కృపయా ధ్యాన్ దే.! రామాయణ సర్క్యూట్ రైలు ఇప్పుడు భద్రాచలాన్ని కూడా టచ్ చేస్తుంది.!
హైదరాబాద్ : భారతీయ రైల్వే ఆధ్వర్యంలో నడుస్తున్న ఐఆర్సీటీసి అనేక ఇతిహాసాలకు, మత సాంప్రదాయాలకు సంబంధించిన పుణ్యక్షేత్రాలను ఒకే యాత్రలో సందర్శించేలా యాత్రికులకోసం వివిధ యాత్రా సర్క్యూట్ ట్రైన్ లను ప్రవేశపెట్టింది. అందులో భాగంగానే అయోధ్య నుండి రామేశ్వరం వరకు రామాయంతో సంబంధమున్న వివిధ పుణ్యక్షేత్రాలను కలుపుతూ ఐఆర్సీటీసి రామాయణ సర్క్యూట్ ట్రైన్ ను ఈ నెల 7 వ తేదీన ఢిల్లీలో ప్రారంభించడం జరిగింది. ఈ యాత్రలో రామయణంతో సంబంధమున్న అనేక పుణ్యక్షేత్రాలు ఉన్నప్పటికీ, రాములవారు తన అరణ్యవాసంలో దాదాపు 10 సంవత్సరాల కాలంపాటు నివసించిన తెలంగాణ రాష్ట్రంలోని పర్ణశాల, జటాయిపాక, దుమ్ముగూడెం, గూండాల ప్రాంతాల మధ్యన, గోదావరి నది ఒడ్డున శ్రీరాముల వారు కొలువు దీరిన భద్రాచలం పుణ్యక్షేత్రం లేదన్న విషయం తెలంగాణ ప్రాంతానికే చెందిన కేంద్ర సాంస్కృతిక, పర్యాటక, ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధి శాఖల మంత్రి జి. కిషన్ రెడ్డి దృష్టికి వచ్చింది.
వెంటనే స్పందించిన కేంద్రమంత్రి కిషన్ రెడ్డి బుదవారం కేబినెట్ సమావేశం అనంతరం ఈ విషయాన్ని ప్రధాన మంత్రి నరేంద్రమోదీ దృష్టికి తీసుకెళ్లడం, ఆ వెంటనే ప్రధాని మోదీ చొరవతో రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ తో సంప్రదింపులు జరపడం, ఆవెంటనే భద్రాచలం పుణ్యక్షేత్రాన్ని కూడా ఎటువంటి అదనపు ఛార్జీలను వసూలు చేయకుండా, ఇది వరకే యాత్రికులకు ఇచ్చిన ప్యాకేజీలో భాగం చేస్తూ ప్రతిష్టాత్మకమైన, పవిత్ర రామాయణ సర్క్యూట్ యాత్రలో చేరుస్తూ ఉత్తర్వులు వెలువడటం వంటి పనులన్నీ కూడా గంటల వ్యవధిలోనే జరిగిపోయాయి. ఈ సందర్భంగా వెంటనే స్పందించిన ప్రధానమంత్రి నరేంద్రమోదీ, రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ కి యావత్ తెలంగాణ రాష్ట్ర ప్రజల తరపున, భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి వారి అశేష భక్తుల తరపున కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేశారు. ఇప్పుడు రామాయణ సర్క్యూట్ ట్రైన్ తన తిరుగు ప్రయాణంలో భద్రాచలం పుణ్యక్షేత్రాన్ని కూడా సందర్శించిన అనంతరం ఢిల్లీకి చేరుకుంటుందని మంత్రి స్పష్టం చేసారు.