మంచు విష్ణు ఆఫీస్లో చోరీ: అతనిపై అనుమానాలు: పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో..
హైదరాబాద్: ప్రముఖ నటుడు, మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ అధ్యక్షుడు మంచు విష్ణు కార్యాలయంలో చోరీ జరిగింది. హైదరాబాద్ ఫిల్మ్నగర్లో ఉన్న మా ఆఫీస్లో గుర్తు తెలియని వ్యక్తులు చోరీకి పాల్పడ్డారు. ఆయన వినియోగించే హెయిర్ డ్రెస్సింగ్ సామాగ్రిని దొంగిలించారు. వాటి విలువ సుమారు అయిదు లక్షల రూపాయలకు ఉంటుందని అంచనా. ఈ ఘటనపై మంచు విష్ణు మేనేజర్ సంజయ్ జూబ్లీహిల్స్ పోలీసులకు లిఖితపూరకంగా ఫిర్యాదు చేశారు. ఆయన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు.
మంచు విష్ణు వద్ద హెయిర్ డ్రెస్సర్గా పని చేస్తోన్న నాగ శ్రీను ఈ చోరీకి పాల్పడి ఉంటాడనే అనుమానాలు ఉన్నాయి. ఈ చోరీ తరువాత అతను కనిపించట్లేదంటూ మేనేజర్ సంజయ్.. జూబ్లీహిల్స్ పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో తెలిపారు. లిఖితపూరకంగా ఇచ్చిన ఫిర్యాదులో పలు విషయాలను పొందుపరిచారు. హెయిర్ డ్రెస్సర్ నాగశ్రీనుపై అనుమానాలను వ్యక్తం చేశారు. బోరబండకు చెందిన నాగశ్రీను చాలాకాలం నుంచి మంచు విష్ణు వద్ద హెయిర్ స్టైలిస్ట్గా పని చేస్తున్నాడని మేనేజర్ పోలీసులు వివరించారు.
విష్ణుకు చెందిన హెయిర్ డ్రెస్సింగ్, మేకప్ సామాగ్రిని ఎవరికీ చెప్పకుండా అతను తనవెంట తీసుకెళ్లాడని, ఇప్పటి వరకు అతని ఆచూకీ తెలియరావట్లేదని ఫిర్యాదులో పేర్కొన్నారు. నాగశ్రీనుకు ఫోన్ చేయడానికి ప్రయత్నించినప్పటికీ అతను అందుబాటులోకి రాలేదని చెప్పారు. ఈ నెల 17వ తేదీ నుంచి అతను కనిపించట్లేదని, ఎవరికీ సమాచారం ఇవ్వకుండా విధులకు కూడా హాజరు కావట్లేదని అన్నారు. అప్పటి నుంచే హెయిర్ డ్రెస్సింగ్ సామాగ్రి మాయమైందని వివరించారు.
అతనే ఈ చోరీకి పాల్పడినట్టు అనుమానిస్తున్నామని మేనేజర్ సంజయ్ జూబ్లీహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ ఆరంభించారు. నాగశ్రీను ఫోన్ నంబర్, వ్యక్తిగత వివరాలను పోలీసులు మేనేజర్ను అడిగి తెలుసుకున్నారు. అన్ని కోణాల్లోనూ దర్యాప్తు చేపట్టారు. మంచు విష్ణు ప్రస్తుతం డీ అండ్ డీ: డబుల్ డోస్ మూవీలో నటిస్తున్నారు. శ్రీనువైట్ల దర్శకుడు.