ఆ ఎన్నారై సంసారానికి పనికి రాడు: దాచేసి పెళ్లి చేసుకుని వేధించాడు
శృంగారానికి పనికి రాడని తెలిసి ఓ ఎన్నారైకి ఓ యువతితో పెళ్లి చేశారు. ఆ యువతి కుటుంబ సభ్యుల వద్ద ఆ విషయం దాచిపెట్టారు.
హైదరాబాద్: సంసారానికి పనికి రాననే విషయం తెలిసి ఓ ఎన్నారై పెళ్లి చేసుకుని ఓ యువతిని మోసం చేయడమే కాకుండా విదేశాలకు తీసుకుని వెళ్లి చిత్రహింసలు పెట్టారు. ఆ ఎన్నారై తల్లిదండ్రులు కూడా అసలు విషయం దాచి పెట్టి పెళ్లి కుదిర్చారు.
ఈ సంఘటనలో కోర్టులను కూడా తప్పుదోవ పట్టించి ఎన్నారై, అతని తల్లిదండ్రులు తప్పించుకునే ప్రయత్నం చేశారు. స్విట్జర్లాండ్లో స్థిరపడిన యెల్లపెద్ది రవిశంకర్, జానకి దంపతుల కుమారుడు యెల్లపెద్ది ఆదిత్యతో నగరానికి చెందిన భవ్యకీర్తి(26)కి నిరుడు వివాహం జరిగింది.
పెళ్లి తర్వాత ఆదిత్యతో కలిసి భవ్యకీర్తి స్విట్జర్లాండ్ వెళ్లిపోయింది. అక్కడికి వెళ్లాక ఆదిత్య సంసారానికి పనికిరాడనే విషయం ఆమెకు తెలిసింది. భవ్యకీర్తి భర్తను, అత్తామామలను నిలదీసింది. విషయాన్ని హైదరాబాద్లో ఉండే తమ తల్లిదండ్రులకు చెప్పింది.
దాంతో అత్తింటివారు భవ్యకీర్తిని వేధించడం ప్రారంభించారు. ఫోన్లు అందుబాటులో లేకుండా చేసి గృహనిర్బంధం చేశారు. స్విట్జర్లాండ్ అధికారులతో మాట్లాడి బాధితురాలికి గృహనిర్బంధం నుంచి ఓ పోలీసు అధికారి సహాయంతో విముక్తి కల్పించి ఇండియాకు పంపించారు.
నిరుడు అక్టోబర్లో హైదరాబాద్ సీసీఎస్ పోలీసులకు ఫిర్యాదు యువతి కుటుంబ సభ్యులు చేశారు. బంధువులు చనిపోతే హైదరాబాద్ నగరానికి వచ్చిన కోసం రవిశంకర్, జానకి కేసు గురించి తెలుసుకొని ముందస్తు బెయిల్ కోసం కోర్టును ఆశ్రయించారు.
షరతులతో బెయిల్ మంజూరు చేసిన సెషన్స్ కోర్టు వారి పాస్పోర్టులను డిపాజిట్ చేయాలని, దర్యాప్తు అధికారులకు అందుబాటులో ఉంటూ వారికి సహకరించాలని, వారానికి ఒకరోజు దర్యాప్తు అదికారుల ముందు హాజరుకావాలని ఆదేశించింది. కోర్టు ఆదేశాలను కూడా బేఖాతరు చేసేందుకు ప్రయత్నించిన రవిశంకర్, జానకీ పోలీసుల కళ్లుగప్పి స్విట్జర్లాండ్కు పారిపోయే ప్రయత్నం చేశారు.
ముందుగా ముంబయ్లో పనులు ఉన్నాయని చెప్పి హైదరాబాద్ నుంచి ముంబై వెళ్లిపోయి, అక్కడ ఎయిర్ టికెట్లు బుక్చేసుకుని స్విట్జర్లాండ్ వెళ్లడానికి ప్రయత్నిస్తూ ముంబై విమానాశ్ర యంలో జానకి పట్టుబడ్డారు. రవిశంకర్ పరారయ్యాడు. అతడి కోసం పోలీసులు గాలిస్తున్నారు.