నకిలీ విత్తనాలతో నిండా మునిగిన వేలాది రైతన్నలు ... పరిహారం కోసం ధర్నా
ఆరుగాలం శ్రమించినా అన్నదాతల ఆకలి బాధ మాత్రం తీరడం లేదు. దుక్కులు దున్ని నాట్లు వేసిన నాటి నుండి పంట చేతికొచ్చే వరకు రైతన్న ఏదో ఒక రకంగా మోసపోతున్నారు. రైతాంగ సంక్షేమం కోసం పెట్టుబడి సాయం చేస్తున్నామని చెబుతున్న ప్రభుత్వం రైతులకు కావలసిన అసలు సహాయాన్ని చెయ్యలేక పోతుంది. నకిలీ విత్తనాలను అరికట్టలేకపోతోంది. అలాగే పండించిన పంటకు గిట్టుబాటు ధర అందించటంలో కూడా ప్రభుత్వం విఫలం అవుతోంది. ఫలితంగా అన్నదాతల కష్టాలు మాత్రం తీరడం లేదు.వేల సంఖ్యలో రైతాంగం నకిలీల బారిన పడి నష్టపోతుంది.

సూర్యాపేట జిల్లాలో నకిలీ వారి విత్తనాలు.. ఆందోళనలో రైతులు
తాజాగా సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ లోని రైతులు నకిలీ విత్తనాలతో మోసపోయారు. నాట్లు వేసిన నెల రోజులకే కంకులు వచ్చిన పంటను చూసి లబోదిబోమన్నారు. వ్యవసాయ అధికారులకు తమకు జరిగిన నష్టాన్ని తెలియజేశారు. ఆ విత్తనాలను కొనుగోలు చేసిన కంపెనీకి సంబంధించిన బ్యాగులు ప్లకార్డులతో ధర్నా చేశారు. తమకు నష్టపరిహారం ఇప్పించాలని డిమాండ్ చేశారు. తమను నకిలీ విత్తనాలతో మోసం చేసిన కంపెనీపై చర్యలు చేపట్టాలని, తమకు నకిలీ విత్తనాలు అంటగట్టిన డిస్ట్రిబ్యూటర్ మీద పీడీ యాక్ట్ పెట్టాలని రైతులు ఆందోళన చేస్తున్నారు.

నకిలీవిత్తనాలు అమ్మిన ఆదిత్య కంపెనీ సీజ్ చెయ్యాలి .. ఎకరాకు 60 వేలు నష్టపరిహారం ఇవ్వాలంటున్నరైతులు
సూర్యాపేట జిల్లా హుజూర్నగర్లోని వ్యవసాయశాఖ డివిజన్ కార్యాలయం ఎదుట రైతులు ధర్నా నిర్వహించారు. నాటువేసిన నెలరోజులకే కంకులు వచ్చిన పంట, అభిరుచి విత్తనాల బ్యాగులు, ప్లకార్డులతో ధర్నాలో పాల్గొన్నారు. రైతులు మాట్లాడుతూ ఆదిత్య కంపెనీకి చెందిన అభిరుచి వరి సీడ్స్ రైతులకు అంటగట్టి మోసం చేశారని ఆరోపించారు. నకిలీ విత్తనాల వల్ల ఉమ్మడి జిల్లాలో వేలాది మంది రైతులు నష్టపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. నకిలీ విత్తనాల వల్ల ఎకరానికి కనీసం 15 బస్తాలు కూడా దిగుబడి వచ్చే లేదని రైతులు లబోదిబోమంటున్నారు. ఎకరానికి 40 బస్తాల దిగుబడి రావాల్సి ఉండగా ఈ విత్తనాలు విత్తి మోసపోయామని వాపోతున్నారు.
వరి నాటిన నెలరోజులకే కంకులు రావడంతో దిగుబడి తగ్గిపోతుందని, నష్టపోయిన రైతాంగానికి ఎకరానికి రూ.60వేలు నష్టపరిహారం చెల్లించాలని, నకిలీ విత్తనాలు అంటగట్టిన డీలర్లపై పీడీ యాక్ట్ నమోదు చేయాలని, అభిరుచి విత్తనాలు మార్కెట్లో అమ్మిన ఆదిత్య కంపెనీని సీజ్ చేయాలని డిమాండ్ చేశారు.

అధికారుల నిర్లక్ష్యం వల్లే రైతాంగానికి నష్టం .. న్యాయం కోసం కోర్టుకైనా వెళ్తాం
పలు కంపెనీలు మార్కెట్లో నకిలీ విత్తనాలు అమ్ముతున్నప్పటికీ వ్యవసాయ అధికారులు పట్టించుకోవడం లేదని నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఫలితంగా రైతులు మోస పోవాల్సి వస్తుందని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. నాసిరకం విత్తనాలకు సంబంధించి హైకోర్టును ఆశ్రయిస్తామని పేర్కొన్నారు. అధికారులు డీఎన్ఎ నివేదిక, పంచనామా రిపోర్టు ఇవ్వాలని ఇరవైరోజులుగా కోరుతున్నా ఇవ్వడం లేదని ఆరోపించారు. రైతులకు న్యాయం చేసే వరకు పోరాటం చేస్తామన్నారు.












Click it and Unblock the Notifications