జిల్లాలో కాంగ్రెస్ పార్టీ పటిష్టంగా ఉంది, అద్యక్షుడు పర్యటించి బలోపేతం చేయాల్సిన అవసరం లేదు, రాహుల్ గాంధీ సభకు నల్లగొండ జిల్లా నుండి ఎంతమంది జనాన్ని తరలించాలో తనకు తెలుసు అనే సంకేతాలు ఇచ్చారు కోమటిరెడ్డి. ప్రస్తుతానికి తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో ఇదే అంశంపై చర్చ జరుగుతోంది.
ఢిల్లీ చేరిన కోమటిరెడ్డి వీడియో టేపులు..
నల్లగొండ జిల్లాలో పార్టీ బలోపేతంగా ఉంది, టీపిసిసి అద్యక్షుడు పర్యటించి కార్యకర్తల్లో ఉత్తేజం నింపాల్సిన అవసరం లేదనే దోరణిలో కోమటిరెడ్డి వెంకటరెడ్డి చేసిన వ్యాఖ్యలపట్ల పార్టీలో అభ్యంతరాలు వ్యక్తం అవుతున్నాయి. పార్టీ అద్యక్షుడి పర్యటన పట్ల వ్యతిరేకత వ్యక్తం చేయడం, ఉచిత సలహాలు ఇవ్వడం కోమటి రెడ్డికి తగదనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.
పార్టీ అద్యక్షుడిగా రేవంత్ రెడ్డి ఏ ప్రాంతంలోనైనా పర్యటించే స్వేచ్చ ఉందని, బలం బలహీనతల అంశం పరిగణలోకి రాదని పార్టీ శ్రేణులు స్పష్టం చేస్తున్నాయి. కోమటి రెడ్డి అత్యుత్సాహాన్ని ప్రదర్శించడం మానుకొని టీపిసిసి లైన్ కు లోబడి వ్యవహిరిస్తే శ్రేయస్కరంగా ఉంటుందనే అభిప్రాయలను పార్టీ నాయకులు వ్యక్తం చేస్తున్నారు.
సభ సక్సెస్ చేయాలి..
అంతే కాకుండా రేవంత్ రెడ్డి నల్లగొండ జిల్లా పర్యటన పట్ల కోమటి రెడ్డి చేసిన వ్యాఖ్యలను పార్టీ అధిష్టానం సీరియస్ గా తీసుకున్నట్టు తెలుస్తోంది. కోమటి రెడ్డి ఏం మాట్లాడారు, అద్యక్షుడి పర్యటన పట్ల ఎలా స్పందించారో తెలుసుకునేందుకు కోమటిరెడ్డి మాట్లాడిన వీడియో క్లిప్పింగులను నిశితంగా పరిశీలిస్తున్నట్టు తెలుస్తోంది.
గత నెలలో పార్టీ ముఖ్యనేతలను ఢిల్లీ పిలుపించుకుని రాహుల్ గాంధీ దిశానిర్ధాశం చేసినప్పటికి ఎందుకు భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయనే కోణంలో అధిష్టానంలో చర్చ జరుగుతున్నట్టు తెలుస్తోంది. కోమటి రెడ్డి వ్యవహార శైలి పట్ల కూడా అదిష్టానం అభ్యంతరాలు వ్యక్తం చేసే అవకాశాలు ఉన్నట్టు తెలుస్తోంది.