పరిశోధక విద్యార్థి ఆత్మహత్య: అఫ్జల్గురు ఉరితీతకు లింకేమిటి, అసలేం జరిగింది?
హైదరాబాద్: పరిశోధక విద్యార్థి రోహిత్ ఆత్మహత్యతో హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయం అట్టుడుకుతోంది. తీవ్ర ఉద్రిక్తత మధ్య రోహిత్ శవాన్ని పోలీసులు శనివారం ఉదయం పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. సెంట్రల్ యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ (హెచ్సీయూ)లో పరిశోధక విద్యార్థుల మధ్య కొన్నాళ్ల క్రితం తలెత్తిన వివాదం తీవ్ర స్థాయికి చేరుకుంది.
ఆ వివాదానికి మూలం కాశ్మీర్ వేర్పాటువాది అఫ్జల్గురు ఉరితీత. ఆ ఉరిని ఖండిస్తూ అంబేద్కర్ స్టూడెంట్ అసోసియేషన (ఏఎస్ఏ) నేతలు హెచసీయూలో నిరసన తెలిపారు. ప్రభుత్వ నిర్ణయం మానవ హక్కులను కాలరేసేలా ఉందని విమర్శలు చేశారు. అయితే దేశద్రోహానికి పాల్పడిన ఉగ్రవాదికి అనుకూలంగా మాట్లాడడం మంచిది కాదని వర్సిటీలోని ఏబీవీపీ అధ్యక్షుడు సుశీల్ కుమార్ సోషల్ మీడియాలో కామెంట్ చేశారు.

ఈ స్థితిలో 2015 ఆగస్టు 3వ తేదీ రాత్రి అంబేద్కర్ స్టూడెంట్స్ యూనియన్ సంఘ సభ్యులు తనపై దాడి చేశారని, ఫేస్బుక్ కామెంట్స్పై తనతో క్షమాపణ పత్రం కూడా రాయించారని సుశీల్కుమార్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆ తర్వాత మదీనాగూడలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో ఆయన రెండురోజులపాటు చికిత్స పొందారు. సుశీల్కుమార్పై దాడి చేసిన విద్యార్థులను పోలీసులు ఠాణాకు పిలిపించి కౌన్సెలింగ్ చేసి వదిలిపెట్టారు.
దాంతో సరిపెట్టకుండా తమకు న్యాయం చేయాలంటూ బాధితుడు సుశీల్కుమార్ తరఫున ఏబీవీపీ అప్పట్లో ఆందోళన చేసింది. దీంతో ఫేస్బుక్ వివాదంపై నిజానిజాలు నిర్ధారించేందుకు విశ్వవిద్యాలయం యాజమాన్యం ఎగ్జికూటివ్ కౌన్సిల్ (ఈసీ) సబ్కమిటీని ఏర్పాటు చేసింది. దానిపై పూర్తిస్థాయి విచారణ చేపట్టిన సబ్ కమిటీ ఐదుగురు విద్యార్థులపై సాంఘిక బహిష్కరణ విధించాల్సిందిగా సూచించింది.

ఆ నివేదిక మేరకు విశ్వవిద్యాలయం పరిశోధక విద్యార్థులు దొంత ప్రశాంత్, రోహిత్ వేముల, గుంట శేషయ్య, పెద్దపూడి విజయ్, సుం కన్నలు సెమిస్టర్ కాలం(6నెలలు) వర్సిటీలోని బహిరంగ ప్రదేశాల్లో గుంపుగా తిరగరాదని, వర్సిటీ వసతిగృహాల్లో నివాసం ఉండరాదని, యూనియన్ ఎన్నికల్లో పాల్గొనరాదని, ఎటువంటి ఆందోళన కూడా చేయరాదని యాజమాన్యం నిషేధం విధించింది.
14వ రోజుకు చేరిన నిరసన
ఆ ఐదుగురు దళిత విద్యార్థులపై చేసిన సాంఘిక బహిష్కరణ వేటు ఎత్తివేయాలంటూ జనవరి 4 నుంచి విద్యార్థులు నిరసన ప్రారంభించారు. హెచ్సీయూలోని షాపింగ్ కాంప్లెక్స్ సెంటర్లో సాంఘిక బహిష్కరణకు గురైన విద్యార్థులతో కలిసి నిరసన చేపట్టారు. తాము ఎవరిపైనా దాడి చేయకపోయినా దురుద్దేశంతోనే బహిష్కరణ వేటు వేశారని వారు ఆరోపిస్తున్నారు.

షాపింగ్ కాంప్లెక్స్ సెంటర్లో వారికి ఏబీవీపీ మినహా మిగిలిన 14 విద్యార్థి సంఘాలూ సంఘీభావం ప్రకటించాయి. ఈ 14 విద్యార్థి సంఘాల ప్రతినిధులతో జాయింట్ యాక్షన కమిటీ (జేఏసీ) ఏర్పాటైంది. ఈ కమిటీ ఆధ్వర్యంలో 14 రోజులుగా అక్కడ పలు నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.












Click it and Unblock the Notifications