TRS: తెలంగాణ భవన్లో టీఆర్ఎస్ ప్రజా ప్రతినిధులు అత్యవసర సమావేశం.. అందుకేనా..
కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి ఇంటితో పాటు కుమారుడు, అల్లుడు ఇళ్లు, కాలేజీల్లో ఐటీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. మరో పక్క తెలంగాణ భవన్ లో టీఆర్ఎస్ ప్రజా ప్రతినిధులు అత్యవసరంగా సమావేశం అయ్యారు. ఈ సమావేశానికి మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు హాజరయ్యారు. ఆత్మీయ సమ్మేళనాలపై చర్చించేందుకే నేతలు భేటీ అయినట్లు చెబుతున్నా... ఐటీ సోదాలపై చర్చ జరిగినట్లు తెలుస్తోంది. ఐటీ దాడల అంశంపై చర్చించేందుకే వారంతా సమావేశమైనట్లు వార్తలు వస్తున్నాయి.
ఐటీ, ఈడీ, సిట్
ఐటీ, ఈడీ, సిట్ విచారణలతో రాష్ట్రం రాజకీయం వేడెక్కింది. ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహరంలో సిట్ దూకుడు పెంచింది. ఈ కేసులోని ముగ్గురు నిందితులపై లుకౌట్ నోటీసులు జారీ చేసింది.బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బీఎల్ సంతోష్, కేరళ బీడీజేఎస్ అధినేత తుషార్, కేరళకు చెందిన వైద్యుడు జగ్గుస్వామిలపై సిట్ లుకౌట్ నోటీసులు జారీ చేసింది. వీరందరికీ సోమవారం విచారణకు హాజరు కావాలని సిట్ నోటీస్ ఇచ్చింది. అయినా వారు విచారణకు హాజరు కాకపోవదంతో లుకౌట్ నోటీసులు ఇచ్చింది.
క్యాసినో కేసు
అటు ఈడీ క్యాసినో కేసు సంబంధించి విచారణ వేగవంతం చేసింది. సోమవారం మంత్రి తలసాని శ్రీనివాస్ పీఏ హరీష్ విచారణకు హాజరయ్యారు. ఈడీ అధికారులు హరీష్ ను 7 గంటలపాటు విచారించారు. క్యాసినో కేసులో విచారణకు రావాలంటూ ఈనెల 18వ తేదీన నోటీసులు జారీచేశారు. హరీష్ కు చెందిన బ్యాంకు ఖాతాలను అధికారులు పరిశీలించారు. ఇదే కేసులో తలసాని సోదరులు ధర్మేంద్ర యాదవ్, మహేష్ యాదవ్ కూడా హాజరైన సంగతి తెలిసిందే. ఎమ్మెల్యే ఎల్ రమణ కూడా ఈడీ విచారణకు హాజరయ్యారు.
మంచి రెడ్డి కిషన్ రెడ్డి
సుమారు 130 మంది జాబితాను క్యాసినో కేసులో ఈడీ అధికారులు తయారు చేశారు. జాబితా ప్రకారం విచారణ సాగుతోంది. గతంలో ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మంచి రెడ్డి కిషన్ రెడ్డి కూడా ఈడీ విచారణకు హాజరయ్యారు. అటు లిక్కర్ కుంభకోణం కేసులో కూడా ఈడీ దూకుడుగా వ్యవహారిస్తుంది. ఈ కేసులో నిందితుడిగా ఉన్న బోయిన్ పల్లి అభిషేక్ రావును పలు మార్లు విచారించింది.
50 బృందాలు
రాష్ట్రంలో ఐటీ అధికారులు సోదాలు చేపట్టారు. మంగళవారం ఉదయం నుంచి 50 బృందాలతో మంత్రి మల్లారెడ్డి నివాసాలపై దాడులు కొనసాగిస్తున్నారు. సికింద్రాబాద్ గేటెడ్ కమ్యూనిటీ లో ఉన్న ఆయన ఇల్లు, ఇతర కార్యాలయాలలో తనిఖీలు ప్రారంభించారు ఇన్కమ్ టాక్స్ అధికారులు. మల్లారెడ్డి కాలేజీలకు మహేందర్ రెడ్డి డైరెక్టర్ గా వ్యవహరిస్తున్నారు.
ఆర్థిక లావాదేవీలపై
ఈ క్రమంలో ఆయన ఆర్థిక లావాదేవీలపై ఐటీ శాఖ అధికారులు నజర్ పెట్టారు. మల్లారెడ్డి కుమారుడు మహేందర్ రెడ్డి తో పాటు ఆయన అల్లుడు నివాసంలో ఆదాయపు పన్ను శాఖ అధికారుల దాడులు కొనసాగుతున్నాయి. అధికారులు బృందాలుగా ఏర్పడి హైదరాబాద్, మేడ్చల్ మల్కాజ్గిరి, రంగారెడ్డి జిల్లాల్లో 50 చోట్ల ఏకకాలంలో తనిఖీలు చేపట్టారు. మంత్రి మల్లారెడ్డి కూతురు, కొడుకులు మహేందర్ రెడ్డి, భద్రారెడ్డి, అల్లుళ్ళ నివాసాలతో పాటు మల్లారెడ్డి తమ్ముళ్ల ఇళ్లపై తనిఖీలు కొనసాగుతున్నాయి.