58 నుంచి 60 అడుగులు, త్వరలో పేరు నిర్ణయిస్తాం : కర్రపూజతో ఖైరతాబాద్ గణేశుడికి అంకురార్పణ
హైదరాబాద్ : వినాయక చవితి అంటే ఠక్కున గుర్తొచ్చే పేరు ఖైరతాబాద్ బొజ్జ గణపయ్య. ప్రతి ఏటా విభిన్న రూపాల్లో భక్తులకు దర్శనమిస్తుంటాడు. ఈసారి వినాయక చవితి కోసం గణపయ్య విగ్రహా తయారీకి కర్ర పూజతో మంగళవారం అంకురార్పణ చేశారు. శిల్పి రాజేంద్రన్, 120 మంది కళాకారులు వినాయకుడిని సుందరంగా తీర్చిదిద్దనున్నారు.

అంకురార్పణ ..
భక్తులకు అనుగ్రహం ఇచ్చే విఘ్నేశుడిని తీర్చిదిద్దేందుకు రాజేంద్రన్ అండ్ కో సిద్ధమైంది. ఖైరతాబాద్ గణేశ్ మండపం వద్ద మహా గణనాథుడి విగ్రహ నిర్మాణ పనులకు మంగళవారం మంచిరోజు కావడంతో కర్ర పూజ చేపట్టారు. 65వ ఏట అడుగిడబోతోన్న భాగ్యనగర్ ఉత్సవ్ కమిటీ వినాయకుడి ఎత్తు, పేరును మరికొద్దిరోజుల్లో ఖరారు చేస్తామని స్పష్టంచేసింది.
15 రోజుల తర్వాత కంటిన్యూ ..
నిన్న కర్ర పూజతో మొదలైన పనులు .. మరో 15 రోజుల తర్వాత నిర్విరామంగా జరుగుతాయని నిర్వాహకులు పేర్కొన్నారు. దాదాపు 4 నెలలపాటు శిల్పులు కష్టపడి వినాయకుడి ప్రతిమను తీర్చిదిద్దుతారని పేర్కొన్నారు. ఈసారి 58 నుంచి 60 అడుగుల ఎత్తులో విగ్రహం నిర్మాణం జరిగే అవకాశం ఉంది. అయితే ఎత్తు తగ్గించమని విజప్తి వస్తోన్న నేపథ్యంలో ఉత్సవ కమిటీ త్వరలో నిర్ణయం తీసుకోబోనుంది. కర్ర పూజ కార్యక్రమంలో ఉత్సవ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.












Click it and Unblock the Notifications