రూ. 38వేలకు రెమిడిసివిర్ విక్రయం: ప్రభుత్వ ఆస్పత్రి స్టాఫ్ నర్సుతోపాటు ముగ్గురి అరెస్ట్
ఖమ్మం: ఖమ్మం ప్రభుత్వ ఆస్పత్రిలో కరోనా ఔషధం రెమిడిసివిర్ను అక్రమంగా విక్రయిస్తున్న ముగ్గురు సిబ్బందిని టాస్క్ఫోర్స్ పోలీసులు బుధవారం అరెస్ట్ చేశారు. అధిక ధరకు రెమిడిసివిర్ను విక్రయిస్తున్నారనే ముందస్తు సమాచారంతో ఓ నర్సుతపాటు ముగ్గురు ప్రభుత్వ ఆస్పత్రి సిబ్బందిని అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు.
ప్రభుత్వ ఆస్పత్రిలో విధులు నిర్వహిస్తున్న స్టాఫ్ నర్సు, ఇద్దరు ఔట్ సోర్సింగ్ సిబ్బంది కలిసి ఒక్కో రెమిడిసివిర్ ఇంజక్షన్ను రూ. 38 వేలకు విక్రయించేందుకు ప్రయత్నించారని పోలీసులు వెల్లడించారు. నిందితుల నుంచి ఆరు రెమిడిసివిర్ ఇంజక్షన్లను టాస్క్ ఫోర్స్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
ఇది ఇలావుండగా, తెలంగాణలో కరోనా కేసుల ఉధృతి కొనసాగుతోంది. రాష్ట్రంలో మంగళవారం రాత్రి 8 గంటల వరకు 77,435 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా.. కొత్తగా 6361 మంది కరోనా సోకినట్లు తేలింది. జీహెచ్ఎంసీ పరిధిలో 1225 కొత్త కేసులు నమోదయ్యాయి. దీంతో ఇప్పటి వరకు రాష్ట్రంలో కరోనా బారినపడినవారి సంఖ్య 4,69,722కు చేరింది.
Recommended Video
కరోనాతో రాష్ట్రంలో గత 24 గంటల్లో 51 మంది మరణించారు. ప్రస్తుతం రాష్ట్రంలో 77,704 యాక్టివ్ కేసులు ఉన్నాయని వైద్యారోగ్యశాఖ తెలిపింది. గత 24 గంటల్లో 8126 మంది కరోనా నుంచి కోలుకున్నారు. మరో 3802 మంది కరోనా రిపోర్టులు రావాల్సి ఉంది. కాగా, తెలంగాణలో సంపూర్ణ లాక్డౌన్ విధించే పరిస్థితి లేదని సోమేశ్ కుమార్ స్పష్టం చేశారు. అయితే, కరోనా రోగులకు మెరుగైన వైద్యం అందించడమే తమ ముందున్న లక్ష్యమని అన్నారు.