పలువురికి నోటీసులు - పబ్ లో డ్రగ్స్ పై సీరియస్ : పోలీసు అధికారులపై చర్యలు..!!
బంజారాహిల్స్లోని ర్యాడిసన్ బ్లూ హోటల్పై టాస్క్ఫోర్స్ పోలీసుల దాడితో అనేక కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. పబ్బులో కొందరు డ్రగ్స్ వాడుతూ రెడ్ హ్యాండెడ్ గా దొరికినట్లు వార్తలు వస్తున్నాయి. పలువురు సెలబ్రెటీల పిల్లలు పోలీసుల దాడుల్లో పట్టుబడ్డారు. సమయానికి మించి నడిపినందుకు పబ్పై కేసు నమోదు చేశారు. ఈ పబ్లో పోలీసులు కొకైన్, గంజాయి, ఐఎస్డీలను గుర్తించారు. యజమాని సహా 130 మందిని అదుపులోకి తీసుకున్నారు.
వారిలో 33మంది యువతులు, 95 మంది యువకులు ఉన్నట్లు పోలీసులు తెలిపారు. పోలీసులు అదుపులోకి తీసుకున్న వారిలో ప్రముఖ సింగర్, బిగ్బాస్ విజేత రాహుల్ సిప్లిగంజ్, సినీ ప్రముఖ నటుడు కుమార్తె నిహారిక ఉన్నారు. పట్టుబడినవారిలో మరికొందరు ప్రముఖులు ఉన్నట్లు తెలుస్తోంది.
పబ్ లో ప్రముఖలు పిల్లలు
మరోవైపు అదుపులో ఉన్న వారి దగ్గర నుంచి వివరాలు సేకరించిన అనంతరం పోలీసులు వారిని విడిచిపెట్టారు. ఈ వ్యవహారంలో పబ్ యజమానులపై కేసు నమోదు చేశారు. పబ్కు డ్రగ్స్ సరఫరాపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. పబ్లో ఎవరెవరు డ్రగ్స్ తీసుకున్నారో పరిశీలిస్తున్నారు.
ఈ పబ్ మాజీ ఎంపీ కుమర్తె కొంత కాలం క్రితం వరకు నిర్వహించారు. తాజాగా, మరొకరికి లీజు మీద అప్పగించారు. పోలీసులు పబ్ పైన దాడి చేసిన సమయంలో పబ్లో డ్రగ్స్(కొకైన్)ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అయితే, పోలీసుల రాకతో పబ్లోని యువతీ యువకులు డ్రగ్స్ను కిటికీ నుంచి కింద పడేశారు.
పోలీసుల నోటీసులు.. విచారణ
కాగా, బయట పడేసిన మత్తుపదార్థాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది. ఈ వ్యవహారంలో నలుగురికి పోలీసులు నోటీసలు ఇచ్చినట్లు చెబుతున్నారు. పబ్ పై పోలీసులు జరిపిన రైడ్ లో గల్లా అశోక్ పేరు ప్రచారంలోకి వచ్చింది.
ఈ వ్యవహారంలో గల్లా అశోక్ కి ఎలాంటి సంబంధం లేదు. దయచేసి ఇలాంటి నిరాధారమైన వార్తలని మీ మీడియాలో ప్రసారం చెయ్యొద్దని విజ్ఞప్తి చేస్తున్నాం అంటూ గల్లా కుటుంబం ప్రెస్ నోట్ ను విడుదల చేశారు. . గతంలో కూడా రాహుల్ పై ఓ పబ్ లో దాడి జరిగిన విషయం తెలిసిందే.
ఇద్దరు పోలీసు అధికారులపై చర్యలు
మరోమారు పబ్ సంఘటనలోనే రాహుల్ దొరికిపోవడం సంచలనంగా మారింది. 150 మందికి పైగా ఈ కేసులో వున్నట్టు తెలుస్తోంది. రాహుల్ సిప్లిగంజ్ కి కౌన్సిలింగ్ ఇచ్చారు. అయితే, డ్రగ్స్ విషయంలో ఉదాసీనంగా వ్యవహరించారంటూ బంజారా హిల్స్ ఇన్స్ పెక్టర్ ను పోలీసు కమిషనర్ సస్పెండ్ చేసారు. ఏసీపీ కి ఛార్జ్ మెమో ఇచ్చారు. ఈ విషయంలో కఠినంగా వ్యవహరిస్తామని... బాధ్యులను వదిలేది లేదని పోలీసు ఉన్నతాధికారులు స్పష్టం చేసారు.