ఆ ప్రచారంలో వాస్తవం లేదు: టీజీఎస్ఆర్టీసీ

తమ డిపోలను ప్రైవేట్‌పరం చేస్తున్నారని జరుగుతున్న ప్రచారంలో ఏమాత్రం వాస్తవం లేదని తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ(TGSRTC) యాజమాన్యం స్పష్టం చేసింది. సంస్థ ప్రతిష్టకు భంగం కలిగించేలా కొందరు చేస్తోన్న ఈ దుష్ప్రచారాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్లు టీజీఎస్‌ఆర్టీసీ ప్రకటించింది. కేంద్ర ప్రభుత్వ ఈవీ పాలసీ ప్రకారమే పర్యావరణహితమైన ఎలక్ట్రిక్‌ బస్సులను ప్రయాణికులకు అందుబాటులోకి సంస్థ తీసుకువస్తోందని పేర్కొంది.

డిపోల్లో ఎలక్ట్రిక్ బస్సులతో సహా అన్ని బస్సుల ఆపరేషన్స్‌ నిర్వహణ పూర్తిగా టీజీఎస్‌ఆర్టీసీ ఆధ్వర్యంలోనే జరుగుతుందని, అందులో ఎలాంటి అనుమానాలు అవసరం లేదని స్పష్టం చేసింది. కేంద్రప్రభుత్వ ఫాస్టర్‌ అడాప్షన్‌ అండ్‌ మ్యానుపాక్చరింగ్‌ ఆఫ్‌ ఎలక్ట్రిక్‌ వెహికిల్స్‌(ఫేమ్‌)-1 స్కీమ్‌లో భాగంగా 2019 మార్చిలో 40 ఎలక్ట్రిక్‌ ఏసీ బస్సులను ఇదే విధానంలో ప్రవేశపెట్టడం జరిగింది. ఒలెక్ట్రా కంపెనీతో గ్రాస్ కాస్ట్ కాంట్రాక్ట్(జీసీసీ) పద్దతిన ఒప్పందం చేసుకుని పుష్ఫక్‌ పేరుతో హైదరాబాద్‌ ఎయిర్‌పోర్ట్‌ మార్గంలో ఈ బస్సులను సంస్థ నడుపుతోంది.

There is no truth in the campaign that depots will be privatized TGSRTC

హైదరాబాద్‌లోని కంటోన్మెంట్‌, మియాపూర్‌-2 డిపోల నుంచి వాటిని తిప్పుతోంది. బస్సుల మెయిన్‌టనెన్స్‌, చార్జింగ్‌ మినహా ఆపరేషన్స్‌ అంతా టీజీఎస్‌ఆర్టీసీ ఆధ్వర్యంలోనే జరుగుతోంది. 2023 మార్చిలో కేంద్ర ప్రభుత్వ నేషనల్‌ ఎలక్ట్రిక్‌ బస్‌ ప్రోగ్రాం(ఎన్‌ఈబీపీ) కింద 500 ఇంటర్‌ సిటీ బస్సులను టెండర్ ద్వారా జేబీఎం కంపెనీకి ఆర్డర్‌ ఇవ్వడం జరిగింది. అందులో 48 ఈ-సూపర్‌ లగ్జరీ బస్సులు ప్రస్తుతం రాగా.. వాటిలో 35 కరీంనగర్‌-2 డిపోకు, 13 నిజామాబాద్‌-2 డిపోనకు సంస్థ కేటాయించింది.

ఈ ఎలక్ట్రిక్‌ బస్సుల కోసం అవసరమైన చార్జింగ్‌ స్టేషన్ల నిర్మాణం డిపోల్లో పూర్తి కావస్తుండటంతో.. వాటిని త్వరలోనే ప్రారంభించేందుకు టీజీఎస్‌ఆర్టీసీ యాజమాన్యం ఏర్పాట్లు చేస్తోంది. అలాగే, ప్రజల రవాణా అవసరాలు, కాలుష్య నివారణను దృష్టిలో పెట్టుకుని 2023లో 550 ఎలక్ట్రిక్‌ బస్సులకు టెండర్లను సంస్థ పిలిచింది. అందులో 500 సిటీ బస్సులు, హైదరాబాద్‌-విజయవాడ మార్గంలో 50 ఎలక్ట్రిక్‌ ఏసీ బస్సులున్నాయి. అందులో ప్రస్తుతం సిటీలో 74 ఎలక్ట్రిక్‌ బస్సులు నడుస్తుండగా.. విజయవాడ మార్గంలో ఈ-గరుడ పేరుతో 10 బస్సులు తిరుగుతున్నాయి.

దశలవారీగా ఈ ఎలక్ట్రిక్‌ బస్సులను సంస్థ అందుబాటులోకి తెస్తోంది. ఎలక్ట్రిక్‌ బస్సుల వినియోగంలో దేశవ్యాప్తంగా అవలంభిస్తోన్న ఈవీ పాలసీనే 2019 నుంచి టీజీఎస్‌ఆర్టీసీ అమలు చేస్తోంది. ఎలక్ట్రిక్‌ బస్సులను నేరుగా కొనాలంటే వ్యయంతో కూడుకున్న పని. ఈ నేపథ్యంలోనే కేంద్ర ప్రభుత్వ ఈవీ పాలసీ మేరకు గ్రాస్ కాస్ట్ కాంట్రాక్ట్(జీసీసీ) పద్దతిన అంటే బస్సు తిరిగే కిలోమీటర్ల ప్రకారం కంపెనీలకు చెల్లింపులు చేయడం జరుగుతుంది.

ప్రతి డిపో పరిధిలో రూరల్‌, అర్బన్‌, తదితర భిన్నమైన రూట్లు ఉంటాయి. ఎలక్ట్రిక్‌ బస్సులను అన్ని రూట్లలో తిప్పడం సాధ్యపడదు. ఎలక్ట్రిక్‌ బస్సులు తిరిగే కిలోమీటర్ల సామర్థ్యాన్ని బట్టి రూట్లను సంస్థ గుర్తిస్తుంది. ప్రతి డిపోలోనూ ఎలక్ట్రిక్‌, డీజిల్‌ మిశ్రమం ఉంటుంది. ప్రైవేట్ అద్దె బస్సుల మాదిరిగానే ఎలక్ట్రిక్ బస్సులన్నీ టీజీఎస్‌ఆర్టీసీ ఆధ్వర్యంలోనే నడుస్తాయి. ఆ బస్సుల ద్వారా వచ్చే టికెట్ ఆదాయం నేరుగా సంస్థకే వస్తోంది. ఒప్పందం ప్రకారం తిరిగిన కిలోమీటర్ల లెక్కన కంపెనీలకు నగదును చెల్లిస్తుంది. డిపోలు ప్రైవేట్‌ వ్యక్తుల చేతుల్లోకి వెళ్తాయనడంలో నిజం లేదు. కొందరు ఉద్దేశపూర్వకంగా చేస్తోన్న ఈ ప్రచారాన్ని నమ్మొద్దని సిబ్బందికి, ప్రజలకు సంస్థ విజ్ఞప్తి చేస్తోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+