అన్న బాటలో భూకబ్జాలు , బెదిరింపులు .. నయీం చెల్లి, బావ అరెస్ట్
తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన గ్యాంగ్ స్టర్ నయీం మరణించినా నయీం ముఠా కార్యకలాపాలు మాత్రం కొనసాగుతూనే ఉన్నాయి. రెండు నెలల క్రితం నయీం బినామీ ఆస్తులను అక్రమంగా విక్రయించేందుకు ప్రయత్నించిన అనుచరులను, నయీం భార్యను పోలీసులు అరెస్టు చేశారు. ఇక తాజాగా బెదిరింపులకు, భూ కబ్జాలకు పాల్పడుతున్న నయీం చెల్లిని, బావను పోలీసులు అరెస్ట్ చేశారు.
ఖజానా ఖాళీ అయ్యిందా ... తెలంగాణా ఆర్ధిక పరిస్థితి మరీ ఇంత దారుణంగా తయారైందా ?
అమయాకులను బెదిరించి భూకబ్జాలకు పాల్పడుతున్న నయీం చెల్లి, బావ
నయీం అండతో అతడి సోదరి అయేషా బేగం, ఆమె భర్త మహమ్మద్ అబ్దుల్ సలీమ్ భూకబ్జాలకు పాల్పడ్డారు. అమాయకులను బెదిరించి, కోట్ల రూపాయలు విలువ చేసే భూములను కబ్జా చేశారు. 2003లో భువనగిరిలోని సర్వే నంబర్లు 65 నుంచి 70లలో ఉన్న 68 ఎకరాల భూమిని కబ్జా చేశారు. కేసీ రెడ్డి అనే వ్యక్తి నుంచి ఆ భూమిని బలవంతంగా లాక్కొన్నారు.2007లో లండన్ టౌన్షిప్లో 2,983 చదరపు గజాల విస్తీర్ణంలో ఉన్న 8 ఫ్లాట్లు, మరో కేసులో 8 ఫ్లాట్లు, ఇంకో కేసులో 8 ఫ్లాట్లు బెదిరించి తీసుకున్నారు. ఇదే క్రమంలో 2006లో కూర శ్రీనివాస్, కూర శ్రీదేవికి చెందిన 9.6 ఎకరాలను, తుక్కాపురం గ్రామంలో రాసాల పద్మ అనే మహిళకు చెందిన 180 గజాల స్థలాన్ని ఆక్రమించుకున్నారు.
భరించలేక బాధితుల ఫిర్యాదు .. అరెస్ట్ చేసిన పోలీసులు
దీంతో బాధితులు అయేషా, అబ్డుల్ సలీమ్లపై హైదరాబాద్లోని పహాడీ షరీఫ్, ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలోని కల్వకుర్తితో పాటు భువనగిరి పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదులు చేశారు. కేసులు నమోదు చేసిన పోలీసులు వీరిపై నిఘా పెట్టి సంగారెడ్డి జిల్లా కోహిర్లో ఉన్నట్లు సమాచారం అందడంతో పక్కా వ్యూహంతో అదుపులోకి తీసుకుని రిమాండ్కు తరలించారు. భూకబ్జాలు, బెదిరింపుల వ్యవహారంలో వీరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
భూకబ్జాలపై పోలీసుల ఉక్కుపాదం .. నయీం చెల్లి, బావలకు రిమాండ్
నయీమ్ ఎన్ కౌంటర్ తర్వాత కొంతకాలం పాటు స్తబ్దంగా ఉన్న నయీం ముఠా మళ్ళీ తన కార్యాకలాపాలను ప్రారంభించింది. ఈ నేపధ్యంలోనే పోలీసులు భూకబ్జాలు, బెదిరింపులకు పాల్పడే వారిపై ఉక్కు పాదం మోపటానికి సిద్ధం అయ్యారు. అందులో భాగంగా అందిన ఫిర్యాదుల మేరకు నయీం సోదరిని, బావను అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు.