మొహమాటాల్లేవ్: మోడీకి కేసీఆర్ సర్కార్ ఘాటు రిప్లై: వేస్టేజ్ లెక్కలివే: ఒప్పుకొంటూనే నిప్పులు
న్యూఢిల్లీ: అత్యంత విలువైన కరోనా వైరస్ వ్యాక్సిన్.. రెండు తెలుగు రాష్ట్రాల్లో వృధా అవుతోందంటూ సాక్షాత్తూ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చేసిన ప్రకటనలపై తెలంగాణలో అధికారంలో ఉన్న కేసీఆర్ సర్కార్ స్పందించింది. కేంద్రానికి ఘాటుగా బదులిచ్చింది. లెక్కలతో సహా వివరాలను సిద్ధం చేసింది. ఏపీ, తెలంగాణలో 17.6 శాతం మేర వ్యాక్సిన్ వృధా అవుతోందని, దీన్ని అరికట్టాలంటూ ప్రధాని, కేంద్ర వైద్య మంత్రిత్వ శాఖ అధికారులు చేసిన వ్యాఖ్యల్లో ఏ మాత్రం వాస్తవం లేదని తేల్చేసింది. మిగిలిన రాష్ట్రాలతో పోల్చుకుంటే.. అతి తక్కువ శాతంలో వ్యాక్సిన్ వృధా రికార్డయిందని పేర్కొంది.
వ్యాక్సిన్ వేస్టేజీ 1.22 శాతమే
తెలంగాణలో కరోనా వైరస్ వ్యాక్సిన్ వృధా అవుతోందనే విషయాన్ని కేసీఆర్ ప్రభుత్వం అంగీకరించింది. దాని పర్సంటేజీ ప్రధాన మంత్రి చెప్పిన స్థాయిలో లేదని పేర్కొంది. 1.22 శాతం మాత్రమే వృధా అవుతోందని స్పష్టం చేసింది. ఆ కొద్దిపాటి వ్యాక్సిన్ కూడా ఎందుకు? ఎలా వృధా అవుతోందనే విషయాన్ని వివరించింది. ఈ మేరకు ప్రజారోగ్య విభాగం డైరెక్టర్ డాక్టర్ జీ శ్రీనివాస రావు ఓ ప్రకటన విడుదల చేశారు. బఫర్ స్టాక్, సైనికులకు అందజేసిన డోసులను పరిగణనలోకి తీసుకోవట్లేదని ఆయన స్పష్టం చేశారు. కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన గణాంకాల్లో పూర్తిగా అవాస్తవమైనవని ఆయన స్పష్టం చేసినట్టయింది.
వేస్టేజీ ఇలా..
ఇ-విన్ పోర్టల్ ప్రకారం.. జారీ చేసిన డోసుల సంఖ్య 9,52,550. ఇందులో రాష్ట్ర పరిధిలో ఉన్న సాయుధ బలగాల కోసం అందజేసిన డోసులు-40,540, బఫర్ స్టాక్ డోసులు-25,540. ఈ రెండూ తీసివేయగా మిగిలిన వ్యాక్సిన్ డోసుల సంఖ్య 8,86,330. కోవిన్ డాష్బోర్డులో సూచించిన వివరాల ప్రకారం.. తెలంగాణలో ఇప్పటిదాకా అర్హులకు వేసిన వ్యాక్సిన్ డోసులు 8,75,478. 10,852 డోసుల మేర వ్యాక్సిన్ వృధా అయిందని శ్రీనివాసరావు వివరించారు. దీని శాతం 1.22 మాత్రమేనని పేర్కొన్నారు.
ఆ డోసులు లెక్కలోకి తీసుకోవాలి..
దేశంలో వ్యాక్సినేషన్ ప్రక్రియను పర్యవేక్షించడానికి కేంద్రం వినియోగిస్తోన్న సాఫ్ట్వేర్లో అందుబాటులో ఉన్న 40,540 బఫర్ స్టాక్, రాష్ట్రం పరిధిలో ఉన్న సైనికుల కోసం కేటాయించిన 25,540 వ్యాక్సిన్ డోసుల వివరాలను కూడా కేంద్ర ప్రభుత్వం పరిగణలోకి తీసుకోవాల్సిన అవసరం ఉందని శ్రీనివాసరావు అన్నారు. వాటిని పరిగణనలోకి తీసుకోక పోవడం వల్లే తప్పుడు అంకెలు ప్రచారంలోకి వచ్చాయని ఆయన స్పష్టం చేశారు. తమ వద్ద ఉన్న లెక్కలన్నింటినీ కేంద్ర ప్రభుత్వానికి పంపిస్తామని పేర్కొన్నారు. తెలంగాణలో 17.6 శాతం మేర వ్యాక్సిన్ డోసులు వృధా అవుతున్నాయనడం సరి కాదని వ్యాఖ్యానించారు.
అత్యదికం.. ఏపీ, తెలంగాణల్లోనే
రెండు తెలుగు రాష్ట్రాల్లో అత్యధిక శాతం కరోనా వైరస్ వ్యాక్సిన్ వృధా అవుతోందంటూ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆగ్రహం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. ఈ నెల 17వ తేదీన నిర్వహించిన ముఖ్యమంత్రుల వీడియో కాన్ఫరెన్స్లో ఈ విషయాన్ని వెల్లడించారు. తెలంగాణలో 17.6, ఏపీలో 11.6, ఉత్తర ప్రదేశ్-9.4, కర్ణాటక-6.6 శాతం మేర వ్యాక్సిన్ వృధా అవుతోందని పేర్కొన్నారు. జాతీయ సగటు 6.5గా నమోదైందని పేర్కొన్నారు. దీన్ని నివారించాల్సిన అవసరం ఉందంటూ ఆయన ముఖ్యమంత్రులకు వార్నింగ్ ఇచ్చారు. దీనితో తెలంగాణ ప్రభుత్వం పూర్తి స్థాయి లెక్కలను సేకరించింది.